నైజీరియాలో 54 మంది మృతి: బొలివియాలో 8 మంది
యోలా: నైజీరియాలో వేరువేరు దుర్ఘటనలలో 54 మంది మృతి చెందారు. తూర్పు నైజీరియాలోని సెయింట్ డోమ్నిక్ క్యాథలిక్ చర్చిలో శనివారం తొక్కిసలాట జరిగింది. ఇందులో ఇరవై నాలుగు మంది వరకు మృతి చెందారు. ఈ విషయాన్ని స్థానిక అధికారులు వెల్లడించారు.
మరోవైపు ఓ పెళ్లి వేడుకపై ఇస్లామిక్ మిలిటెంట్లు కాల్పులు జరిపారు. దీంతో వరుడు సహా 30 మంది మృతి చెందారు. ఈ ఘటన నార్త్ వెస్ట్ నైజీరియా ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనలో పలువురు మృతి చెందినట్లుగా మిలిటరీ అధికార ప్రతినిధి కల్నల్ మహమ్మద్ డోల్ చెప్పారు. బోర్నో రాష్ట్రంలోని గామా - గోజా నగర మధ్యన తీవ్రవాదులు దాడి చేసి చంపినట్లు చెప్పారు.
బోకో హారమ్ తీవ్రవాదులు ఈ దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఫిర్గి గ్రామం సమీపంలో పలు మృతదేహాలు పడి ఉన్నట్లు ఓ మినీ బస్ టాక్సీ డ్రైవర్ ఆదివారం తెలిపాడు.
బొలీవియాలో విమానం కూలి 8 మంది మృతి
బొలీవియాలో విమానం కూలిన ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. రెబెరెల్లాలోని అమెజాన్ సిటీ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అవుతుండగా ప్రమాదం జరిగింది. తొమ్మిది మంది గాయపడ్డారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో విమానంలో ముప్పై మంది వరకు ఉన్నారు.