టెక్కీలకు షాక్:ఉద్యోగుల తొలగింపు, రూ.200 కోట్లు ఆదా ఇలా....
ఖర్చులను తగ్గించుకోలేక ఆదాయం పెంచుకోలేక యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా 49 మంది టెక్కీలను ఉద్యోగాల నుండి తప్పించింది. ఈ పనిని భారతీయ కంపెనీ హెచ్ సి ఎల్ కు ఇచ్చింది.
శాన్ ఫ్రాన్సిస్కో:అమెరికాలో ఐటి ఉద్యోగులకు అనుకోని షాక్ తగిలింది. ఇంతకాలం పాటు తమ వద్ద పనిచేస్తోన్న 49 మంది ఐటి ఉద్యోగులను శాన్స్ ఫ్రాన్సిస్కో నగరంలోని యూనివర్శిటీ ఆఫ్ కాలిపోర్నియా ఇంటికి పంపేసింది.ఈ పనిని ఇండియాలోని హెచ్ సిఎల్ టెక్నాలజీస్ సంస్థకు ఔట్ సోర్సింగ్ కు ఇచ్చింది.
యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ ఫ్రాన్సిస్కో నగరంలోని తన కార్యాలయాన్ని మూసివేసింది. ఇక్కడ చేసే పనిని ఇండియాలో హెచ్ సి ఎల్ కంపెనీని ఔట్ సోర్సింగ్ కింద అప్పగించింది. తద్వారా యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు ప్రతి ఏటా సుమారు రూ.200 కోట్లు ఆదా అయ్యే అవకాశం ఉంది.
గత ఏడాది జూలై మాసం నుండి యూనివర్శిటీ ఆఫ్ కాలిపోర్నియా ఈ దిశగా ఆలోచిస్తోంది.ఇన్నాళ్ళ తర్వాత దాన్ని అమలు చేసింది. ఆరోగ్య రంగంతో పాటు రీసెర్చ్ ఆధారిత యూసిఎస్ ఎఫ్ కార్యక్రమాన్ని నిర్వహించే యూనివర్శిటీ ఆఫ్ కాలిపోర్నియా ఆదాయాన్ని పెంచుకోలేక ఖర్చులు తగ్గించుకోలే ఇబ్బంది పడుతోంది.
దీంతో ఇప్పుడు తమ ఐటీ పనిని ఔట్ సోర్సింగ్ కు ఇవ్వాలని నిర్ణయం తీసుకొంది. వాస్తవానికి ఔట్ సోర్సింగ్ వ్యవహరంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా మండిపడుతున్న తరుణంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా తమ పననిని ఔట్ సోర్సింగ్ కు ఇవ్వడం ఇదే మొదటిసారని ఆ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. టెక్నాలజీ ఖర్చులు పెరుగుతున్నందున ఉద్యోగాలు తీసేవేయక తప్పని పరిస్థితి నెలకొందన్నారాయన. ఈ 49 మందిని తీసివేయడమే కాకుండా, ఖాళీగా ఉన్న 48 పోస్టులను కాంట్రాక్టు ఉద్యోగులతో భర్తీ చేయడం లేదా అసలు ఆ ఉద్యోగాల ఖాళీలను తీసేయడం లాంటి చర్యలను చేపడుతామన్నారు. అయితే తమను ఉద్యోగాల నుండి తీసేసి ఔట్ సోర్సింగ్ ఇవ్వడం మంచిది కాదంటున్నారు ఉద్యోగులు.