"మీకెందుకు కష్టం.. నేనే వచ్చేస్తా..!" భారత్ కు బంగ్లా సర్కార్ కండిషన్ పై హసీనా..!
రెండేళ్ల క్రితం బంగ్లాదేశ్ లో విద్యార్ధుల తిరుగుబాటుతో పదవీచ్యుతురాలై, భారత్ కు వచ్చేసి ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina)ను తిరిగి తమకు అప్పగించాలని స్వదేశం నుంచి ఒత్తిడి పెరుగుతోంది. అయితే భారత ప్రభుత్వం మాత్రం దీన్ని పట్టించుకోవడం లేదు. తాజాగా బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహ్మాన్ భారత పర్యటనకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే అంతకంటే ముందే హసీనాను తమ దేశానికి అప్పగించాలని షరతు పెట్టారు. కానీ భారత్ స్పందించకపోవడంతో ఆయన తన పర్యటన రద్దు చేసుకున్నారు. దీనిపై హసీనా స్పందించారు.
బంగ్లాదేశ్ ప్రధానమంత్రి తారిఖ్ రెహమాన్ న్యూఢిల్లీ పర్యటనకు తనను అప్పగించడాన్ని ఒక షరతుగా పెట్టిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ప్రభుత్వ నిర్ణయాన్ని హసీనా ప్రశ్నించారు. తాను డిసెంబర్ నాటికి తన దేశానికి తిరిగి రావాలని భావిస్తున్నట్లు హసీనా తెలిపారు. హిందుస్థాన్ టైమ్స్కు ఇచ్చిన ఒక ప్రత్యేక టెలిఫోన్ ఇంటర్వ్యూలో ఆమె.. బంగ్లాదేశ్ కు తిరిగి వెళ్లడం తన సొంత నిర్ణయమని, తాను నిరవధికంగా బంగ్లాదేశ్ బయట ఉండాలనే ఉద్దేశంలో లేనని స్పష్టం చేశారు. భారత్లో తాను చేసిన బహిరంగ వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య సంబంధాలపై ఎందుకు ప్రభావం చూపాలని హసీనా ప్రశ్నిస్తున్నారు.

బ్రిటన్లో ఉన్నప్పుడు రెహమాన్ చేపట్టిన రాజకీయ కార్యకలాపాల గురించి కూడా హసీనా ప్రస్తావించారు. అప్పట్లో తాను బ్రిటన్ జోక్యాన్ని కోరలేదన్న విషయం ఆమె గుర్తుచేశారు. తన చుట్టూ ఉన్న రాజకీయ, న్యాయపరమైన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, తాను బంగ్లాదేశ్కు తిరిగి వెళ్లాలని కోరుకుంటున్నట్లు హసీనా చెప్పారు. డిసెంబర్ నాటికి బంగ్లాకు తిరిగి రావాలని తాను ఇప్పటికే నిర్ణయించుకున్నానని, ఖచ్చితమైన తేదీ, సమయం, ప్రవేశించే స్థలాన్ని తర్వాత ప్రకటిస్తానని ఆమె వెల్లడించారు. బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభం నిరవధికంగా కొనసాగనివ్వకూడదు కాబట్టి, తాను డిసెంబర్ నాటికి తిరిగి రావాలని భావిస్తున్నట్లు తెలిపారు.














Click it and Unblock the Notifications