పాక్ తాలిబన్ చీఫ్ మసూద్ హతం: అమెరికా డ్రోన్ల దాడి
ఇస్లామాబాద్: అమెరికా డ్రోన్ దాడుల్లో పాకిస్థాన్ తాలిబాన్ చీఫ్ హకీముల్లా మసూద్ హతమయ్యాడు. ఈ మేరకు పాకిస్థాన్ మీడియా కథనాలను వెలువరించింది. హకీముల్లాను పట్టుకోవడానికి సిఐఏ ఆధ్వర్యంలోని నిఘా విమానం ఎప్పటి నుంచో కన్నేసింది.
ఉత్తర వజీరిస్థాన్లోని దాండే దర్పాఖెల్ ప్రాంతంలోని ఓ కాంపౌంట్పై నిఘా పెట్టింది. పాకిస్థాన్ తాలిబాన్ నాయకులు శుక్రవారం అత్యంత కీలకమైన సమావేశంలో ఉన్నారు. ఈ విషయం తెలిసిన అమెరికా దళాలు మిస్సైళ్లతో దాడి చేశాయి. దీంతో ఆ కాంపౌండ్ పూర్తిగా ధ్వంసమైపోయింది.
హకీముల్లా సహా ఆరుగురు ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. మృతి చెందిన వారిలో మసూద్, ఆయన సమీప బంధువు, అంగరక్షకుడు తారీఖ్, డ్రైవర్ అబ్దుల్లాలు ఉన్నారు.
అమెరికా నిఘా సంస్థ రిమోట్ సాయంతో నడిచే పైలట్ లేని విమానాల(డ్రోన్ల) నుంచి క్షిపిణులతో దాడి జరిపింది. మసూద్ మృతి చెందినట్లు తాలిబన్ వర్గాలు ధృవీకరించాయి. అతడి అంత్యక్రియలను మిరాన్ షా ప్రాంతంలో నిర్వహించారు.