నేపాల్ మ్యాప్ లో భారత్ భూభాగం- కొత్త వివాదం- స్వాధీనం చేసుకుంటామని హెచ్చరికలు
ఆసియా ఉపఖండంపై పట్టు కోసం డ్రాగన్ దేశం చైనా చేస్తున్న ప్రయత్నాలు భారత్ కు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఇప్పటికే భారత్ పొరుగున ఉన్న దేశాలపై ఒక్కొక్కటిగా పట్టు పెంచుకుంటూ పోతున్న డ్రాగన్... వాటిని భారత్ పైకి ఎగదోస్తోంది. చైనా అండతో ఇప్పటికే పాకిస్తాన్, మయన్మార్, శ్రీలంక, భూటాన్ వంటి దేశాలు ఇప్పటికే సహాయ నిరాకరణ చేస్తుంటే తాజాగా ఈ జాబితాలోకి నేపాల్ కూడా చేరిపోయింది. గతంలో భారత్ చేసిన సాయాన్ని మరచి కత్తులు దూస్తోంది.
Recommended Video
కరోనా పుట్టుక తేలాల్సిందే- -డబ్ల్యూహెచ్వో స్వతంత్ర దర్యాప్తు- డ్రాగన్ టార్గెట్ గా భారత్ అడుగులు
భారత్-నేపాల్ సరిహద్దు వివాదం...
భారత్ లోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న కాలాపానీతో పాటు దానికి పశ్చిమాన ఉన్న లిపులేఖ్ సంధిమార్గం తమవేనంటూ నేపాల్ ప్రభుత్వం చేస్తున్న వాదన ఇప్పుడు భారత్ కు తలనొప్పిగా మారుతోంది. దశాబ్దాలుగా భారత్ ఆధీనంలోనే ఉన్న ఈ ప్రాంతాలను తమవిగా చెప్పుకుంటున్న నేపాల్ ప్రభుత్వం తాజాగా వాటిని కొత్తగా రూపొందించిన మ్యాప్ లో చేర్చింది. భారత్ వాదన ప్రకారం కాలాపానీ ప్రాంతం ఉత్తరాఖండ్ లోని పితోర్ ఘర్ జిల్లాలో ఉండగా.. నేపాల్ వాదన ప్రకారం ఆ దేశానికి చెందిన దార్చులా జిల్లాలో ఉంది.
వివాదాస్పద మ్యాప్ రూపకల్పన...
నేపాల్ లోని కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం తాజాగా ఆమోదించిన మ్యాప్ లో భారత్ లోని కాలాపానీ, లిపులేఖ్ తో పాటు లింపియాథురా ప్రాంతాలను కూడా కలిపేసుకుంది. అంతే కాదు ప్రస్తుతం భారత్ అక్రమణలో ఉన్న ఈ మూడు ప్రాంతాలను త్వరలోనే రాజకీయ, దౌత్య మార్గాల ద్వారా వీటిని తిరిగి నేపాల్ పరిధిలోకి తీసుకొస్తామని అక్కడి కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం చేసిన ప్రకటన ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. 1962 నుంచి ఈ ప్రాంతాలు భారత్ ఆక్రమణలోనే ఉన్నాయని, అయినా గత ప్రభుత్వాల తప్పిదాల కారణంగా వీటిని నేపాల్ లోకి తీసుకురాలేకపోయినట్లు ఓలీ సర్కారు చెబుతోంది. త్వరలో కొత్త మ్యాప్ విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
భారత్ వాదన ఇదీ...
తాజాగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పితోర్ ఘర్ జిల్లాలో నిర్మించిన రోడ్డు మార్గమంతా భారత్ పరిధిలోకే వస్తుందని, దీనిపై పొరుగుదేశమైన నేపాల్ కు ఎలాంటి అధికారాలు లేవని భారత్ వాదిస్తోంది. దశాబ్దాలుగా తమ ఆధీనంలోనే ఉన్న ఈ ప్రాంతాలపై నేపాల్ ఇప్పుడు ఎందుకు కొత్త వాదన లేవదీస్తోందని భారత్ ప్రశ్నిస్తోంది. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ కార్యకలాపాలన్నీ భారత అధికారుల చేతుల్లోనే ఉన్నాయని చెబుతోంది.
సరిహద్దు వివాద నేపథ్యం ఇదీ..
నేపాల్ ప్రభుత్వం తాజాగా ఆమోదించిన వివాదాస్పద మ్యాప్ కు ఆధారం 1816లో బ్రిటీషర్ల ఆక్రమణలో ఉన్న ప్రభుత్వానికీ, నేపాల్ కూ మధ్య కుదిరిన సుగాలీ ఒప్పందమే. దీని ప్రకారం భారత్-నేపాల్ సరిహద్దుల్లోని కాళీ నదీ జన్మస్ధానమైన లింపియాథురా ప్రాంతం నేపాల్ పరిధిలోనే ఉన్నట్లు కొన్ని ఆధారాలు ఉన్నాయి. అయితే తాజాగా గతేడాది అక్టోబర్ లో భారత్ విడుదల చేసిన మ్యాప్ లో ఈ మూడు ప్రాంతాలు తమ భూభాగంలో ఉన్నట్లు చూపించారు. దీనిపై నేపాల్ అభ్యంతరాలు లేవనెత్తింది. ఆ తర్వాత భారత్ మరింత పట్టుదలగా కైలాస్ సరోవర్ యాత్ర కోసం ఓ రోడ్డు మార్గం నిర్మించేందుకు సిద్ధమైంది. దీంతో నేపాల్ అప్రమత్తమై తాము రూపొందించిన కొత్త మ్యాప్ లో వీటిని చేర్చడమే కాకుండా భారత్ తో రాజకీయ, దౌత్య మార్గాల్లో వీటిని వెనక్కి తీసుకుంటామని కూడా చెబుతోంది. అయితే దీని వెనుక చైనా కుట్ర ఉందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.