దక్షిణ కొరియా, జపాన్ పక్కలో బల్లెం: కిమ్జొంగ్ క్షిపణి ప్రయోగం: అత్యవసర భేటీకి పిలుపు
సియోల్: ఆధునిక నియంతగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఉత్తర కొరియా అధినేత కిమ్జొంగ్ ఉన్.. తన తీరును మార్చుకోవట్లేదు. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయినప్పటికీ.. దాని మీద ఏ మాత్రం దృష్టి పెట్టట్లేదు. ఆయుధ సంపత్తిని బలోపేతం చేసుకుంటున్నారు. అత్యంత ప్రమాదకరమైన అణ్వాయుధాలతో సరికొత్త ప్రయోగాలను చేస్తోన్నారు. అణ్వస్త్రాల ప్రయోగంపై అమెరికాతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నప్పటికీ.. దాన్ని లెక్కచేయట్లేదు. పొరుగునే ఉన్న దక్షిణ కొరియా, జపాన్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్నారు కిమ్జొంగ్.
Recommended Video
దక్షిణకొరియా సముద్ర జలాల్లోకి..
తాజాగా దక్షిణ కొరియా సముద్ర జలాల్లోకి క్షిపణిని ప్రయోగించింది ఉత్తర కొరియా. అత్యంత శక్తిమంతమైన బాలిస్టిక్ మిస్సైల్స్ను సంధించింది. క్షిపణి పరీక్షల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించింది. టెస్ట్ ఫైరింగే అయినప్పటికీ.. తన మిస్సైళ్లను దక్షిణ కొరియా సముద్ర జలాల్లోకి సంధించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ పరిణామంతో అటు దక్షిణ కొరియా, ఇటు జపాన్ ఉలిక్కిపడ్డాయి. ఉత్తర కొరియా మిస్సైల్స్ ప్రయోగ పరీక్షలను నిశితంగా గమనిస్తోన్నాయి.
సేఫ్టీ అడ్వైజరీని జారీ చేసిన జపాన్..
ఉత్తర కొరియా తమ దేశ తూర్పు సముద్ర జలాల్లోకి బాలిస్టిక్ క్షిపణిని సంధించిన విషయాన్ని దక్షిణ కొరియా ధృవీకరించింది. జపాన్ మిలటరీ అధికారులు కూడా దీన్ని నిర్ధారించారు. అణ్వాస్త్రాల ప్రయోగాలు, వినియోగానికి సంబంధించి ఇదివరకే అగ్రరాజ్యం అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందాలను ఉత్తర కొరియా ఉల్లంఘించిందని ఈ రెండు దేశాలు వాదిస్తోన్నాయి.
క్షిపణి ప్రయోగాన్ని దృష్టిలో ఉంచుకుని జపాన్ మిలటరీ అధికారులు అడ్వైజరీని సైతం విడుదల చేశారంటే.. దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. జపాన్ కోస్ట్ గార్డ్ అధికారులు మ్యారిటైమ్ సేఫ్టీ అడ్వైజరీని జారీ చేశారు.
జాతీయ భద్రతా మండలి భేటీకి పిలుపు..
ఉత్తర కొరియా చేపట్టిన తాజా బాలిస్టిక్స్ క్షిపణుల పరీక్షలను దృష్టిలో పెట్టుకుని దక్షిణ కొరియా కొన్ని కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశం. తమ దేశ సముద్ర జలాలను లక్ష్యంగా చేసుకుని ఉత్తర కొరియా ఈ క్షిపణి పరీక్షను చేపట్టినందున.. తీవ్రంగా పరిశీలిస్తోంది. జాతీయ భద్రతా మండలి సమావేశాన్ని అత్యవసరంగా నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ ఆంక్షలు, అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందాలు ఉన్నప్పటికీ.. ఉత్తర కొరియా లెక్క చేయకపోవడాన్ని ప్రశ్నించాని నిర్ణయించినట్లు అక్కడి మీడియా అంచనా వేస్తోంది.
అణ్వస్త్రాల పరీక్షలపై
ఉత్తర కొరియా చేపట్టిన అణ్వస్త్రాల పరీక్షలపై ఆ దేశంతో చర్చించడానికి అమెరికా ఇప్పటికే సన్నద్ధమైన విషయం తెలిసిందే. దక్షిణ కొరియాలో అమెరికా రాయబారిగా పని చేసి, పదవీ విరమణ చేసిన సుంగ్ కిమ్ను దూతగా అపాయింట్ చేసింది అమెరికా. ఉత్తర కొరియా ప్రభుత్వ పెద్దలతో చర్చించడానికి ఆయనను రాయబారిగా నియమించింది. ఈ నియామకం పూర్తయిన అతి కొద్దిరోజుల్లోనే ఉత్తర కొరియా ఈ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగానికి పూనుకోవడం.. పైగా దక్షిణ కొరియా సముద్ర జలాలను లక్ష్యంగా చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
రెండేళ్లుగా స్తంభించిన చర్చలు..
అణ్వస్త్రాల ప్రయోగాలు, ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవడంపై ఇది వరకు అమెరికా-ఉత్తర కొరియా మధ్య చర్చలు సాగాయి. దీనిపై 2018లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కిమ్జొంగ్ ఉన్ స్వయంగా ఈ చర్చల్లో పాల్గొన్నారు. కొన్ని కీలక విషయాల్లో ఏకాభిప్రాయం కుదురకపోవడంతో చర్చల్లో ప్రతిష్ఠంభన నెలకొంది. ఆ తరువాత అమెరికా కొన్ని ఆంక్షలను విధించింది ఉత్తర కొరియాపై. వాటిని పరిగణనలోకి తీసుకోవట్లేదు కిమ్జొంగ్. తన ఆయుధ సంపత్తిని పెంచుకుంటూనే ఉన్నారు. న్యూక్లియర్ వెపన్స్కు ప్రాధాన్యత ఇస్తోన్నారు.