నాకు మామూలే!, వ్యక్తిని హెలికాప్టర్ నుంచి తోసేశా: ఫిలిప్పీన్స్ ప్రెసిడెంట్ షాక్
తాను ఒక మనిషిని హత్య చేశానంటూ ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టి సంచలన ప్రకటన చేశారు.
మనీలా: తాను ఒక మనిషిని హత్య చేశానంటూ ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టి సంచలన ప్రకటన చేశారు. ఓసారి ఓ వ్యక్తిని హెలికాప్టర్ నుంచి తోసేశానంటూ ఆయన స్వయంగా ఓ సమావేశంలో వెల్లడించడం అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేసింది. తుపాను బాధితులతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
'మీరు అవినీతికి పాల్పడితే హెలికాప్టర్లో ఎక్కించుకుని మనీలాకు తీసుకుపోయి అక్కడి నుంచి తోసేస్తా. ఇంతకుముందు ఇలా చేశాను. నాతో పాటు హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న ఓ చైనా వ్యక్తి అత్యాచారం, హత్య కేసులో నిందితుడని తెలిసి అతణ్ణి అలాగే తోసేశాను. ఇప్పుడెందకు చేయలేను' అంటూ ఆయన అందర్నీ షాక్కి గురిచేశారు.
రోడ్రిగో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి, మాదకద్రవ్యాలపై యుద్ధం ప్రకటించినప్పటి నుంచి ఆ దేశంలో 6,100కు పైగా చనిపోయారు. చాలా మందిని మాదకద్రవ్యాల రవాణా చేస్తున్నారంటూ ప్రభుత్వమే హత్యలు చేయించినట్లు ఆరోపణలున్నాయి.
కాగా, మాదక ద్రవ్యాల కారణంగా హత్యలు, లూటీలతో శాంతిభద్రతలకు భంగం వాటిల్లింది. దవావో నగరానికి రోడ్రిగో 22 ఏళ్లపాటు మేయర్గా పనిచేసినపుడు ద్విచక్రవాహనంపై ఎవరిని చంపేయాలా? అని వెదుకుతూ తిరిగేవాడినని డ్యుటెర్టి గురించి పలువురు చెబుతుండటం గమనార్హం. అయితే, రోడ్రిగో మాత్రం.. ఇవన్నీ చట్టబద్ధమైన పోలీస్ చర్యల్లో భాగంగా మాత్రమే చేసినవని సమర్థించుకున్నారు.