ఉక్రెయిన్కు బిగ్ షాక్: పట్టు బిగించిన రష్యా: అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్పై
కీవ్: రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతోన్న భీకర యుద్ధం.. తొమ్మిదో రోజు మరింత ఉధృతమైంది. రష్యన్ సైనిక బలగాలు తమ దాడులు ముమ్మరం చేశాయి. దాదాపు అన్ని నగరాలపైనా విరుచుకుని పడుతున్నాయి. రాజధాని కీవ్ను స్వాధీనం చేసుకునే విషయంలో పురోగతిని ప్రదర్శిస్తోన్నాయి. కీవ్కు మరింత చేరువ అయ్యాయి. ఈ విషయంలో ఉక్రెయిన్ సైన్యం నుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంటోన్నప్పటకీ- రష్యా వెనుకంజ వేయట్లేదు. ప్రత్యేకించి తూర్పు ప్రాంతంలోని పలు నగరాలపై రష్యన్ ఆర్మీ దాడులు దూకుడును కొనసాగిస్తోంది.

తూర్పు ప్రాంతంపై పట్టు..
ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంపై రష్యా దాదాపు పట్టు బిగించినట్టే కనిపిస్తోంది. ఇప్పటికే ఖేర్సన్, మెలిటొపొల్ నగరాలు రష్యా సైనికుల ఆధీనంలోకి వెళ్లాయి. ఖార్కీవ్లో అదే పరిస్థితి నెలకొంది. ఛెర్నిహివ్, మరియోపొల్ నగరాలను రష్యన్ సైనిక బలగాలు చుట్టుముట్టాయి. ఏ క్షణమైనా ఛెర్నిహివ్.. రష్యా వశం కావచ్చంటూ వార్తలు వస్తోన్నాయి. పోర్ట్ సిటీ ఒడెస్సా, బిలా సెర్క్వా, వొలిన్ ఒబ్లాస్ట్పై రష్యా వైమానిక బలగాలు బాంబుల వర్షాన్ని కురిపిస్తోన్నాయి. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలంటూ ఆయా నగరాల మేయర్లు ఆదేశాలను జారీ చేశారు.

న్యూక్లియర్ పవర్ ప్లాంట్పైనా..
తాజాగా- ఎనెర్హొడార్ సిటీపై రష్యా బలగాలు దృష్టి సారించాయి. ఉక్రెయిన్ వాయవ్య ప్రాంతంలో ఉంటుందీ నగరం. ఇక్కడి అణు విద్యుత్ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. ఉక్రెయిన్.. యూరప్ దేశాల సహకారంతో నిర్మించుకున్న అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం ఉండేది ఈ సిటీలోనే. యూరప్లోనే అతిపెద్ద న్యూక్లియర్ పవర్ స్టేషన్పై రష్యన్ వైమానిక బలగాలు రాకెట్లతో దాడులు చేశాయి. దీన్ని స్వాధీనం చేసుకున్నాయి. రష్యా బలగాలు ఈ పవర్ ప్లాంట్ ఆవరణలోకి ప్రవేశించాయి. ఈ విషయాన్ని ఉక్రెయిన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

మరో అతిపెద్ద విజయంగా..
ఇప్పటికే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంపైన పట్టు బిగించిన రష్యా సైనిక బలగాలకు- ఇది మరో అతిపెద్ద విజయంగా చెబుతున్నారు. ఉక్రెయిన్ మొత్తంలో 25 నుంచి 30 శాతం వరకు విద్యుత్ను సరఫరా అయ్యేది ఇక్కడి నుంచే. అలాంటి విద్యుత్ కేంద్రాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి రష్యా సైనిక బలగాలు. ఈ ప్లాంట్పై కొన్ని గంటల పాటు ఎడతెరిపి లేకుండా దాడులు సాగించాయి. రాకెట్లను సంధించాయి. ఈ సందర్భంగా రియాక్టర్ల నుంచి పొగలు వెలువడటం కలకలం రేపింది. ఈ ప్లాంట్ పేలిపోతే చెర్నోబిల్ కంటే 10 రెట్ల విధ్వంసం సంభవిస్తుందంటూ ఉక్రెయిన్ ఆందోళన వ్యక్తం చేసింది.
Recommended Video

అంతర్జాతీయ ఆటమిక్ ఎనర్జీ అసోసియేషన్ సైతం..
జపొరిజ్ఝియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్పై రష్యా రాకెట్లతో దాడులు చేయడం పట్ల అంతర్జాతీయ ఆటమిక్ ఎనర్జీ అసోసియేషన్ సైతం ఉలిక్కిపడింది. అక్కడి పరిస్థితులపై ఆరా తీసింది. రష్యా దాడుల తరువాత చెలరేగిన మంటలు అదుపులోకి వచ్చాయని ప్రకటించింది. ఈ పవర్ ప్లాంట్ చుట్టుపక్కల వాతావరణంలో అణు ధార్మిక శక్తి ఊహించిన స్థాయిలో లేదని స్పష్టం చేసింది. ఈ ప్లాంట్లో చెలరేగిన మంటలను అదుపు చేయాలంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం రష్యాకు డిమాండ్ చేశారు. అది పేలితే విధ్వంసం తప్పదని హెచ్చరించారు. ఇప్పుడు ఈ ప్లాంట్- రష్యా ఆధీనంలోకి వెళ్లింది.












Click it and Unblock the Notifications