థియేటర్పై బాంబుల వర్షం.. శరణార్థులు మృతి : ఉలిక్కిపడ్డ మేరియుపోల్ - ఖండించిన రష్యా..
ఉక్రెయిన్పై రష్యా వెనక్కి తగ్గడం లేదు. వరుస బాంబులతో విరుచుకుపడుతోంది. ఏ చిన్న ప్రాంతాన్ని కూడా వదలకుండా విధ్వంసం సృష్టిస్తోంది. చివరకు యుద్ధభయంతో తలదాచుకున్న పౌరుల శిబిరాలను కూడా వదలడం లేదు. అత్యంత దారుణంగా రష్యా సేనలు బాంబుల వర్షాన్ని కురిపిస్తున్నాయి. తాజాగా వేలాది మంది శరణార్ధులు తలదాచుకుంటున్న మేరియాపోల్లోని ఒక డ్రామా థీయేటర్పై రష్యా దాడులకు పాల్పడింది. ఈ దాడుల సమయంలో అక్కడ దాదాపు 1200 మంది వరకు పౌరులు తలదాచుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫోటోలను ఉక్రెయిన్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది
పౌరులు తలదాచున్న థీయేటర్పై బాంబులు
బాంబుల దాటికి థియేటర్ బిల్డింగ్ ధ్వంసమైంది. వందల సంఖ్యలో పౌరులు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో ఎంత మంది చనిపోయారాలో అన్న దానిపై ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. దీనికి సమీప ప్రాంతంలోనే ఇంకా భారీగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో.. ఈ డ్రామా థీయేటర్లో ఎంత మంది చనిపోయారన్న దానిపై ఇప్పుడే చెప్పలేమని స్థానిక అధికారులు తెలిపారు. ఈ దుర్మార్గపు దాడిని ఎన్నటికీ మరిచిపోలేమని మేరియాపోల్ సిటీ కౌన్సిల్ పేర్కొంది. ఈ బిల్డింగ్లో ఎక్కువ సంఖ్యలో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది.
కిరాతకమైన దాడులు
శరణార్థులు తలదాచుకున్న థియేటర్పై కూడా రష్యా దాడులకు దిగిందంటూ ఉక్రెయిన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దాడులకు సంబంధించిన ఫోటోలను ఉక్రెయిన్ విదేశాంగ శాఖ మంత్రి మిడిత్రో కులేబా తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. మాస్కో సేనలు అత్యంత నీచమైన, కిరాతకమైన దాడులకు పాల్పడుతోందంటూ మండిపడ్డారు. ఈ దాడుల్లో ఎంతమంది శిథిలా కింద చిక్కుకున్నారో.. చనిపోయారో తెలియాల్సి ఉందని తెలిపారు. విమానం నుంచి బాంబులతో దాడి చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. రష్యా దాడుల నేపథ్యంలో ఈ డ్రామా థియేటర్ శరణార్థులు ఓ షెల్టర్ గా ఉపయోగించుకుంటున్నారు.
పేక్ న్యూస్.. ఇది నియోనాజీల పనే..
అయితే ఈ దాడులను రష్యా రక్షణ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇది మరో పెద్ద పేక్ న్యూస్ అంటూ కొట్టిపారేసింది. మేరియుపోల్ నగరంలో అలాంటి దాడి జరగలేదని తేల్చిచెప్పింది. ఇది నియోనాజీలయిన అజోవ్ బెటాలియన్ పనేనని రష్యా ఆరోపించింది. డ్రామా థీయటర్ లోపల శరణార్థులను బందీలుగా ఉంచిందన్న విషయం తమకు తెలుసని .. ఆకారణంగా తాము ఆ భవనాన్ని టార్గెట్గా చేసుకోలేదని తెలిపింది. ఉక్రెయిన్ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తోందని మండిపడింది. ఈమేరకు అమెరికాలోని రష్యా రాయబార కార్యాలయం ట్విట్ చేసింది.
యుద్ధాన్ని ఆపాలన్న ఐసీజే
అటు ఉక్రెయిన్పై సైనిక చర్యలను ఆపాలని రష్యాకు అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశించింది. దీనిని ఉక్రెయిన్ , అమెరికాలు స్వాగతించాయి. ఐసీజే ఆదేశాలను గౌరవిస్తూ.. తమ బలగాలను వెనక్కి తీసుకోవాలని రష్యాను కోరింది. ఈ విషయంలో ఉక్రెయిన్కు తమ మద్దతు ఉంటుందని అమెరికా మరోసారి స్పష్టం చేసింది. మరి అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందా లేదా అన్న దానిపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రపంచదేశాలు ఆంక్షలు విధించినా.. ఉక్రెయిన్పై దురాక్రమణ చర్యలను మాత్రం ఆపడంలేదు.