శ్రీలంక బాటలోనే పాకిస్తాన్ ? 180కి చేరిన పెట్రోల్-తాజాగా రూ.30 పెంపు-ఐఎంఎఫ్ షరతులతో
తాజాగా శ్రీలంకలో ఆర్ధిక సంక్షోభం రాజకీయ సంక్షోభంగా మారి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటోందో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు భారత్ కు మరో పొరుగుదేశం పాకిస్తాన్ కూడా అలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. నానాటికీ దిగజారుతున్న ఆర్ధికపరిస్ధితులతో ఐఎంఎఫ్ సాయం కోసం ఎదురుచూస్తున్న షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం..తాజాగా పెట్రో ధరల్ని లీటరుకు ఏకంగా రూ.30 చొప్పున పెంచేసింది. దీంతో పెట్రో ధరలు ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంటున్నాయి.
పాకిస్తాన్లో పెట్రో ధరలు కొంతకాలంగా క్రమంగా పెరుగుతున్నాయి. పెట్రో ధరల విషయంలో ప్రభుత్వం తీరుపై పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ వ్యాఖ్యలపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కౌంటర్ ఇచ్చారు. దేశం దివాళా తీయకుండా ఉండేందుకే ఇంధన ధరలను పెంచడం తప్పనిసరి అని ప్రధాని షాబాజ్ స్పష్టం చేశారు.
పెట్రోలియం ధరల పెంపు నిర్ణయం కఠినమైనది కానీ, తప్పనిసరి పరిస్థితుల్లో పెంచాల్సి వస్తోందన్నారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలంటూ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాలు, నిర్లక్ష్యం కారణంగానే దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నదని ఇమ్రాన్పై మండిపడ్డారు.
గతంలో అధికారంలో ఉన్న ఇమ్రాన్ ఖాన్ సర్కార్ పెట్రోల్ సహా పలు ఇంధనాలపై సబ్సిడీ ఇచ్చింది. ధరల పెంపుపై ఐఎంఎఫ్ సూచనలను పట్టించుకోకుండా సబ్సిడీలను కొనసాగిస్తూ వచ్చారు. కానీ పెట్రోల్ ధరలు పెంచితేనే ఆర్థిక సాయం అందిస్తామని ఐఎంఎఫ్ తేల్చిచెప్పడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రధాని షాబాజ్ స్పష్టం చేశారు. ఇంధనంపై అమలులో ఉన్న రాయితీ సదుపాయాన్ని తొలగించే వరకు పాకిస్తాన్కు ఎలాంటి ఆర్థిక సాయం అందించలేమని ఐఎంఎఫ్ తెగెసి చెప్పింది. దీంతో ప్రభుత్వం పెట్రో ధరల పెంపుకు మొగ్గు చూపింది.