పుల్వామా దాడి ఘటనపై స్పందించిన పాక్ ప్రధాని ... సూక్తులు చెపుతూ ఖండన
ఇస్లామాబాద్ : పుల్వామాలో రక్తపుటేరులు పారించిన ఉగ్ర మూకల దుశ్చర్యను పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఖండించారు. దాడి జరిగిన ఐదురోజులకు స్పందించిన ఆయన .. తమపై భారత్ నిరాధారంగా ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. పుల్వామా దాడితో పాకిస్థాన్ కు ఎలాంటి సంబంధం లేదని ఘటనను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు.

సాక్ష్యాలు, ఆధారాలు చూపండి ...
పుల్వామా దాడికి సంబంధించి భారత్ వద్ద ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఏ సాక్ష్యం, ఆధారాలతో పాక్ ను నిందిస్తున్నారని విరుచుకుపడ్డారు. దాడికి సంబంధించి రుజువులు ఉంటే ఇవ్వండి తగిన చర్యలు తీసుకుంటామని తన కపట బుద్ధిని బయటపెట్టారు ఇమ్రాన్ ఖాన్. పుల్వామాలో జరిగిన దాడికి సంబంధించి భారత దేశం ఒక జాతిపై అన్యాయంగా ముద్ర వేస్తుందని విషం వెళ్లగక్కారు.
కయ్యానికి సై
దాడి చేయలేదని చెప్తూనే మరోవైపు కయ్యానికి కాలుదువ్వారు ఇమ్రాన్ ఖాన్. పుల్వామా దాడి తర్వాత నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో .. ఇరుదేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. దాడికి ప్రతిదాడి తప్పదని ప్రధాని మోదీ పదే పదే హెచ్చరించడంతో .. ఇమ్రాన్ కొత్తగా సూక్తులు వల్లిస్తున్నారు. యుద్ధం ప్రకటించడం, ప్రారంభించడం తేలికే అని సెలవిచ్చారు. కానీ ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో ఆలోచించుకోవాలని హితబోధ చేశారు. పాకిస్థాన్ పై దాడి చేస్తారా ... అయితే మేం యుద్ధానికి సిద్ధమని కవ్వింపు చర్యలకు దిగారు. తమపై భారత్ దాడికి దిగితే మేం అంతే ధీటుగా సమాధానం చెప్తామని కపట మనస్తత్వాన్ని బయటపెట్టుకున్నారు ఇమ్రాన్ ఖాన్.












Click it and Unblock the Notifications