మధ్యాకాశంలో తప్పిన పెను విమాన ప్రమాదం-పైలట్ల చాకచక్యం పై సర్వత్రా హర్షం
మధ్యాకాశంలో పెను ప్రమాదం తప్పింది. రెండు విమానాలు ఢీకొనే పరిస్థితి ఉండగా పైలట్లు అప్రమత్తం కావడంతో గగనతలంలో ఈ ప్రమాదం తృటిలో తప్పింది. వివరాల్లోకి వెళితే...

33వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న శ్రీలంకన్ ఎయిర్వేస్ విమానం
శ్రీలంకకు చెందిన శ్రీలంకన్ ఎయిర్లైన్స్ UL 504 విమానం లండన్ నుంచి కొలంబోకు బయలుదేరింది. 275 మంది ప్రయాణికులతో లండన్లోని హీత్రూ విమానాశ్రయం నుంచి కొలంబోకు బయలుదేరిన శ్రీలంకన్ ఎయిర్లైన్స్ విమానం టర్కీ గగనతలంలోకి ప్రవేశించింది. 33వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న ఈ విమానం మరో రెండు వేల అడుగుల ఎత్తుకు అంటే 35వేల అడుగుల ఎత్తుకు తీసుకెళ్లాల్సిందిగా పైలట్లకు ఎయిర్ కంట్రోల్ ట్రాఫిక్ నుంచి సందేశం అందింది.

బ్రిటీష్ ఎయిర్వేస్ విమానం గుర్తింపు
అదే సమయంలో 35వేల అడుగుల ఎత్తులో బ్రిటీష్ ఎయిర్వేస్కు చెందిన విమానంను పైలట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన పైలట్లు అంకారా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు సమాచారం అందించారు. శ్రీలంక విమానంకు కేవలం 15 మైళ్ల దూరంలోనే అదే ఎత్తులో బ్రిటీష్ ఎయిర్వేస్ విమానం ఎగురుతోంది.
ఇందులో 250 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అంకారా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి రెండు సార్లు క్లియరెన్స్ ఇచ్చినప్పటికీ శ్రీలంక పైలట్లు మాత్రం తమ విమానంను 35వేల అడుగుల ఎత్తుకు తీసుకెళ్లేందుకు నిరాకరించారు. ఇక అక్కడ బ్రిటీష్ ఎయిర్వేస్కు చెందిన విమానం ఉందని గమనించిన అంకారా ఎయిర్ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థ వెంటనే స్పందించింది.

చాకచక్యంగా వ్యవహరించిన శ్రీలంక పైలట్లు
ఒకవేళ అంకారా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సందేశాన్ని అనుసరించి శ్రీలంక ఎయిర్లైన్స్ విమానం పైలట్లు 35వేల అడుగులపైకి విమానంను తీసుకెళ్లి ఉంటే గగనతలంలో కనీవినీ ఎరుగని భారీ ప్రమాదం సంభవించి ఉండేది. లండన్ నుంచి దుబాయ్కు వెళుతున్న బ్రిటీష్ ఎయిర్వేస్ విమానంను ఢీకొని ఉండేది. అపారమైన ప్రాణనష్టం కలిగి ఉండేది. శ్రీలంకన్ ఎయిర్వేస్ విమానం కంటే బ్రిటీష్ ఎయిర్వేస్ విమానం మరింత వేగంగా ఆ సమయంలో ప్రయాణిస్తోందని సమాచారం.
Recommended Video


500 మంది ప్రాణాలు కాపాడిన పైలట్లు
పైలట్ల అప్రమత్తతో శ్రీలంకన్ ఎయిర్వేస్కు చెందిన విమానం సురక్షితంగా కొలంబోలోని బండారునాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. అందులోని ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. పైలట్లు చాకచక్యంగా వ్యవహరించడంపై శ్రీలంకన్ ఎయిర్వేస్ సంస్థ ప్రశంసల వర్షం కురిపించింది.
ఒకవేళ ఈ ప్రమాదం కనుక సంభవించి ఉంటే మధ్యాకాశంలో దాదాపుగా 500 మందికి పైగా ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి.ఇక ఈ మొత్తం వ్యవహారంపై విచారణకు ఆదేశించింది. పైలట్ల అప్రమత్తత, ఆ విమానంలో ఉన్న అత్యాధునిక కమ్యూనికేషన్ మరియు సర్వేలియన్స్ వ్యవస్థతో భారీ ప్రమాదం జరగకుండా నివారించడం జరిగిందని శ్రీలంకన్ ఎయిర్వేస్ సంస్థ వెల్లడించింది.












Click it and Unblock the Notifications