హత్య: తీర్పు వెలువరిస్తుండగా ఏడ్చేసిన పిస్టోరియస్
ప్రిటోరియా: తన ప్రేయసి హత్య కేసులో న్యాయమూర్తి తీర్పు చదవడం ప్రారంభించిన సమయంలో బ్లేడ్ రన్నర్ ఆస్కార్ ప్రిస్టోరియస్ ఏడ్చేశాడు. డాక్లో కూర్చున్న పిస్టోరియస్ కంటతడి పెట్టడం కనిపించింది. గురువారంనాడు న్యాయమూర్తి తీర్పు చదవడం ప్రారంభించారు. తీర్పు పూర్తి పాఠం చదవడానికి రెండు రోజులు పడుతుందని భావిస్తున్నారు.
తన ప్రేయసి అయిన మోడల్ రీవా స్టీన్కాంప్ను పిస్టోరియస్ 2013లో ప్రేమికుల రోజున హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. హత్య కేసులో దోషిగా తేలితే అతనికి జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. ఈ కేసులో తుది తీర్పు శుక్రవారం వస్తుంది. శిక్ష ఖరారుకు ఇప్పటి నుంచి వారం రోజులు పడుతుందని చెబుతున్నారు.
ఆరు నెలల పాటు జరిగిన విచారణ ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించింది. కోర్టు హౌస్ చుట్టూ గురువారంనాడు 20 మంది పోలీసుల దాకా ఉన్నారు. పిస్టోరియా తన నివాసంలోని బాత్రూంలో తన ప్రేయసిని కాల్చి చంపినట్లు ఆరోపణలు వచ్చాయి.
పిస్టోరియస్ న్యాయశాస్త్ర పట్టభద్రురాలు, మోడల్ను టాయిలెట్ తలుపు గుండా నాలుగు రౌండ్లు కాల్చి చంపాడని న్యాయమూర్తి అన్నారు. దాంతో స్ప్ర్టింటర్ విభేదించలేదు. ఇద్దరి మధ్య తీవ్రమైన వాగ్వివాదం జరిగిన తర్వాత ఆగ్రహం పట్టలేక అతను మోడల్ను చంపాడని ప్రాసిక్యూషన్ వాదించింది. పిస్టోరియస్ వాంగ్మూలంతో పాటు 40 మంది సాక్షుల వాంగ్మూలాలను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాత న్యాయమూర్తి మసిపా తీర్పును వెలువరిస్తారు.
పిస్టోరియస్కు ఊరట లభించింది. పిస్టోరియస్ పథకం ప్రకారం చేసిన హత్య కాదని న్యాయమూర్తి చెప్పారు. తీర్పు వెలువరిస్తున్నంత సేపు పిస్టోరియస్ చేతుల్లో ముఖం దాచుకుని కూర్చున్నాడు.