జర్మనీలో తెగబడిన ఉగ్రవాదులు: 15 మంది మృతి
మ్యూనిచ్: ఉగ్రవాదులు ఐరోపా దేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు ఒడిగడుతున్నట్లు కనిపిస్తోంది. ఫ్రాన్స్లో బాస్టిల్ డే నాడు మారణకాండ సృష్టించిన ఉగ్రవాదులు తాజాగా జర్మనీని లక్ష్యం చేసుకున్నారు. జర్మనీలోని మ్యూనిచ్లో ఉగ్రవాదులు దాడికి దిగారు.
శుక్రవారం అక్కడి ప్రముఖ ఒలింపియా షాపింగ్ సెంటర్లో నల్లని దుస్తుల్లో వచ్చిన ఒక వ్యక్తి తుపాకీతో విచక్షణరహితంగా కాల్పులు జరిపి 9 మంది ప్రాణాలు బలి తీసుకున్నాడు. ఒక్కసారిగా కాల్పుల మోత వినిపించడంతో షాపింగ్కు వచ్చిన వారంతా భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగులు తీశారు.
ఈ విషాదంలో 15 మంది దాకా మరణించినట్టు సమాచారం. పది మందికిపైగా తీవ్రగాయాలపాలయ్యారు. దాంతో పోలీసులు అప్రమత్తమై కాల్పులు జరిగిన ఓలింపిక్ పార్క్ ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. బయటి వ్యక్తులు ఎవరూ రాకుండా కట్టుదిట్టం చేసి అత్యవసర సేవల సిబ్బందిని మాత్రమే లోపలికి అనుమతించారు.
ముందుజాగ్రత్త చర్యగా ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని, బయటకు రావద్దని, బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని హెచ్చరికలు జారీ చేశారు. కాల్పులు జరిపిన దుండగుడు భూగర్భంలో ఉన్న రవాణామార్గం ద్వారా అక్కడి నుంచి పారిపోయినట్టు తెలుస్తోంది. దుండుగుడు కాల్పులు జరుపుతున్న సమయంలో తీసినట్టుగా పేర్కొంటున్న వీడియో ఒకటి ఆన్లైన్లో విస్తృతంగా ప్రచారంలో ఉంది.
ఒకరి కన్నా ఎక్కువ ఈ దాడిలో పాల్గొని ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. గత 8 రోజుల్లో ఐరోపాలో ఇది ఐదో ఉగ్రవాద దాడి. కాల్పులు జరిగిన తర్వాత ముగ్గురు సాయుధులు పారిపోయినట్లు కనిపించిందని అంటున్నారు. కాల్పుల తర్వాత షాపింగ్ సెంటర్ వద్ద ఓ మృతదేహం కనిపించింది. అది ఉగ్రవాది శవమై ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.