కోలుకున్నాక మళ్లీ కరోనా రాదని చెప్పలేం -బాంబుపేల్చిన ప్రపంచ ఆరోగ్య సంస్ధ
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి, అందుకు గల కారణాలు, కోలుకున్న రోగుల పరిస్ధితి వంటి అంశాలపై ఎప్పటికప్పుడు పరిశోధనాత్మకంగా ఫలితాలు వెలువరిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్ధ (who) ఇవాళ మరో బాంబు పేల్చింది. కరోనా నుంచి కోలుకున్న రోగులు తగిన జాగ్రత్తలు పాటించకపోతే ఈ మహమ్మారి తిరగబెట్టే అవకాశముందని హెచ్చరించింది.

కరోనా వ్యాప్తి తగ్గుతున్న వేళ...
ఈ ఏడాది జనవరితో పోల్చుకుంటే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గింది. వైరస్ జాడలు మందుగా బయటపడిన చైనాతో పాటు వివిధ దేశాల్లో పరిస్ధితులు క్రమంగా అదుపులోకి వస్తున్నాయి. దీంతో ఆయా దేశాల్లో కరోనా వ్యాప్తి పరిస్ధితులపై ప్రపంచ ఆరోగ్యసంస్ధ (who) తాజాగా అధ్యయనం నిర్వహించింది. ఇందులో ఆయా దేశాల్లో కరోనా వ్యాప్తి పూర్తిగా ఆగిపోయినట్లేనా అన్న అంశంపై క్లారిటీ ఇవ్వలేమని అరోగ్యసంస్ధ ప్రకటించింది.

ఇమ్యూనిటీ పాస్ పోర్టుల జారీపై అభ్యంతరం..
కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న దేశాల్లో ప్రస్తుతం ప్రభుత్వాలు బాధితులకు ఇమ్యూనిటీ పాస్ పోర్టులు లేదా రిస్క్ ఫ్రీ సర్టిపికెట్లు జారీ చేస్తున్నాయి. అంటే ఆయా రోగులు ఇక కరోనా వైరస్ నుంచి పూర్తిగా విముక్తి పొందినట్లన్న మాట. అయితే వీటి కచ్చితత్వం ఏ మేరకు ఉందో సరిచూసుకోవాల్సిన అవసరం ఉందని ఆయా ప్రభుత్వాలను ప్రపంచ ఆరోగ్య సంస్ధ హెచ్చరించింది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం తాము సూచించిన ప్రోటోకాల్ పాటిస్తూ ఉండాల్సిందేనంటూ ఆయా దేశాల్లో కరోనా బాధితులను ఆరోగ్య సంస్ధ కోరింది. లేకపోతే వైరస్ తిరగబెట్టే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

వైరస్ వ్యాప్తి పూర్తిగా ఆగాలంటే..
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడిన వారు, ప్రభావానికి దగ్గరగా ఉన్న వారు పాటించాల్సిన ప్రోటోకాల్ ను ప్రపంచ ఆరోగ్య సంస్ద ఇప్పటికే విడుదల చేసింది. దీన్ని తూచా తప్పకుండా పాటించాలని అన్ని దేశాలనూ కోరుతోంది. అయితే ఈ హెచ్చరికలను పెడచెవిన పెట్టి ప్రమాదం కొనితెచ్చుకుంటున్న దేశాలు కూడా లేకపోలేదు. భారత్ వంటి దేశాలు మాత్రం ప్రభుత్వాల సీరియస్ నెస్ కారణంగా ఈ ప్రోటోకాల్ ను బాగానే పాటిస్తున్నాయి. అయితే కరోనా వైరస్ నుంచి కోలుకున్నాక ఈ ప్రోటోకాల్ ను రోగులు వదిలేసే అవకాశం ఉందని తమ అంచనాల్లో తేలినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్ధ చెబుతోంది. అందుకే ఈ ప్రోటోకాల్ పాటిస్తున్నారో లేదో చూసుకోకుండా ఇమ్యూనిటీ పాస్ పోర్టుల జారీ తగదని ఆరోగ్య సంస్ధ హెచ్చరిస్తోంది.
Recommended Video

అందరూ కోలుకున్నట్లు కాదు..
ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తికి కారణమవుతున్న వైరస్ లతో పోరాడుతున్న యాంటీబాడీస్ శరీరంలో ఉన్నాయన్న కారణంతో కోలుకున్న రోగులకు ప్రభుత్వాలు ఇమ్యూనిటీ పాస్ పోర్టులు, రిస్క్ ఫ్రీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నాయి. వీటి ఆధారంగా వీరు ఎక్కడికైనా ప్రయాణించేందుకు, విధులకు హాజరయ్యేందుకు ఆయా ప్రభుత్వాలు అవకాశం కల్పిస్తున్నాయి. కానీ యాంటీబాడీస్ కరోనా నుంచి కోలుకున్న రోగులందరి శరీరాల్లో ఒకే స్ధాయిలో ఉండబోవని, కాబట్టి వీరిని పూర్తిగా రిస్క్ ఫ్రీగా భావించలేమని ప్రపంచ ఆరోగ్య సంస్ధ పేర్కొంది. కాబట్టి వీరికి కూడా బలహీన పరిస్దితుల్లో వైరస్ తిరిగి సోకే అవకాశాలు ఉంటాయని తెలిపింది.












Click it and Unblock the Notifications