ఇమ్రాన్ ఖాన్ను ముంచిన మిత్రపక్షం: విపక్షానికి మద్దతు: రాజీనామాకు పాకిస్తాన్ ప్రధాని సిద్ధం
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో కొంతకాలంగా చోటు చేసుకుంటూ వస్తోన్న రాజకీయ పరిణామాలు పతాక స్థాయికి చేరాయి. ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలో అధికారంలో ఉన్న పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ సంకీర్ణ ప్రభుత్వం పతనం అంచుల్లో నిలిచింది. కుప్పకూలడం ఖాయమైంది. ఇమ్రాన్ ఖాన్ తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారంటూ వార్తలు వస్తోన్నాయి. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ కంటే ముందే తప్పుకొంటారని సమాచారం.
మెజారిటీని కోల్పోయిన ప్రభుత్వం..
342 మంది సభ్యుల బలం ఉన్న పాకిస్తాన్ పార్లమెంట్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం 172. 2018 నాటి ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI)కు దక్కినవి 155 స్థానాలే. దీనితో ఆయన ముత్తాహిదా క్వామి మూవ్మెంట్ పాకిస్తాన్ (MQMP)తో పొత్తు పెట్టుకున్నారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు తాజాగా ఈ ఎంక్యూఎం తన మద్దతును ఉపసంహరించుకుంది. ఈ విషయాన్ని కొద్దిసేపటి కిందటే ప్రకటించింది.
ప్రతిపక్షానికి మద్దతు..
ప్రతిపక్ష పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి తాము మద్దతు ఇస్తున్నట్లు ఎంక్యూఎం నాయకులు ప్రకటించారు. ఈ విషయాన్ని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (PPP) అధికారికంగా ప్రకటించింది. ఎంక్యూఎం నాయకులు తమను సంప్రదించారని, చర్చల సందర్భంగా తమ మధ్య ప్రస్తావనకు వచ్చిన అంశాలపై పరస్పర అంగీకారం కుదిరిందని పీపీపీ ఛైర్మన్ బిలావల్ భుట్టో జర్దారి తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ఎంక్యూఎంకు చెందిన రాబ్తా కమిటీ-పీపీపీ సీఈసీ భేటీ సుహృద్భావ వాతావరణం జరిగిందని, చర్చలు ఫలించాయని చెప్పారు.
ఇవ్వాళ జాయింట్ ప్రెస్మీట్..
ఈ మధ్యాహ్నం తాము జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ను నిర్వహించబోతున్నట్లు బిలావల్ భుట్టో తెలిపారు. చర్చల సారాంశాన్ని మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు. తమ మధ్య వచ్చిన అజెండా గురించి ప్రజలకు వివరిస్తామని స్పష్టం చేశారు. ప్రజల మద్దతు తమకు ఉంటుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ప్రజలకు తాను శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని వ్యాఖ్యానించారు. కంగ్రాచ్యులేషన్స్ పాకిస్తాన్.. అంటూ తన ట్వీట్ను ముగించారు.
పీపీపీకి మద్దతు..
ఎంక్యూఎంపీ నేత ఫైజల్ సబ్జ్వారి కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. తాము పీపీపీ నేతలను సంప్రదించామని, తమ మధ్య జరిగిన చర్చలు సానుకూలంగా ముగిశాయని చెప్పారు. అందుకే- తాము పీపీపీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ పనితీరు పట్ల తమ పార్టీ సంతృప్తికరంగా లేదని, పీటీఐతో సుదీర్ఘకాలం కలిసి రాజకీయ ప్రయాణాన్ని సాగించలేమని ఆయన వ్యాఖ్యానించారు.
రేపే అవిశ్వాస తీర్మానం..
మద్దతు ఉపసంహరించుకోవడంతో ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పీటీఐ ప్రభుత్వం మైనారిటీలో పడింది. దీనితో పాకిస్తాన్ పార్లమెంట్లో గురువారం షెడ్యూల్ చేసిన అవిశ్వాస తీర్మానం ఓటింగ్పైనే అందరి దృష్టీ నిలిచింది. ఈ ఓటింగ్ సందర్భంగా పీటీఐ ఓడిపోవడం దాదాపు లాంఛనప్రాయమైనట్టేనని చెబుతున్నారు. ఈ పరిణామాల మధ్య ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేయక తప్పట్లేదు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ ముందే రాజీనామా చేయొచ్చని తెలుస్తోంది.
అవినీతికి అడ్డుకట్టే వేసే ప్రయత్నాలు..
సంకీర్ణ ప్రభుత్వం నడపించడానికి అవసరమైన లౌక్యం ఆయనలో కొరవడిందని, అందుకే ఈ పరిస్థితి తలెత్తిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. పాకిస్తాన్ చరిత్రలోనే మొదటిసారిగా ఇద్దరు హిందువులను పాకిస్తాన్ మిలటరీలో లెప్టినెంట్ కల్నల్గా ప్రమోట్ చేయడం చాలామందికి నచ్చట్లేదని చెబుతున్నారు. అవినీతి ఆరోపణలు ఉన్న రాజకీయ నాయకులపై కేసులు నమోదు చేయించడం, వారిని జైలుపాలు చేయడం కూడా రాజకీయంగా వ్యతిరేకత ఏర్పడటానికి కారణమైందని అంటున్నారు.