19 ఏళ్ల వయస్సులో: అమెరికాకు తల్లి ఒంటరి ప్రయాణం: ఈ స్థాయిని ఊహించి ఉండదు: కమలా హ్యారిస్
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి భారత సంతతికి చెందిన మహిళగా చరిత్ర సృష్టించిన కమలా హ్యారిస్..తన తొలి ప్రసంగంలో తల్లిని గుర్తు చేసుకున్నారు. భావోద్వేగానికి గురయ్యారు. తాను ఈ స్థాయికి చేరుకుంటానని తన తల్లి ఏ మాత్రం ఊహించి ఉండబోదని అన్నారు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న తల్లి తనకు ఆదర్శమని, ఆమె నుంచి తాను స్ఫూర్తిపొందాననీ చెప్పారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో మెజారిటీ మార్క్ను అందుకున్న డెమొక్రటిక్ పార్టీ నేతలు జో బిడెన్, కమలా హ్యారిస్ను విజయం సాధించినట్లు ప్రకటించిన వెంటనే.. వారిద్దరూ ఆ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
జో బిడెనతో కలిసి తొలి ప్రసంగం
జో బిడెన్ సొంత రాష్ట్రం డెల్వర్లోని విల్మింగ్టన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు పాల్గొననారు. విల్మింగ్టన్ క్రిస్టీనా రివర్ వద్ద గల ఛేజ్ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి పెద్ద సంఖ్యలో జో బిడెన్ అభిమానులు, డెమొక్రటిక్ పార్టీ మద్దతుదారులు హాజరయ్యారు. జో బిడెన్ ప్రసంగం ముగిసిన అనంతరం కమలా హ్యారిస్ మాట్లాడారు. అమెరికా వంటి అగ్రరాజ్యానికి ఉపాధ్యక్షురాలిగా ఎన్నిక కావడం పట్ల మహిళా శక్తిని అద్దం పడుతోందని అన్నారు.
స్ఫూర్తినింపిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్..
తాను ఈ స్థాయికి చేరుకోవడానికి స్ఫూర్తినిచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఙతలు తెలుపుతున్నానని అన్నారు. బ్లాక్ విమెన్, ఆసియన్ విమెన్, ల్యాటినా విమెన్, నేటివ్ అమెరికన్ విమెన్..ఇలా ప్రతి ఒక్కరూ తనను గెలిపించారని చెప్పారు. భారత సంతతికి, ఆసియా దేశాలకు చెందిన ఓ మహిళకు అమెరికన్లు అత్యున్నత స్థానాన్ని, బాధ్యతలను అప్పగించారని అన్నారు. ఎవ్వరికీ నిరుత్సాహాన్ని కలిగించని విధంగా తన పనితీరు ఉంటుందని హామీ ఇచ్చారు.
తన తల్లి ఊహించి ఉండదు..
తాను ఈ స్థాయికి చేరుకుంటానని తన తల్లి శ్యామలా గోపాలన్ హ్యారిస్ ఏ మాత్రం ఊహించి ఉండబోరని కమలా హ్యారిస్ అన్నారు. 19 సంవత్సరాల వయస్సులో ఆమె భారత్ను విడిచిపెట్టారని, ఒంటరిగా అమెరికాకు ప్రయాణం చేశారని గుర్తు చేశారు. అమెరికా వంటి దేశంలో ఏదైనా సాధ్యపడుతుందనే విషయాన్ని శ్యామలా గోపాలన్ బలంగా నమ్మేవారని అన్నారు. దాన్ని అమెరికన్లు నిజం చేశారని, ప్రతిభ ఉంటే దేశాలతో పని లేదని అమెరికన్లు నిరూపించారని చెప్పారు.
కొత్త అమెరికాను చూస్తారు..
అమెరికాలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటం ప్రస్తుతం తన లక్ష్యమని కమలా హ్యారిస్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి పోరాడాల్సి వస్తోందని, త్యాగాలను సైతం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. ఆ పోరాటాన్ని తాను ఆనందంగా స్వీకరించానని, విజయం సాధించానని చెప్పారు. అమెరికన్ల భవిష్యత్తును మరింత పటిష్టవంతంగా, బలోపేతంగా మార్చడానికి అవసరమైన అధికారం అనే ఆయుధం ఇప్పుడు తమ చేతుల్లో ఉందని అన్నారు. ప్రతి అమెరికన్ కలలకు అనుగుణంగా దేశ భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇచ్చారు. కొత్త ప్రభుత్వం ఎలా ఉండబోతోందనే విషయాన్ని ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా గమనిస్తున్నాయని కమలా హ్యారిస్ అన్నారు.