మరణం అంచున ఐఎస్ఐఎస్ టాప్ కమాండర్
బీరూట్: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) కార్యకర్తల మీద జరిగిన వైమానిక దాడిలో ఓ కీలక ఉగ్రవాద నాయకుడికి తీవ్రగాయాలై ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఆ ఉగ్రవాద నాయకుడు బ్రతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని స్థానిక అధికారులు చెబుతున్నారు.
ఐఎస్ఐఎస్ లో ఇప్పటి వరకు టాప్ కమాండర్ గా ఉన్న ఒమర్ అల్ షీషానీ సిరియాలోని రఖ్కా నగరంలోని ఓ ఆసుపత్రిలో వెంటిలేటర్ మీద శ్వాస తీసుకుంటున్నాడని సిరియాలోని మానవహక్కుల పర్యవేక్షకుడు, ఆ సంస్థ ప్రధాన అధికారి రమీ అబ్దుల్ రెహమాన్ ఆదివారం స్థానిక మీడియాకు చెప్పారు.
మార్చి 4వ తేదిన అమెరికా షదాదీ నగరంలో వైమానిక దాడులు జరిపింది. అదే సమయంలో ఒమర్ అల్ షిషానీ వెలుతున్న వాహనాల కాన్వాయ్ మీద అమెరికా బలగాలు వైమానిక దాడులు చేశారు. ఈ దాడిలో ఐఎస్ఐఎస్ టాప్ కమాండర్ ఒమర్ అల్ షిషానీ భద్రతా సిబ్బంది (సెక్యూరిటీ) అందరూ మరణించారని రెహమాన్ మీడియాకు చెప్పారు.
గత కొన్ని నెలలుగా అమెరికాతో పాటు పలు దేశాలు సిరియా లోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తలదాచుకున్న స్థావరాలు, వారు ఆక్రమించుకున్న ప్రాంతాల మీద వైమానిక దాడులు చేస్తున్నాయి. ఈ దాడిలో ఇప్పటికే అనేక మంది ఉగ్రవాదులు అంతం అయ్యారు. ఇంకా వైమానిక దాడులు చేస్తామని అమెరికా ఐఎస్ఐఎస్ ను హెచ్చరించింది.