నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ ప్రమాణం: మోడీ విషెస్
ఖాఠ్మాండ్: నేపాల్ కొత్త ప్రధానిగా సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలి (63) ఎన్నికయ్యారు. ఆయన సోమవారం 38వ నేపాల్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. నేపాల్ రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత ప్రధాని ఎవరన్న విషయంలో రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయానికి రాకపోవడంతో ఎన్నిక అనివార్యమైంది.
ఈ ఎన్నికలో ప్రస్తుత ప్రధాని, అతిపెద్ద పార్టీ అయిన నేపాలీ కాంగ్రెస్ నేత సుశీల్ కోయిరాలను శర్మ ఓడించారు. కేపీ శర్మ ఓలి.. నేపాల్ కమ్యూనిస్టు పార్టీ(యునిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్టు) చైర్మన్గా ఉన్నారు. ప్రధానిగా ఎన్నికయ్యేందుకు 299 ఓట్లు అవసరం ఉండగా.. ఆయన 338 ఓట్లు సాధించారు.
దేశానికి ఆయన 38వ ప్రధాని కాగా.. 2008లో రాజ్యాంగ అసెంబ్లీ ఎన్నికల అనంతరం ప్రధానిగా బాధ్యతలు చేపడుతున్న 8వ నేత. శర్మకు యూసీపీఎన్ (మావోయిస్టు), రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ, మాధేశి జనాధికార్ ఫోరం(డెమోక్రటిక్) మద్దతు పలికాయి. కోయిరాలాకు డెమోక్రటిక్ మాధేశి ఫ్రంట్లోని నాలుగు పార్టీలు మద్దతుగా నిలిచాయి.
2006లో ప్రజాఉద్యమం తర్వాత గిరిజాప్రసాద్కోయిరాలా మధ్యంతర ప్రభుత్వంలో ఉప ప్రధానిగా, 1994లో మన్మోహన్ అధికారి నాయకత్వంలోని ప్రభుత్వంలో హోంమంత్రిగా శర్మ పనిచేశారు. కమ్యూనిస్టు పార్టీనుంచి ఈయన మూడవ ప్రధాని కావడం విశేషం.
నేపాల్ ప్రధానిగా ఎన్నికైన కేపీ ఓలికి భారత ప్రధాని నరేంద్రమోడీ అభినందనలు తెలిపారు. ఓలికి ఫోన్ చేసిన మోడీ.. నేపాల్తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. త్వరలో భారత పర్యటనకు రావాలని ఓలిని ఆహ్వానించినట్లు మోడీ ట్విటర్లో కూడా పేర్కొన్నారు.