అణ్వాయుధ ప్రయోగంపై తేల్చేసిన కిమ్జొంగ్: జో బైడెన్కు వార్నింగ్..!!
ప్యాంగ్యాంగ్: ఆధునిక నియంతగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఉత్తర కొరియా అధినేత కిమ్జొంగ్ ఉన్.. న్యూక్లియర్ వెపన్స్ మీద స్పందించారు. తరచూ బాలిస్టిక్స్ మిస్సైళ్లను ప్రయోగిస్తూ- పొరుగునే ఉన్న దక్షిణ కొరియా, జపాన్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న ఆయన ఈ సారి అగ్రరాజ్యం అమెరికాకు హెచ్చరికలు జారీ చేశారు. యుద్ధ భయాలు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా వంటి శక్తిమంతమైన దేశాన్ని ఎదుర్కొనడానికి అణ్వాయుధాలను సమకూర్చుకుంటున్నామని స్పష్టం చేశారు.
దూకుడుగా..
అణ్వాయుధ సంపత్తిని సమకూర్చుకోవడంలో కిమ్ జొంగ్ ఉన్ తన దుందుడుకు వైఖరిని కొనసాగిస్తోన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయినప్పటికీ- మొండిపట్టును వీడట్లేదు. న్యూక్లియర్ వెపన్స్ను ఎప్పటికప్పుడు బలోపేతం చేసుకుంటోన్నారు. అత్యంత ప్రమాదకరమైన అణ్వాయుధాలతో సరికొత్త ప్రయోగాలను చేస్తోన్నారు. అణ్వస్త్రాల ప్రయోగంపై అమెరికాతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నప్పటికీ.. దాన్ని లెక్కచేయట్లేదు.
అణ్వస్త్రాల పరీక్షలపై
ఉత్తర కొరియా చేపట్టిన అణ్వస్త్రాల పరీక్షలపై ఆ దేశంతో చర్చించడానికి అమెరికా ఇప్పటికే సన్నద్ధమైన విషయం తెలిసిందే. దక్షిణ కొరియాలో అమెరికా రాయబారిగా పని చేసి, పదవీ విరమణ చేసిన సుంగ్ కిమ్ను దూతగా అపాయింట్ చేసింది అమెరికా. ఉత్తర కొరియా ప్రభుత్వ పెద్దలతో చర్చించడానికి ఆయనను రాయబారిగా నియమించింది. ఆ తరువాత కూడా ఉత్తర కొరియా ఈ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలకు పుల్స్టాప్ పెట్టలేదు. పైగా దక్షిణ కొరియా సముద్ర జలాలను లక్ష్యంగా చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
స్తంభించిన చర్చలు..
అణ్వస్త్రాల ప్రయోగాలు, ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవడంపై ఇది వరకు అమెరికా-ఉత్తర కొరియా మధ్య చర్చలు సాగాయి. దీనిపై 2018లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కిమ్జొంగ్ ఉన్ స్వయంగా ఈ చర్చల్లో పాల్గొన్నారు. కొన్ని కీలక విషయాల్లో ఏకాభిప్రాయం కుదురకపోవడంతో చర్చల్లో ప్రతిష్ఠంభన నెలకొంది. ఆ తరువాత అమెరికా కొన్ని ఆంక్షలను విధించింది ఉత్తర కొరియాపై. వాటిని పరిగణనలోకి తీసుకోవట్లేదు కిమ్జొంగ్. తన ఆయుధ సంపత్తిని పెంచుకుంటూనే ఉన్నారు. న్యూక్లియర్ వెపన్స్కు ప్రాధాన్యత ఇస్తోన్నారు.
పార్లమెంట్లో బిల్లు..
ఈ పరిణామాల మధ్య కిమ్ జొంగ్ ఉన్ తాజాగా మౌనాన్ని వీడారు. తమ దేశాన్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా అవసరమైతే అణ్వస్త్రాలను ప్రయోగించడానికి ఏ మాత్రం వెనుకాడబోమని తేల్చి చెప్పారు. దీనికి అవసరమైన బిల్లును ఆ దేశ పార్లమెంట్ ఆమోదించింది. యుద్ధం రావడమంటూ జరిగితే- ఆటోమేటిక్గా న్యూక్లియర్స్ వెపన్స్ను ప్రయోగించేలా ఈ తీర్మానాన్ని రూపొందించింది ఉత్తర కొరియా ప్రభుత్వం. పార్లమెంట్ ఆమోదం తీసుకోవాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది.
అమెరికా బెదిరింపులు..
ఈ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా కిమ్ జొంగ్ మాట్లాడారు. అమెరికాతో యుద్ధభయాలు ఉన్నాయని తేల్చిచెప్పారు. తమ దేశాన్ని ఆక్రమించుకోవడానికి అమెరికా మున్ముందు అనేక ప్రణాళికలను వేసే ప్రమాదం లేకపోలేదని అన్నారు. అమెరికా వంటి అగ్రరాజ్యాన్ని ఎదుర్కొనడానికి అణ్వాయుధాలను సమకూర్చుకోవాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. తమను అణ్వాయుధాలను సమకూర్చుకునేలా అమెరికా స్వయంగా ప్రోత్సహించేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు.