"మీరే కారణం.. ఫైన్ కట్టండి"-భారత్, చైనా, అమెరికాకు నేపాల్ షాక్..!
నేపాల్ లో (Nepal) గత వారం ఆకస్మికంగా విరుచుకుపడ్డ వరదలు వేల మంది జీవితాల్ని అస్తవ్యస్తం చేశాయి. ఇందులో నేపాల్ పౌరులతో పాటు విదేశీ పౌరులు కూడా భారీ సంఖ్యలో మృత్యువాత పడ్డారు. వేల మంది గల్లంతయ్యారు. ఈ మహావిపత్తు నుంచి కోలుకోవడానికి నేపాల్ కు చాలా కాలం పట్టేలా ఉంది. అయితే వరదల నేపథ్యంలో తొలుత విదేశీ సాయాన్ని తిరస్కరించిన నేపాల్.. ఆ తర్వాత స్వీకరించక తప్పలేదు. ఇప్పుడు మరో విషయంలో అమెరికా, చైనా, భారత్ పై ఐరాసకు ఫిర్యాదు చేసేందుకు నేపాల్ సిద్దమవుతోంది.
ప్రపంచంలో గ్రీన్హౌస్ వాయువులను అత్యధికంగా విడుదల చేసే దేశాలలో ముందున్న చైనా, భారత్, అమెరికాయే తమ దేశానికి వచ్చిన ఆకస్మిక వరదలకు, ప్రాణనష్టానికి కారణమని ఆరోపిస్తున్న నేపాల్.. దీనిపై ఆయా దేశాలు తమకు పరిహారం ఇవ్వాలని కోరేందుకు సిద్దమవుతోంది. అదీ ఐక్యరాజ్యసమితి వేదికగా ఈ డిమాండ్ వినిపించేందుకు నేపాల్ ప్రధాని బాలెన్ షా సిద్దమయ్యారు. ఈ వరదలకు వాతావరణ నష్టపరిహారం చెల్లించాలని ఆయన కోరబోతున్నారు. ఈ వరదల్లో కనీసం 1,127 మంది మరణించగా, సుమారు 3,900 మంది గల్లంతయ్యారు.

తాము ఉత్పత్తి చేసిన ఉద్గారాల వల్ల కలిగే పరిణామాలను ఎదుర్కొంటున్న బలహీన దేశాలకు నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఆ మూడు దేశాలపై ఉందని నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ స్పష్టం చేశారు. తమ దేశానికి తక్షణ ఆర్థిక సహాయం కోసం నేపాల్.. ఐక్యరాజ్యసమితి మద్దతు ఉన్న 'ఫండ్ ఫర్ రెస్పాండింగ్ టు లాస్ అండ్ డామేజ్'ను లాంఛనంగా సంప్రదించింది. దీని తర్వాత ఈ విపత్తుపై తమకు వాతావరణ న్యాయం కావాలంటూ అంతర్జాతీయ వేదికలపై డిమాండ్ లేవనెత్తడానికి కూడా సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా 81వ ఐరాస సర్వసభ్య సమావేశానికి హాజరయ్యేందుకు బాలెన్ షా న్యూయార్క్ వెళ్లే అవకాశం ఉంది. సెప్టెంబర్ 8న ప్రారంభమయ్యే ఐరాస సర్వసభ్య సమావేశంలో నేపాల్ తరఫున ఖనాల్ ప్రాతినిధ్యం వహిస్తారని అంతకుముందు చెప్పినా.. మారిన పరిస్ధితుల్లో బాలెన్ షా స్వయంగా వెళ్లనున్నారు.














Click it and Unblock the Notifications