ఆ ఘాతుకం తౌహీత్ జమాత్ గ్రూప్ దే: శ్రీలంక సర్కార్ నిర్ధారణ: ఎమర్జెన్సీ విధింపు
కొలంబో: గతంలో ఎప్పుడూ లేనివిధంగా శ్రీలంకలో నరమేథానికి పాల్పడిన ఘటనలో బాధ్యులను గుర్తించింది ఆ దేశ ప్రభుత్వం. ఈ ఘాతుకానికి పాల్పడినది స్వదేశీయులేనని నిర్ధారించింది. చాలాకాలంగా శ్రీలంకలో తరచూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేషనల్ తౌహీత్ జమాత్-ఎన్టీజే సంస్థ ప్రతినిధులు ఆత్మాహూతి దాడులకు కారణమని ప్రకటించింది. పేలుళ్లు చోటు చేసుకున్న ప్రాంతాల్లో లభించిన ఆనవాళ్ల ఆధారంగా శ్రీలంక ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. దీనితో పాటు పోలీసులు అదుపులోకి తీసుకున్న 24 మంది అనుమానితులను విచారించిన తరువాత- పేలుళ్లకు సంబంధించిన కొంత కీలక సమాచారాన్ని సేకరించింది.

ర్యాడికల్ భావాలు..గౌతముడి విగ్రహాల విధ్వంసం ఆరోపణలు
నేషనల్ తౌహీత్ జమాత్ సంస్థ చాలాకాలంగా శ్రీలంకలో కొనసాగుతోంది. ర్యాడికల్ భావాలు ఉన్న కొన్ని ఇస్లామిక్ గ్రూప్ సంస్థలు దీన్ని ఏర్పాటు చేశాయి. శ్రీలంక వ్యాప్తంగా గౌతమ బుద్ధుడి విగ్రహాలను ధ్వంసం చేసిందనే ఆరోపణలను ఈ సంస్థ ఎదుర్కొంటోంది. గౌతముడి విగ్రహాల పేల్చివేతల వెనుక తౌహీత్ జమాత్ హస్తం ఉన్నట్లు తేలడంతో.. అప్పట్లో ఈ సంస్థకు చెందిన కొందరు ప్రతినిధులను పోలీసులు అరెస్టు కూడా చేశారు. అదే సంస్థ తాజాగా- శ్రీలంకలో ఎనిమిది చోట్ల మారణహోమాన్ని సృష్టించినట్లు తేలింది. ఈ సంస్థకు చెందిన కొందరు అతివాద భావాలు ఉన్న యువకులు.. ఆత్మాహూతి దాడికి పాల్పడి ఉండొచ్చంటూ ఆదివారం నాడే అనుమానాలు వెలువడిన విషయం తెలిసిందే.

అంతర్జాతీయ ఉగ్రవాద లింకులపై ఆరా..
ఈ విషయాన్ని ఆ దేశ వైద్య శాఖ మంత్రి రజిత సేనరత్నే ప్రకటించారు. సోమవారం ఆయన కొలంబోలో విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. నేషనల్ తౌహీత్ జమాత్ సంస్థ ఆత్మాహూతి పేలుళ్లకు బాధ్యత వహించాలని అన్నారు. ఆ సంస్థ ప్రతినిధులకు విదేశీ ఉగ్రవాదులతో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఉన్నాయా? లేవా? అనేది ఇంకా తేలాల్సి ఉందని చెప్పారు. ఈ కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని సేనరత్నె అన్నారు. విదేశీ ఉగ్రవాదులతో నేషనల్ తౌహీత్ జమాత్ తో సంబంధాలు ఉన్నాయనే తాము భావిస్తున్నామని చెప్పారు. పేలుళ్లు అనంతరం దేశవ్యాప్తంగా 24 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, విచారణ సందర్భంగా వారి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలిపారు. కాగా, నేషనల్ తౌహీత్ జమాత్ దీన్ని ఖండించింది. తామెలాంటి ఆత్మాహూతి దాడులకు పాల్పడలేదని వెల్లడించింది. ఈ దాడులతో తమకు సంబంధం లేదని పేర్కొంది.

ఏప్రిల్ 4వ తేదీ నాడే సమాచారం..
రాజధాని కొలంబో సహా దేశంలోని కొన్ని కీలక ప్రాంతాల్లో క్రైస్తవ ప్రార్థనా స్థలాలు, పర్యాటక కేంద్రాలపై పెద్ద ఎత్తున దాడులు చోటు చేసుకునే అవకాశం ఉందంటూ ఓ విదేశీ ఇంటెలిజెన్స్ సంస్థ నుంచి తమకు అధికారికంగా సమాచారం అందిందని సేనరత్నె తెలిపారు. ఈ నెల 9వ తేదీన ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశామని, అనుమానితుల పేర్లను కూడా వెల్లడించామని చెప్పారు. ఈ విషయంపై చర్చించడానికి జాతీయ భద్రతా కమిటీ గత ఆదివారం సమావేశం కావాల్సి ఉన్నప్పటికీ.. దీనికి ఛైర్మన్ గా ఉన్న ప్రధానమంత్రి విదేశీ పర్యటనలో ఉన్నందున సాధ్య పడలేదని అన్నారు. ముందస్తు హెచ్చరికలు ఉన్నప్పటికీ.. ఆత్మాహూతి దళ దాడులను నిరోధించలేకపోయామని, దీనిపై తాము దేశ ప్రజలను క్షమాపణ కోరుతున్నామని అన్నారు. భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందు వల్ల పోలీసు అత్యున్నత అధికారి పుజిత్ జయసుందరను రాజీనామా చేయాలని ఆదేశించినట్లు చెప్పారు.

పోలీసుల వైఫల్యం..
శ్రీలంక ముస్లిం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మంత్రి రవూఫ్ హకీమ్ మాట్లాడుతూ.. పోలీసులకు ఈ నెల 9వ తేదీ నాడే ప్రభుత్వం తరఫున కొంతమంది అనుమానితుల పేర్లతో కూడిన పక్కా సమాచారం ఇచ్చామని అయినప్పటికీ.. పోలీసు వ్యవస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని చెప్పారు. శ్రీలంకలో ఉన్న రెండు ప్రధాన ముస్లిం గ్రూపు సంస్థలు ఆల్ సిలోన్ జామియాత్ ఉల్ ఉల్మా, నేషనల్ షోరా కౌన్సిల్ ప్రతినిధులు ఈస్టర్ సండే నాటి బాంబు పేలుళ్లను ఖండించాయి. ఇందులో తమ ప్రమేయం లేదని ప్రకటించాయి. ప్రభుత్వ దర్యాప్తునకు తాము పూర్తిగా సహకరిస్తామని పేర్కొన్నాయి.

ఎమర్జెన్సీ విధింపు..
ఇదిలావుండగా- శ్రీలంకలో పేలుళ్లు చోటు చేసుకుని 24 గంటలు గడిచినప్పటికీ.. సాధారణ పరిస్థితులు నెలకొనలేదు. పరిస్థితులు అదుపు తప్పే సూచనలు కనిపిస్తున్నాయి. ఆదివారం విధించిన కర్ఫ్యూ సోమవారం తెల్లవారు జామున 6 గంటలకు సడలించారు. కొలంబో సహా పలుచోట్ల ఉద్రిక్త వాతావరణం కనిపించడంతో అత్యవసర పరిస్థితి విధించారు. దేశంలో నెలకొన్న తాజా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అత్యవసర పరిస్థితిని విధించినట్లు శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తెలిపారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications