అగ్రరాజ్యాన్ని తాకిన రైతుల నిరసనలు- అమెరికా జోక్యానికి భారతీయ అమెరికన్ల ఒత్తిడి
భారత్లో కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని కోరుతూ పలు రాష్ట్రాల్లో రైతుల నిరసనలు ఉధృతంగా సాగుతున్నాయి. చట్టాలు వెనక్కి తీసుకుంటే తప్ప ఆందోళనలు విరమించుకునేది లేదని రైతులు తెగేసి చెబుతున్నారు. దీంతో రైతుల ఆందోళనలకు మద్దతు కూడా పెరుగుతోంది. దేశంతో పాటు విదేశాల్లోనూ పలువురు రాజకీయ నేతలు రైతులకు మద్దతు ప్రకటిస్తున్నారు.
ఇదే కోవలో భారత్లో రైతుల నిరసనలపై భారతీయ అమెరికన్ చట్ట సభ సభ్యులు స్పందించారు. భారతీయ అమెరికన్ ప్రమీలా జయపాల్తో పాటు ఏడుగురు చట్ట సభల సభ్యులు అమెరికా స్టేట్ సెక్రటరీ మైక్ పాంపియోకు లేఖ రాశారు. భారత్లో రైతుల ఆందోళనలపై జోక్యం చేసుకుని అక్కడి ప్రభుత్వంతో మాట్లాడాలని చట్ట సభ సభ్యులు పాంపియోను కోరారు. ముఖ్యంగా పంజాబ్లో ఉంటున్న భారతీయ అమెరికన్ల కుటుంబాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉందని వారు తెలిపారు. ఇప్పటికే కెనడాతో పాటు పలు దేశాల నేతలు రైతుల ఆందోళనలపై స్పందిస్తున్న నేపథ్యంలో ఈ లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది.
అయితే అమెరికా చట్ట సభ సభ్యుల లేఖపై భారత్ స్పందించింది. అరకొర సమాచారంతో విదేశీ రాజకీయ నేతలు స్పందించడం, భారత్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం సరికాదని తెలిపింది. భారత్ వంటి ప్రజాస్వామ్య దేశం గురించి వచ్చే ఇలాంటి కామెంట్లు మంచివి కావని విదేశీ వ్యవహారాలశాఖ తెలిపింది. దీంతో భారత్లో రైతు ఆందోళనల విషయంలో విదేశీ జోక్యాన్ని సహించబోమని తేల్చిచెప్పినట్లయింది. గతంలో కెనడా ప్రధాని ట్రూడో విషయంలోనూ భారత్ ఇదే వైఖరి స్పష్టం చేసింది.