దశాబ్దాలు పట్టవచ్చు: ‘370’పై మలేషియా ఎయిర్లైన్స్
కౌలాలంపూర్: చైనా రాజధాని బీజింగ్కు వెళ్తూ మూడు నెలల క్రితం అదృశ్యమైన మలేషియా విమానం ఎంహెచ్-370 ఆచూకీ కనుగొనేందుకు ‘దశాబ్దాల' కాలం పట్టవచ్చని మలేషియా ఎయిర్లైన్స్ (ఎంఏఎస్) వాణిజ్య విభాగ ప్రధానాధికారి హగ్ డన్లీవీ తెలిపారు. ఈ విమాన శకలాలు హిందూ మహాసముద్రంలో చాలా ప్రాంతం మేర విస్తరించి ఉండవచ్చని చెప్పారు.
మార్గంమధ్యలో ఈ విమానం వెనుకకు మళ్లిందా, లేదా? అనే సమాచారాన్ని మలేషియా ప్రభుత్వం తెలియజేయడం లేదని ఆయన విమర్శించారు. జరగరానిది ఏదో జరిగి ఈ విమానం వెనుకకు మళ్లి ఉంటుందని తాను భావిస్తున్నానని హగ్ డన్లీవీ తెలిపారు. ఈ క్రమంలో ఏవైనా సంఘటనలు చోటుచేసుకుని ఉండవచ్చని.. అందుకే అది సురక్షితంగా వెనుకకు తిరిగి రాలేకపోయి ఉంటుందని అన్నారు.

బహుశా ఈ విమానం దక్షిణ హిందూ మహాసముద్రంలో ఎక్కడైనా కూలిపోయి ఉంటుందని నేను భావిస్తున్నట్లు తెలిపారు. ‘ఏదైనా ఒక విమానం సముద్రంలో కూలిపోతే కాంక్రీట్ను ఢీకొన్నట్టుగా ఉంటుంది. దాని శకలాలు చాలా దూరం మేరకు వ్యాప్తి చెందుతాయి. దక్షిణ హిందూ మహాసముద్రంలో పెద్ద పెద్ద పర్వతాలు, లోతైన లోయలు చాలా ఉన్నాయి.
కాబట్టి ఈ విమానం ఆచూకీ కనుగొనేందుకు దశాబ్దాల కాలం పట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు' అని ఆయన తెలిపినట్లు ‘ఈవెనింగ్ స్టాండర్డ్' పత్రిక పేర్కొంది. మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్కు వెళ్తూ మార్చి 8వ తేదీన అదృశ్యమైన ఈ విమానంలో ఐదుగురు భారతీయులు సహా మొత్తం 239 మంది ఉన్న విషయం తెలిసిందే. ఈ విమానం అదృశ్యం కావడం ప్రపంచ పౌర విమానయాన చరిత్రలోనే అత్యంత పెద్ద మిస్టరీల్లో ఒకటిగా మిగిలిపోయింది.












Click it and Unblock the Notifications