మళ్లీ అమెరికా-పాక్ బంధం ? వాషింగ్టన్ లో ఆర్మీ ఛీఫ్ బజ్వా-ఇమ్రాన్ చిచ్చు ఆర్పేందుకే !
గతేడాది పాకిస్తాన్ లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపధ్యంలో అమెరికాతో ఆ దేశ సంబంధాలు బెడిసికొట్టాయి. ముఖ్యంగా అప్పట్లో ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ తనను గద్దెదింపేందుకు యూఎస్ లో కుట్ర జరిగిందంటూ చేసిన వ్యాఖ్యలు ఇరుదేశాల మధ్య చిచ్చు రేపాయి. అప్పటినుంచి పాక్ పై ఆగ్రహంగా యూఎస్ ను బుజ్జగించేందుకు ఇప్పుడు త్వరలో రిటైర్ కాబోతున్న ఆర్మీ ఛీఫ్ కమర్ జావెద్ బజ్వా రంగంలోకి దిగారు. అమెరికాలో పర్యటిస్తూ తిరిగి ఇరుదేశాల సంబంధాల్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు.

మళ్లీ పాక్-యూఎస్ బంధం
గతంలో భారత్, పాకిస్తాన్ ఇద్దరితోనూ సత్సంబంధాలు కొనసాగించి సైనిక సామాగ్రి వ్యాపారం చేసుకున్న అమెరికాకు ఆ తర్వాత ఆ దేశం షాకిచ్చింది. ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్న కాలంలో అమెరికాతో సంబంధాలు బెడిసికొట్టాయి. ముఖ్యంగా తనను కాదని విపక్షాలకు మద్దతిస్తున్న అమెరికాపై ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా మండిపడ్డారు. తనను గద్దె దించేందుకు అమెరికా కుట్ర చేస్తోందంటూ ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర కలకలం రేపాయి. దీంతోపాటే పాక్-యూఎస్ సంబంధాలు కూడా బెడిసికొట్టాయి. దీనిపై ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న పాకిస్తాన్ తాజాగా పాత బంధాల్ని పునరుద్ధరించుకునేందుకు ప్రయత్నిస్తోంది.

అమెరికాలో పాక్ ఆర్మీ ఛీఫ్
గతంలో ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యల నేపథ్యంలో అమెరికాతో దెబ్బతిన్న సంబంధాల్ని తిరిగి సాధారణ స్ధితికి తెచ్చేందుకు త్వరలో రిటైర్ అవుతున్న పాకిస్తాన్ ఆర్మీ ఛీఫ్ జనరల్ కమర్ జావెద్ బజ్వా ప్రయత్నాలు ప్రారంభించారు. తాజాగా ఆయన అమెరికాలోని వాషింగ్టన్ డీసీని సందర్శించారు. అమెరికా రక్షణామంత్రి లాయిడ్ అస్టిన్, జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ తో పాక్ ఆర్మీ ఛీఫ్ కమర్ జావెద్ బజ్వా భేటీ అయ్యారు. ప్రాంతీయ భద్రతపై వీరితో జనరల్ బజ్వా చర్చించినట్లు పాక్ ఆర్మీ ప్రకటించింది. ఇరుపక్షాల భద్రతా అవసరాలపై చర్చించినట్లు పెంటగాన్ కూడా ప్రకటించింది.

అమెరికాకు పాక్ ఆర్మీ ఛీఫ్ హామీ
అదే సమయంలో పాకిస్తాన్ ఆర్మీ ఛీఫ్ గా తన స్ధానంలో పగ్గాలు చేపడతారని భావిస్తున్న చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ అజర్ అబ్బాస్ ను కూడా ఆర్మీ ఛీఫ్ బజ్వా తీసుకెళ్లారు. తన స్ధానంలో అబ్బాస్ పగ్గాలు చేపడతారని, కాబట్టి యూఎస్-పాక్ ఆయుధ ఒప్పందాల్లో ఇబ్బందులేవీ ఉండబోవని ఆయన అమెరికాకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. తద్వారా పాకిస్తాన్ తో గత సంబంధాల్ని పునరుద్ధరించాలని బజ్వా కోరినట్లు సమాచారం. దీనిపై అమెరికా కూడా సంతృప్తి వ్యక్తం చేసినట్లు దౌత్య వర్గాలు తెలిపాయి.

భారత్ పై ప్రభావమిదే !
గతంలో భారత్-పాక్ ఇద్దరినీ తమ ఆయుధ సామాగ్రి అమ్మకాలకు వాడుకున్న అమెరికా ఆ తర్వాత పాక్ దూరం కావడంతో భారత్ పై ఫోకస్ పెట్టింది. అదే సమయంలో పాకిస్తాన్ కూడా చైనా వైపు మొగ్గింది. దీంతో అమెరికాకు కంటగింపుగా కూడా మారింది. కానీ తాజా పరిణామాలతో తిరిగి అమెరికా-పాకిస్తాన్ బంధం తిరిగి చిగురిస్తే మాత్రం భారత్ పై ఆ మేరకు ప్రభావం పడుతుంది. ముఖ్యంగా అమెరికా భారత్ కు ఇవ్వచూపుతున్న అత్యాధునిక సైనిక సంపత్తిని పాకిస్తాన్ తో పంచుకోవడం ఖాయం. అప్పుడు అదే ఆయుధాలతో భారత్ పై పోరుకు, ఉగ్రవాదానికి పాకిస్తాన్ వాడుకునే ప్రమాదం పొంచి ఉంది. దీంతో అమెరికాలో పాక్ ఆర్మీ ఛీఫ్ పర్యటనను భారత్ కూడా నిశితంగా గమనిస్తోంది.












Click it and Unblock the Notifications