జిన్పింగ్, వ్లాదిమిర్ పుతిన్ సరసన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం ఉజ్బెకిస్తాన్ పర్యటనలో ఉన్నారు. రెండు రోజుల పాటు ఆ దేశంలో పర్యటించనున్నారు. ఉజ్బెకిస్థాన్లో పర్యటించడం మోదీకి ఇది నాలుగోసారి శనివారం ఉదయం ఆయన ఢిల్లీ నుంచి ఉజ్బెక్ కు బయలుదేరి వెళ్లారు. సాయంత్రానికి ఆ దేశ రాజధాని తాష్కెంట్ లో ల్యాండ్ అయ్యారు. తాష్కెంట్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఆయనకు ఘనస్వాగతం లభించింది. ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షావ్కత్ మిర్జియోయెవ్ స్వయంగా ఎయిర్ పోర్ట్ కు వచ్చి ప్రధాని మోదీకి స్వాగతం పలకడం హైలైట్.
ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పౌర పురస్కారం దక్కింది. మిర్జియోయెవ్ ఈ అవార్డును స్వయంగా ఆయనకు ప్రదానం చేశారు. ఓలీ దరజాలీ దోస్త్లిక్ అంటే.. ఆర్డర్ ఆఫ్ ది హయ్యెస్ట్ ఫ్రెండ్షిప్ అని అర్థం. తాష్కెంట్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మిర్జియోయెవ్ దీన్ని మోదీకి అలంకరించారు. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలను బలోపేతం చేయడం, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నూతన శిఖరాలకు తీసుకెళ్లడంలో మోదీ చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డుతో సత్కరించారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. తనకు లభించిన ఈ అరుదైన గౌరవాన్ని భారత్, ఉజ్బెకిస్థాన్ మధ్య ఉన్న శతాబ్దాల నాటి సుదీర్ఘ మైత్రికి, ఇరు దేశాల ప్రజలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న బలమైన బంధానికి ఈ పురస్కారమే ప్రధాన నిదర్శనని వ్యాఖ్యానించారు. గతంలో ఈ అవార్డును ఇతర దేశాధినేతలు, ప్రధానమంత్రులు అందుకున్నారు.
చైనా అధినేత గ్ఝి జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ పురస్కారాన్ని పొందారు. ఇల్హమ్ అలీవ్- అజర్బైజాన్, సెర్దార్ బెర్డిముహమెడో- తుర్క్మెనిస్తాన్, కాస్సిమ్ జోమార్ట్ టోకాయెవ్- కజకిస్తాన్ అందుకున్నారు. కాగా.. ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల ప్రతినిధి బృందాల మధ్య ఉన్నత స్థాయి దౌత్య చర్చలు పూర్తయ్యాయి. వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్ కనెక్టివిటీ, రక్షణ, ఇంధన రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత విస్తృతం చేసుకోవడానికి అనువైన మార్గాలపై ఇరు దేశాల అధినేతలు సుదీర్ఘంగా చర్చించారు.
రాబోయే కాలంలో ఇరు దేశాల మధ్య ఆర్థిక, రక్షణ పరమైన బంధాలను మరింత బలోపేతం చేయనున్నాయని అధికారులు వెల్లడించారు. వికసిత్ భారత్, యాంగీ ఉజ్బెకిస్థాన్ వంటి భవిష్యత్తు ప్రణాళికలను పరస్పర సహకారంతో ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఇరు దేశాలు విశ్లేషించాయి. రెండు దేశాల సమగ్ర ఆర్థికాభివృద్ధి, సాంకేతిక ఆధునీకరణ, పారిశ్రామిక వృద్ధి లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా సాధించడమే పరమావధిగా ఉమ్మడి కార్యాచరణకు సుముఖత వ్యక్తం చేశారు.













Click it and Unblock the Notifications