Afghanistan: అమెరికా డ్రోన్ దాడుల్లో 9 మంది మృతి-మృతుల్లో ఆరుగురు చిన్నారులు-అసలేం జరిగింది..
ఆఫ్గనిస్తాన్లో పరిస్థితులు అంతకంతకూ దిగజారుతూనే ఉన్నాయి.ఓవైపు తాలిబన్లు.. మరోవైపు ఐసిస్ ఉగ్రవాదులు ఆఫ్గన్లో విధ్వంసం సృష్టిస్తున్నారు. అమెరికన్ల తరలింపు ప్రక్రియకు డెడ్ లైన్ దగ్గరపడటంతో ఉగ్రవాదులు మరింత మారణ హోమం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం(ఆగస్టు 19) ఓ ఉగ్రవాది కాబూల్ విమానాశ్రయం వద్ద ఆత్మాహుతి దాడికి సిద్దపడుతున్నట్లు అమెరికా రక్షణ శాఖకు సమాచారం అందింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అమెరికా వైమానిక దళం... డ్రోన్ దాడులతో ఆ ఉగ్రవాది వాహనాన్ని పేల్చేసింది. అయితే ఈ దాడుల్లో పలువురు చిన్నారులు సైతం ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ మీడియా చెబుతోంది.

ఒకే కుటుంబానికి చెందిన 9 మంది...
అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి చెందగా... ఇందులో ఆరుగురు చిన్నారులు ఉన్నట్లు సీఎన్ఎన్ మీడియా రిపోర్ట్ చేసింది. మృతుల బంధువు ఈ విషయాన్ని తెలియజేసినట్లు చెప్పింది.'దాడి జరిగిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇరుగుపొరుగు అక్కడికి చేరుకుని నీళ్లు చల్లి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఐదుగురు లేదా ఆరుగురు చనిపోవడం నేను చూశాను. వారిలో ఆ కుటుంబ పెద్దతో పాటు ఓ యువకుడు,ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.' అని అహద్ అనే స్థానికుడు వెల్లడించారు.

దాడులపై గందరగోళం...
ఆఫ్గన్లో ఆదివారం చోటు చేసుకున్న పరిణామాలపై తీవ్ర గందరగోళం నెలకొంది. అమెరికా డ్రోన్ దాడుల్లో చిన్నారులు మరణించినట్లు కొన్ని మీడియా చానెళ్లు రిపోర్ట్ చేయగా... ఉగ్రవాదుల రాకెట్ దాడుల్లో చిన్నారులు మరణించినట్లుగా మరికొన్ని చానెళ్లు రిపోర్ట్ చేయబడ్డాయి. దీంతో అమెరికా డ్రోన్ దాడులు,చిన్నారుల మరణం రెండు వేర్వేరుగా దాడులుగా చాలామంది భావించారు. కానీ తాజా సీఎన్ఎన్ రిపోర్ట్ ప్రకారం ఆ రెండు దాడులు ఒకటేనని స్పష్టమైంది. దీనిపై స్పందించిన అమెరికా... డ్రోన్ దాడుల్లో చిన్నారుల మరణంపై విచారణ జరుపుతున్నామని తెలిపింది.

విచారం వ్యక్తం చేసిన అమెరికా...
చిన్నారుల మరణం పట్ల అమెరికా తీవ్ర విచారం వ్యక్తం చేసింది.'డ్రోన్ దాడుల్లో సాధారణ పౌరులు మరణించారనే విషయం తెలిసింది. దాడుల ఎఫెక్ట్ను అంచనా వేస్తున్నాం.' అని అమెరికా సెంట్రల్ కమాండ్ అధికార ప్రతినిధి,కెప్టెన్ బిల్ అర్బన్ తెలిపారు. 'వాహనాన్ని పేల్చేసిన తర్వాత శక్తివంతమైన పేలుళ్లు సంభవించాయని తెలుసు. ఆ వాహనంలో పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు ఉండటంతో ప్రాణనష్టం సంభవించి ఉండవచ్చు.' అని కెప్టెన్ బిల్ పేర్కొన్నారు. అయితే అసలక్కడ ఏం జరిగిందనే దానిపై ఇప్పటికీ స్పష్టత లేదని... ఘటనపై విచారణ జరుపుతున్నామని
Recommended Video

ఉగ్రవాదులు మళ్లీ తెగబడే ఛాన్స్...
ప్రస్తుతం ఆఫ్గనిస్తాన్లో పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. రేపటితో(ఆగస్టు 31) అమెరికా డెడ్ లైన్ ముగుస్తుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈలోపు ఉగ్రవాదులు మరిన్ని దాడులకు తెగబడే సూచనలు కనిపిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 31 లోపు తరలింపు ప్రక్రియను పూర్తి చేస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. గడువును పొడగించాలని బ్రిటన్ సహా పలు దేశాలు కోరినప్పటికీ బైడెన్ అందుకు అంగీకరించలేదు. అటు తాలిబన్లు కూడా డెడ్ లైన్ దాటితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. దీంతో తరలింపు ప్రక్రియను అమెరికా వేగతవంతం చేసింది. అమెరికా అక్కడి నుంచి నిష్క్రమిస్తే మిగతా దేశాలకు తరలింపు ప్రక్రియ అసాధ్యమనే చెప్పాలి. ప్రస్తుతం విమానాశ్రయం అమెరికా,నాటో దళాల నియంత్రణలో ఉండటంతో తరలింపు సాధ్యపడుతోంది. అమెరికా నిష్క్రమణ తర్వాత అది తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లనుంది.












Click it and Unblock the Notifications