ఒళ్లు గగుర్పొడిచే దందా: చర్మం ఒలుచుకుపోతున్నారు.. అమానవీయ వాస్తవాలు!
100చదరపు అంగుళాల చర్మపు ముక్కకు లక్ష రూపాయల డిమాండ్ పలుకుతోంది. దీంతో ఏజెంట్లు దీన్ని క్యాష్ చేసుకోవడానికి నేపాలి యువతులను బలిపెడుతున్నారు. యువతుల నుంచి ఒలుచుకు వచ్చిన చర్మాన్ని చిన్న చిన్న పాథలాజికల్
ఖాట్మండు: పేదరికం మనుషులతో ఏమైనా చేయిస్తుంది. జానెడు పొట్ట కోసం శరీర భాగాలనే అమ్ముకోవాల్సిన పరిస్థితిని సైతం తీసుకొస్తుంది. పెద్దింటోళ్ల అవసరాలకు వాళ్లో కీలుబొమ్మలా వాడుకోబడుతారు. జీవితం రోగ గ్రస్తం అవుతుందని తెలిసినా.. ఆకలి కోసం, ప్రతీపూట పేదరికంపై పోరాడటం కోసం బలవంతంగానో.. నిస్సహాయ బలహీనులుగానో తమని తాము శిక్షించుకోవడానికి వారు సిద్దమవుతారు.
నేపాల్ లో పేదరికంలో మగ్గిపోతున్న చాలా కుటుంబాలది ఇదే గాథ. ముఖ్యంగా యువతుల పరిస్థితి అక్కడ మరీ తీసికట్టుగా ఉంటుంది. అయితే ఎవరికైనా పడక సుఖం అందించాలి!, లేదా కిడ్నీలు, ఇతర అవయవాలు అమ్ముకోవడం.. ఆఖరికి 'చర్మం' సైతం ఒలిచిచ్చేయడం చేయాలి. ఇదంతా వారికి తెలిసే జరుగుతుందని చెప్పడానికి కూడా లేదు. అమాయక నేపాలీ యువతులెందరో ఏజెంట్ల చేతిలో మోసపోతున్న వైనాలు ఇప్పుడక్కడ కోకొల్లలు..
చర్మానికి ఉన్న డిమాండ్:
భారత్ లో ఇటీవల కాస్మోటిక్ సర్జరీలకు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. కేవలం ముఖ ఆకృతుల కోసం మాత్రమే కాదు. పురుషాంగం, వక్షోజాల పరిమాణం పెంపు, కాలిన గాయాలకు సర్జరీ చేయడం వంటి వాటికి విపరీతమైన డిమాండ్ ఉంది.
అయితే తెల్ల చర్మంపై ఉన్న మోజుతో ఎక్కువ మంది తమ సర్జరీలకు తెల్ల తోలు మాత్రమే వాడాలని డాక్టర్లను డిమాండ్ చేస్తున్నారు. దీంతో తెల్ల చర్మానికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. డిమాండ్ ఉంది సరే.. మరి తెల్ల చర్మం ఎక్కడి నుంచి రావాలి. ఎవరివ్వాలి? అందుకే నేపాలి యువతులను బలిచేసి మరీ తెల్ల చర్మాన్ని ఒలుచుకువస్తున్నారు.
నేపాలి యువతులను బలిచేస్తూ:
పేదరికంలో మగ్గిపోయే నేపాలి యువతులను అక్కడి ఏజెంట్లు కొంతమంది బలవంతంగా వేశ్యా వృత్తిలోకి దించుతున్నారు. వాళ్లకు వేశ్యా వృత్తి కల్పించినందుకు గాను తొలి మూడు నెలలు ఫ్రీ సర్వీస్ చేయాల్సిందే. ఏజెంట్లు మాత్రం ఒక్కో విటుడి నుంచి రూ.5వేల దాకా వసూలు చేస్తారు.
ఆ మూడు నెలలు గడిచేసరికి వారి ఆరోగ్యం క్షీణించి.. శరీరమంతా గాయాలతో విపరీతమైన బాధ అనుభవిస్తుంటారు. అప్పటికీ వారికి డిమాండ్ తగ్గిపోయి.. రోజుకు రూ.200, రూ.300 సంపాదించడం కూడా గగనమైపోతుంది. ఇక్కడికొచ్చే విటుల్లో అత్యధిక మంది భారతీయులే కావడం గమనార్హం. తెల్ల తోలు కలిగిన నేపాలి యువతులంటే వీరికి మోజు.
