Covid-19 : కరోనాకే సవాల్ విసురుతున్న ఇరాన్.. మసీదుల్లో కిటికీలను నాకుతున్న జనం.. ఎందుకలా?
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ చైనా తర్వాత ఆ స్థాయిలో ప్రభావం చూపించింది ఇరాన్ పైనే. ఇరాన్లో ఇప్పటికే 66 మంది కరోనా బారిన పడి మృత్యువాత పడ్డారు. రోజురోజుకు మృతుల సంఖ్య,కొత్త కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇరాన్ మృతుల్లో పేరు మోసిన ప్రముఖ మతాధికారి హది ఖోస్రోషాహి ఉన్నారు. అలాగే ఇప్పటివరకు 1500 కరోనా కేసులు నమోదు కాగా.. అందులో దేశ ఉపాధ్యక్షురాలు ఎబ్తేకర్,డిప్యూటీ హెల్త్ మినిస్టర్ ఇరాజ్ హైరాచి కూడా ఉండటం గమనార్హం. కరోనాను ఆలస్యంగా గుర్తించడంతో మూల్యం చెల్లించుకుంటున్న ఇరాన్లో ఇప్పుడు మతపరమైన నమ్మకాలు కూడా సవాల్ విసురుతున్నాయి.
ఇరాన్లో ఏం జరుగుతోంది..
ఇరాన్లో పవిత్ర నగరంగా భావించే కోమ్లో ఫిబ్రవరి 19న మొదటి కరోనా వైరస్ కేసు నమోదైంది. కరోనా కేసు బయటపడిందంటే ఆయా దేశాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయో తెలిసిందే. కానీ ఇరాన్లో మాత్రం పరిస్థితి అలా లేదు. కోమ్లో మొదటి కేసు బయటపడి రెండు వారాలు గడుస్తున్నా.. కేసుల సంఖ్య మరింత పెరుగుతున్నా.. ఆ నగరాన్ని నిర్బంధించడాన్ని ఇస్లామిక్ మతాధికారులు,మత పెద్దలు ఒప్పుకోవట్లేదు. దీంతో ఇప్పటికీ కోమ్లోని పవిత్ర స్థలం అలీ ఐబీఎన్ ముసా అల్ రెజా మసీదును జనం సందర్శించుకుంటూనే ఉన్నారు. సందర్శించుకోవడమే కాదు.. మాకు కరోనా సోకనే సోకదని సవాల్ కూడా విసురుతున్నారు.
ఆ మసీదుకు వెళ్లి.. అక్కడి కిటికీలను..
అలీ ఐబీఎన్ ముసా అల్ రెజాను సందర్శించుకుంటున్న జనం.. ఆ మసీదుకు ఉన్న కిటికీని నాలుకతో నాకుతుండటం గమనార్హం. ఎందుకిలా చేస్తున్నారంటే.. కరోనా వైరస్ కారణంగా మసీదును దర్శించుకోవద్దని కొంతమంది చెబుతున్నారని.. అలాంటి దుష్ప్రచారంతో తమ మత ఆచారాలకు అడ్డువస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. వైరస్లు,వ్యాధులను సాకుగా చూపి మతానికి సంబంధించిన విలువలను త్యజిస్తే చరిత్రలో దాన్ని మించిన అవమానం ఇంకొకటి ఉండదని అంటున్నారు. అందుకే ఆ మసీదును సందర్శించడంతో పాటు ఆ కిటికీని నాకి.. అక్కడ ఎలాంటి వైరస్లు లేవని నిరూపించేందుకే అలా చేస్తున్నామని చెబుతున్నారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో కూడా పోస్టు చేస్తుండటంతో.. అవి కాస్త వైరల్ అవుతున్నాయి.
కరోనాకే సవాల్ విసురుతున్నారు..
'ఈ ప్రాంగణంలో వైరస్ ఉందని చెబుతున్నారు కదా.. అందుకే ఈ కిటికీని నాకి..' ఆ వైరస్ మొత్తాన్ని తమలోకి తీసుకుంటున్నామని.. కాబట్టి మిగతావారు ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చునని చెబుతున్నారు.
ఇస్లామిక్ మెడిసిన్ నిపుణుడు హుస్సేన్ రవజదెహ్ మాట్లాడుతూ.. మనం అందరినీ ముద్దాడాలని.. అందరినీ కలవాలని.. ఆవిధంగా ఏ వైరస్ మనల్ని ఏమీ చేయలేదని నిరూపించాలని పిలుపునిచ్చారు. వాళ్లు మన మతాన్ని లక్ష్యం చేసుకున్నారని.. మనకు హానీ చేయాలని చూస్తున్నారని.. కాబట్టి ఈ వైరస్ చుట్టూ జరుగుతున్న ప్రచారమంతా అర్థం లేనిదని అన్నారు. ఎలాంటి వ్యాధినైనా నిర్మూలించవచ్చునని.. కరోనా వైరస్ సోకినవాళ్ల వద్దకు వెళ్లి నయం చేసేందుకు తాను సిద్దమని ప్రకటించారు. అసలు కరోనా కారణంగానే మనుషులు చనిపోతున్నారని ఎక్కడా నిర్దారణ కాలేదని ఆయన పేర్కొనడం గమనార్హం. కరోనా పేరుతో మెడికల్ అబ్జర్వేషన్లో పెట్టి రోజుకు కిలోల చొప్పున మందులు మింగిస్తున్నారని ఎద్దేవా చేశారు.
Recommended Video
ప్రభుత్వ పెద్దల మాట కంటే మత పెద్దల మాటే చెల్లుబాటు..
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమెనెయ్ గతవారం కీలక ప్రకటన చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో శుక్రవారం జరగాల్సిన ప్రార్థనలను తాత్కాలికంగా రద్దు చేసుకోవాలని పిలుపునిచ్చారు. 1979 విప్లవం తర్వాత ఇరాన్లో ఇలా ప్రార్థనలు రద్దు చేసే సందర్భం తలెత్తడం ఇదే మొదటిసారి. ఆయన ఆదేశాలపై ఈశాన్య నగరం మషద్ లోని పవిత్ర మందిరం యొక్క సంరక్షకుడు అయతోల్లా అహ్మద్ మార్వి సానుకూలంగా స్పందించారు. టెహ్రాన్ నుంచి ఆదేశాలు వస్తే మసీదును మూసివేసేందుకు సిద్దమని ప్రకటించారు. ఆరోగ్యశాఖ అధికారుల ఆదేశాలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ ఇస్లాం మత ఆరాధకులు మాత్రం ఆ మాటలను వినిపించుకోవడం లేదు. ఇలాంటి క్లిష్ట తరుణంలోనే ఇస్లాం పట్ల తమ ఆరాధనను వ్యక్తపరచాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ వ్యాప్తిని లెక్క చేయకుండా ఆయా మసీదులను సందర్శిస్తున్నారు. అలీ ఐబీఎన్ ముసా అల్ రెజా మసీదు లాంటి చోట్ల కిటికీలను నాకి మరీ కరోనాకే సవాల్ విసురుతున్నారు.