కిమ్జొంగ్ రణనినాదం: టార్గెట్ జపాన్: బాలిస్టిక్ క్షిపణులు సంధించిన ఉత్తర కొరియా: మూడు దేశాల్లో
టోక్యో: ఆధునిక నియంతగా ప్రపంచ దేశాల్లో గుర్తింపు తెచ్చుకున్న ఉత్తర కొరియా అధినేత కిమ్ జొంగ్ ఉన్ కయ్యానికి కాలు దువ్వుతున్నారా? ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన యుద్ధ సన్నాహాలను చేపట్టినట్లు సంకేతాలను పంపించారా?.. ఏడాది కిందట ఆచూకీ తెలియకుండా, బాహ్య ప్రపంచానికి దూరంగా గడిపిన ఉత్తర కొరియా నియంత.. ఈ సారి అనూహ్యంగా వార్తల్లోకెక్కారు. ప్రపంచం ఒకవైపు.. తాను ఒక్కడిని ఒకవైపు అంటూ వ్యవహరిస్తోన్న కిమ్ జొంగ్ తన నియంత వైఖరిని మరోసారి బయట పెట్టుకున్నారు.

జపాన్ తీరంపైకి బాలిస్టిక్స్ మిస్సైళ్లు..
ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా జపాన్ తూర్పు ప్రాంత సముద్ర తీరంపైకి ఉత్తర కొరియా బాలిస్టిక్స్ క్షిపణులను ప్రయోగించింది. తమదేశ సముద్ర తీరంపైకి ఉత్తర కొరియా రెండు బాలిస్టిక్స్ క్షిపణులను ప్రయోగించినట్లు జపాన్ ప్రధానమంత్రి యోషిహిడె సుగ ధృవీకరించారు. ఇదే విషయాన్ని అమెరికా భద్రతాధికారులు, దక్షిణ కొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ నిర్ధారించారు. బాలిస్టిక్స్ క్షిపణులను ప్రయోగించడం వారం రోజుల వ్యవధిలో ఇది రెండోసారిగా యోషిహిడె సుగా వెల్లడించారు. జపాన్ కాలమానం ప్రకారం.. తెల్లవారు జామున ఈ క్షిపణులను సంధించినట్లు తెలిపారు.

దక్షిణ కొరియా, జపాన్ అప్రమత్తం..
ఈ తెల్లవారు జామున ఉత్తర కొరియాలోని దక్షిణ హమ్క్యుంగ్ ప్రావిన్స్ నుంచి జపాన్ సముద్ర తీరంపైకి బాలిస్టిక్స్ క్షిపణులను ప్రయోగించినట్లు దక్షిణ కొరియా ప్రభుత్వం కూడా ప్రకటించింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఆ దేశ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఉత్తర కొరియా దుందుడుకు చర్యలపై అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు, దక్షిణ కొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సంయుక్తంగా మరింత సమాచారాన్ని సేకరించే పనిలో పడినట్లు స్పష్టం చేసింది.

ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటాం..
ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి తాము సమాయాత్తమౌతున్నామని దక్షిణ కొరియా పేర్కొంది. ఈ విషయంలో అమెరికాతో కలిసి తాము పని చేస్తున్నామని, మిలటరీ అధికారులను అప్రమత్తం చేశామని వెల్లడించింది. ఉత్తర కొరియా ప్రయోగించిన రెండు క్షిపణుల్లో ఒకటి మీడియం రేంజ్, మరొకటి షార్ట్ రేంజ్ మిస్సైల్గా భావిస్తున్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించినట్లు ఆ దేశం మీడియా పేర్కొంది. దీనిపై ప్రత్యేక కథనాలను ప్రచురించింది.

మరింత సమాచారాన్ని సేకరించే పనిలో
ఈ రెండింట్లో ఒకటి.. అత్యాధునికమైన క్షిపణిగా అంచనా వేస్తున్నట్లు యూఎస్ ఇంటెలిజెన్స్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రెండు క్షిపణులు ఎంత దూరం ప్రయాణించాయి?, ఏ లక్ష్యాన్ని అవి ఛేదించాయి? వాటి ప్రయాణ కాలం ఎంత? అనే విషయంపై సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నామని అమెరికా ఇండో-పసిఫిక్ కమాండ్ అధికార ప్రతినిధి కేప్టెన్ మైక్ కఫ్కా తెలిపారు. ఈ రెండు క్షిపణుల వల్ల కలిగిన నష్టం ఏ మేరకు ఉందనేది విశ్లేషిస్తున్నామని వివరించారు. ఈ ఉదంతంపై తాము దక్షిణ కొరియాతో కలిసి మరింత సమాచారాన్ని సేకరిస్తున్నామని చెప్పారు.

ఉత్తర కొరియా దుందుడుకు చర్యలకు నిదర్శనంగా..
క్షిపణులను సంధించడమనేది.. ఉత్తర కొరియా అక్రమంగా తన బలాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తోందనడానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు, పొరుగు దేశాల్లో భయోత్పాతాన్ని కలిగించడానికి ఆ దేశం ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు భావిస్తున్నామని అన్నారు. రిపబ్లిక్ ఆఫ్ కొరియా, జపాన్ సరిహద్దులను కాపాడటానికి తాము చిత్తశుద్ధితో ప్రయత్నిస్తామని మైక్ కఫ్కా స్పష్టం చేశారు. ఉత్తర కొరియా చర్యలపై జపాన్, దక్షిణ కొరియాల్లో తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రెండు దేశాలు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నాయి.












Click it and Unblock the Notifications