Rishi Sunak : బ్రిటన్ ప్రధాని బాధ్యతల్లోకి రిషీ సునాక్-కింగ్ ఛార్లెస్ తో భేటీ-తప్పులు సరిచేస్తా..
బ్రిటన్ కొత్త ప్రధానిగా భారతీయ మూలాలున్న రిషీ సునాక్ నియమితులయ్యారు. తాజాగా అధికార కన్జర్వేటివ్ పార్టీ తరఫున ప్రధాని పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైన రిషీ సునాక్ ఇవాళ బకింగ్హామ్ ప్యాలెస్లో కింగ్ చార్లెస్ని కలిశారు. అనంతరం రిషీ సునాక్ ను ప్రధాని పదవిలో నియమిస్తూ కింగ్ ఛార్లెస్ 3 ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రిషీ అధికారికంగా బాధ్యతలు చేపట్టేందుకు వీలు కలిగింది.
బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రిషీ సునాక్.. జాతినుద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ఇందులో ఆయన తనకంటే ముందు ప్రధానిగా పనిచేసిన లిజ్ ట్రస్ హయాంలో జరిగిన తప్పుల్ని సరిదిద్దుతానని ప్రకటించారు. యూకే ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, లిజ్ ట్రస్ కొన్ని తప్పులను సరిదిద్దడానికి తాను పదవీ బాధ్యతలు చేపట్టడానికి ఎంపికయ్యానని రిషీ వెల్లడించారు.
తనపై నమ్మకం కుదిరిందని, ఇప్పుడు మీ నమ్మకం సంపాదిస్తానని బ్రిటన్ ప్రజలను ఉద్దేశించి డౌనింగ్ స్ట్రీట్ నంబర్ 10 బయట నుంచి రిషీ సునాక్ తన ప్రసంగంలో వ్యాఖ్యానించారు. అంతకు ముందు జరిగిన వీడ్కోలు సభలో తాజా మాజీ ప్రధాని లిజ్ ట్రస్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన హయాంలో పన్ను తగ్గింపుల ద్వారా ఆర్ధిక వ్యవస్ధను కాపాడేందుకు ప్రయత్నించినట్లు ఆమె సమర్థించుకున్నారు. నేతలు ధైర్యంగా ఉండాలని తెలిపారు. రిషీ సునాక్ కు తన శుభాకాంక్షలు తెలిపారు.
ట్రస్ తప్పుకోవడంతో జరిగిన టోరీల నాయకత్వ పోటీలో రిషీ సునాక్ ఏకగ్రీవంగా విజయం సాధించారు. దీంతో గత ఏడువారాల్లో టోరీలు ఎంచుకున్న మూడో నాయకుడిగా రిషీ నిలిచారు. బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన అనంతరం దేశం ఎదుర్కొంటున్న ఆర్ధిక సంక్షోభంపై ముందుగానే రిషీ హెచ్చరికలు చేశారు. అలాగే విపక్ష పార్టీలు ముందస్తు ఎన్నికల గురించి చేస్తున్న ప్రస్తావనల్ని రిషీ తోసిపుచ్చారు.