ఎస్సీఓలో భారత్, పాక్: చైనాకు మోడీ థ్యాంక్స్, ‘దంగల్’పై జింపింగ్ ప్రశంసలు
షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ)లో పూర్తిస్థాయి సభ్యులుగా భారత్, పాకిస్థాన్లు ప్రమాణం చేశాయి. కజకిస్థాన్ రాజధాని ఆస్తానాలో జరిగిన ఎస్సీఓ వార్షిక సదస్సులో ఈ మేరకు ఇరు దేశాలు సంతకాలు చేశాయి.
ఆస్తానా: షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ)లో పూర్తిస్థాయి సభ్యులుగా భారత్, పాకిస్థాన్లు ప్రమాణం చేశాయి. కజకిస్థాన్ రాజధాని ఆస్తానాలో జరిగిన ఎస్సీఓ వార్షిక సదస్సులో ఈ మేరకు ఇరు దేశాలు సంతకాలు చేశాయి. పూర్తికాల సభ్యులుగా చేరిన సందర్భంగా భారత్, పాక్ ప్రధానులు నరేంద్ర మోడీ, నవాజ్ షరీఫ్లను సంస్థలోని ఇతర సభ్యదేశాలు అభినందించాయి.
మోడీ ధన్యవాదాలు
12ఏళ్ల పరిశీలన అనంతరం భారత్కు ఎస్సీఓ సభ్యత్వం దక్కడం ఆనందంగా ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ సందర్భంగా సభ్యదేశాలన్నింటికీ ధన్యవాదాలు తెలిపారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో కలిసికట్టుగా పోరాడుదామని మోడీ పిలుపునిచ్చారు. మానవాళికి పొంచివున్న అతిపెద్ద ముప్పు ఉగ్రవాదమేనని, దానిని అంతం చేస్తేనే గానీ ప్రగతి సాధించలేమని అన్నారు.
షరీఫ్ అభినందనలు
పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా సదస్సులో ప్రసంగించారు. ‘ఎస్సీఓలో సభ్యత్వం పొందిన సందర్భంగా భారత్ కు నా శుభాకాంక్షలు' అని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తన ప్రసంగాన్ని ప్రారంభించడం గమనార్హం. ‘మన భవిష్యత్ తరాలను యుద్ధం, సంఘర్షణల వైపు పోనీయకుండా శాంతి సమాధానాలతో జీవించేలా చేయడం మన కర్తవ్యం. ఇందుకు షాంఘై సహకార సంస్థ కృషి చేస్తుంది' అని షరీఫ్ పేర్కొన్నారు.
ఎస్సీఓలో భారత్, పాక్
యూరప్-ఆసియా దేశాల మధ్య ఆర్థిక, రాజకీయ, సైనిక సహకారం కోసం 1996లో ఏర్పాటైన కూటమి షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ)లో చైనా, కజకిస్థాన్, కర్గీజ్స్థాన్, తజకిస్థాన్, రష్యాలు వ్యవస్థాపక సభ్యదేశాలుగా ఉన్నాయి. 2001లో జరిగిన మొదటి విస్తరణలో ఉబ్జెకిస్థాన్ సభ్యత్వం పొందగా, శుక్రవారం(జూన్ 9, 2017) భారత్, పాకిస్థాన్లు పూర్తికాల సభ్యులయ్యాయి.
‘దంగల్’ బాగుందన్న చైనా అధ్యక్షుడు జింపింగ్
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ నటించిన ‘దంగల్' తనకు బాగా నచ్చిందని చైనా అధ్యక్షుడు జీ జింపింగ్ భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇలాంటి సినిమాలు మరిన్ని చైనాలో రిలీజ్ కావాలన్న ఆకాంక్షను మోడీకి తెలియజేశారు. చైనాలో గత నెలలో ‘దంగల్' విడుదలైన విషయం తెలిసిందే. 9వేల థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. చైనీస్, ఇంగ్లీషేతర భాషల సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.