కాబుల్ ఎయిర్పోర్ట్ వద్ద విషాదకర ఘటన: పలువురు ఆఫ్ఘన్లు దుర్మరణం
కాబుల్: ఆఫ్ఘనిస్తాన్.. తాలిబన్ల చేతుల్లోకి వెళ్లినప్పటి నుంచీ ఆ దేశ రాజధాని కాబుల్లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం రోజూ వార్తల్లో నిలుస్తోంది. తాలిబన్ల ఆటవిక, రాక్షసత్వ పరిపాలనకు భయపడి.. దేశం విడిచి వెళ్లిపోతోన్న ఆఫ్ఘనిస్తానీయులతో రోజూ క్రిక్కిరిసి పోతోంది. వేలాదిమంది కాబూలీవాలాలు ఇప్పటికీ విమానాశ్రయంలోనే గడుపుతోన్నారు. అందుబాటులో ఉన్న విమానాన్ని పట్టుకుని దేశం విడిచి వెళ్లే ప్రయత్నాలను సాగిస్తోన్నారు.

కాబుల్ ఎయిర్పోర్ట్లో విమానాల సందడి..
ప్రస్తుతం ఈ ఎయిర్పోర్ట్ అమెరికా సైనిక బలగాల ఆధీనంలో ఉంది. అందుకే- వేర్వేరు దేశాలకు చెందిన పౌరుల తరలింపు సజావుగా సాగుతోంది. భారత్ సహా వివిధ దేశాలకు చెందిన పౌర విమానాలు రాకపోకలు సాగిస్తోన్నాయి. తమ దేశ పౌరులను తరలించడంలో నిమగ్నమై ఉన్నాయి. రెండు ఎయిరిండియా విమానాల ద్వారా 150 మందికి పైగా స్వదేశానికి చేరుకున్నారు. అలాగే- సీ-17 యుద్ధ విమానాల ద్వారా కూడా భారతీయుల తరలింపు ప్రక్రియ సాగుతోంది

కాబుల్ ఎయిర్పోర్ట్ వద్ద భారీగా తొక్కిసలాట
ఇప్పటిదాకా సైనిక విమానాలు, ఎయిర్క్రాఫ్ట్ల రాకపోకలకే పరిమితమైన కాబుల్ విమానాశ్రయంలో ఇక పౌర విమాన సర్వీసులు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ పరిణామాలు విమానాశ్రయం వద్ద భారీగా తొక్కిసలాటకు దారి తీశాయి. తాలిబన్ల పరిపాలన నుంచి ఎలాగైనా బయటపడి తీరాలనే ప్రయత్నంలో వేలాదిమంది ఆప్ఘనిస్తానీయులు ఈ విమానాశ్రయానికి చేరుకుంటోన్నారు. ఫలితంగా తొక్కిసలాట నెలకొంది. తాజాగా ఈ మధ్యాహ్నం సంభవించిన తొక్కిసలాటలో ఏడుమంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు

ధృవీకరించిన బ్రిటన్..
కాబుల్ ఎయిర్పోర్ట్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకున్న విషయాన్ని బ్రిటన్ ఆర్మీ అధికారులు ధృవీకరించారు. మూడో గేట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిపారు. రెండు ప్రధాన గేట్లు మూసివేయడం వల్ల పెద్ద సంఖ్యలో ఆప్ఘనిస్తానీయులు మూడో గేట్ వద్దకు చేరుకున్నారని, ఒక్కసారిగా రన్ వే మీదికి దూసుకుని వచ్చే క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుందని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఏడుమంది వరకు మరణించారని, పలువురికి గాయాలయ్యాయని స్పష్టం చేశారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.

భారతీయుల తరలింపు ముమ్మరం..
దీనితో భారత్ కూడా రెండు ఎయిరిండియా విమానాలను ఆఫ్ఘనిస్తాన్కు పంపించింది. భారతీయుల తరలింపు కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించుకున్న ఆగస్టు 14వ తేదీ తరువాత భారత్ నుంచి కాబుల్ ఎయిర్పోర్ట్కు వెళ్లిన రెండో సివిల్ ఏవియేషన్ ఫ్లైట్ ఇదే. పౌర విమానాలు రాకపోకలు సాగించడానికి అనుమతి లభించడంతో- అల్లకల్లోలంగా మారిన కాబుల్లో చిక్కుకుపోయిన వందలాది మంది భారతీయుల తరలింపును కేంద్ర ప్రభుత్వం ఇక మరింత ముమ్మరం చేసింది.

పొరుగు దేశాలకు తరలింపు..
కాబుల్ నుంచి పక్కనే ఉన్న తజకిస్తాన్, దోహాలకు తరలిస్తోంది. అక్కడి భారత రాయబార కార్యాలయాల వద్ద వారికి ఆశ్రయాన్ని కల్పించింది. అక్కడి నుంచి వారంతా ఇతర విమానాల ద్వారా స్వదేశానికి చేరుకుంటారు. ఆప్ఘన్లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపును వేగవంతం చేయాలనే ఉద్దేశంతో- ఎయిరిండియా విమానాలు కాబుల్ నుంచి నేరుగా స్వదేశానికి చేరుకోవట్లేదు. దీనివల్ల ఏర్పడే జాప్యాన్ని నివారించడానికి పొరుగు దేశాల్లో సురక్షితంగా వారిని ల్యాండ్ చేయిస్తోంది.
Recommended Video

ఖతర్ నుంచి భారత్కు
అంతకుముందు- కాబుల్ నుంచి ప్రత్యేక ఎయిరిండియా ఫ్లైట్లో ఖతర్ రాజధాని దోహాకు చేరుకున్నారు 137 మంది భారతీయులు. వారంతా ఖతర్లోని భారత రాయబార కార్యాలయం వద్ద ఉన్నారు. వారందరినీ అక్కడి నుంచి స్వదేశానికి తీసుకొచ్చే ప్రక్రియను చేపట్టింది విదేశాంగ మంత్రిత్వ శాఖ. ఈ క్రమంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఖతర్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలను తీసుకుంది. ఎయిరిండియా విమానాలు తరలివెళ్లడానికి అవసరమైన తక్షణ ఏర్పాట్లు చేసింది.












Click it and Unblock the Notifications