హడలెత్తిస్తున్న ఉత్తరకొరియా: తర్వాతి టార్గెట్ అమెరికానే! 'బాలిస్టిక్' ప్రయోగం సక్సెస్..
ఉత్తరకొరియా ప్రయోగించిన ఇంటర్మీడియట్ రేంజ్ మిస్సైల్.. క్రమంగా ఖండాంతర క్షిపణి తయారీకి దారితీసే అవకాశాలున్నాయని అమెరికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
టోక్యో: యుద్దానికి సిద్దమంటూ ఇటీవల అమెరికా-ఉత్తరకొరియా ఢీ అంటే ఢీ అన్న తరహాలో మాటల యుద్దానికి దిగిన సంగతి తెలిసిందే. శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకుంటామని మొన్నామధ్య అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించినప్పటికీ.. ఉత్తరకొరియా మాత్రం దుందుడుకు వైఖరిని కొనసాగిస్తూనే ఉంది.
తాజాగా రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ ను ప్రయోగించిన ఉత్తరకొరియా.. ఆ ప్రయోగం సఫలమైందని ప్రకటించింది. ఈ సందర్భంగా రాజధాని ప్యోంగ్ యాంగ్ లో వేడుకలు నిర్వహించారు. త్వరలోనే అమెరికా భూభాగాన్ని టార్గెట్ చేయగల క్షిపణిని తయారుచేస్తామని ఉత్తరకొరియా ప్రకటించడం గమనార్హం.
ఆదివారం ఉదయం ఉత్తరకొరియా.. ఇంటర్మీడియట్ రేంజ్ క్షిపణిని ప్రయోగించింది. 2వేల కి.మీ ఎత్తులో 800కి.మీ దూరం ప్రయాణించిన క్షిపణి.. జపాన్ సముద్ర జలాల్లో కూలిపోయింది. కాగా, దక్షిణ కొరియా అధ్యక్షుడిగా మూన్ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఉత్తరకొరియా చేపట్టిన తొలి క్షిపణి ప్రయోగం ఇదే.
ప్రయోగం వివరాలను వెల్లడిస్తూ.. క్షిపణి ప్రయోగాన్ని ప్యోంగ్ యాంగ్ మీడియా హ్వాసంగ్-12గా పేర్కొంది. అమెరికా మిలటరీ బలగాలతో తమను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తే.. భారీ ప్రతిఘటన తప్పదని హెచ్చరించింది. తీవ్ర పరిణామాలను చవిచూడాలనుకుంటేనే తమతో పెట్టుకోవాలని ప్రకటించింది.
ఉత్తరకొరియా ప్రయోగించిన ఇంటర్మీడియట్ రేంజ్ మిస్సైల్.. క్రమంగా ఖండాంతర క్షిపణి తయారీకి దారితీసే అవకాశాలున్నాయని అమెరికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాజా ప్రయోగంతో గతంలో కన్నా మెరుగైన ఫలితాలు ఉత్తరకొరియాకు లభించాయన్నారు. ఖండాంతర క్షిపణి తయారీకి ఉత్తరకొరియాకు ఒక ఏడాది సమయం చాలన్నారు. ఇదిలా ఉంటే, ఉత్తరకొరియా దుందుడుకు చర్యలను దక్షిణ కొరియా, అమెరికా ఖండించాయి.