వేశ్యా వృత్తిలో మోసం:
అమాయక నేపాలి యువతులను ఇక్కడి ఏజెంట్లు సులువుగా మోసం చేస్తున్నారు. పేరుకు వేశ్యా వృత్తే అయినా.. ఇందులో 'చర్మం' కూడా కొనసాగుతోంది. ఒక్కసారిగా విటుడితో గదిలోకి వెళ్లాక.. అతడికి అనువుగా ఉండటం కోసం బలవంతంగా వారికి డ్రగ్స్ ఇస్తారు.
ఆ తర్వాత వారు స్పృహ కోల్పోతారు. తీరా కళ్లు తెరిచి చూసేసరికి.. ఒంటిపై దుస్తులే కాదు.. ఏకంగా చర్మం సైతం మాయమైన అత్యంత దారుణమైన స్థితిలో వారుంటారు. సదరు ఏజెంట్లు వీరి చర్మాన్ని ఒలుచుకుపోయి పలు ల్యాబ్ లకు అమ్ముకుంటున్నారు.
తెల్ల చర్మాన్ని శుద్ది చేసి:
100చదరపు అంగుళాల చర్మపు ముక్కకు లక్ష రూపాయల డిమాండ్ పలుకుతోంది. దీంతో ఏజెంట్లు దీన్ని క్యాష్ చేసుకోవడానికి నేపాలి యువతులను బలిపెడుతున్నారు. యువతుల నుంచి ఒలుచుకు వచ్చిన చర్మాన్ని చిన్న చిన్న పాథలాజికల్ కు అమ్ముకుంటున్నారు.
అక్కడ చర్మం టిష్యూను శుద్ది చేసిన తర్వాత అమెరికాకు జీవ అవయవాలను సరఫరా చేసేందుకు లైసెన్స్ ఉన్న పెద్ద ల్యాబులకు వీటిని పంపిస్తారు. శుద్ది చేసిన చర్మం అల్లోడెర్మ్ లేదా సంబంధిత ఉత్పత్తులుగా తయారు చేసి తిరిగి భారత్ కు ఎగుమతి చేస్తారు.
దిక్కులేని స్థితిలో కొంతమంది నేపాలీలు:
పేదరికంలో ఏళ్లుగా మగ్గిపోతూ ఎటూ దిక్కుతోచని స్థితిలో డబ్బు కోసం స్వయంగా చర్మాన్ని ఇవ్వడానికి ముందుకొస్తున్నవారు కూడా నేపాల్ లో చాలామందే ఉన్నారు. వీరి చర్మాన్ని ఒలుచుకుపోయి.. ల్యాబుల్లో శుద్ది చేసి.. కాస్మోటిక్ సర్జరీలు చేయించుకునేవారికి వీటితో చికిత్స చేయిస్తున్నారు.
పలానా చర్మం రంగు కావాలని
కాస్మోటిక్ సర్జరీ కోసం ఆసుపత్రులను ఆశ్రయించేవారు పలానా చర్మం రంగు కావాలని అడిగితే.. వారి చర్మానికి సూటయ్యే రంగును.. నేపాలి యువతుల నుంచి సేకరిస్తారు. నేపాలి యువతుల చర్మాన్ని ఒలుచుకొచ్చి ల్యాబుల్లో దాన్ని శుద్ది చేసిన తర్వాత వీరికి ఆ చర్మాన్ని అమరుస్తున్నారు.
ఎదురు తిరిగితే చంపేస్తారు?:
వేశ్యా వృత్తిలోకి దిగేందుకు ప్రతిఘటించినా.. వాళ్లు చర్మం ఒలుచుకుపోయారని గగ్గోలు పెట్టినా.. ఏజెంట్లు వారిని చంపేయడం ఖాయమని బాధితులు చెబుతున్నారు. కేసులు పెట్టినా నిలబడవు. అందుకే ఏటా ఇలాంటివి కొన్ని వందల ఘటనలు జరుగుతున్నా.. కేవలం ఒకటి, రెండు కేసులు మాత్రమే పోలీస్ స్టేషన్స్ లో నమోదవుతున్నాయి.
సోమా బసు అనే ఓ ఫ్రీలాన్స్ జర్నలిస్టు నేపాల్ స్థితిగతుల మీద క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించి ఈ వార్తను వెలుగులోకి తీసుకొచ్చారు