కాందహార్ కూడా తాలిబన్ల వశం: ఏంబసీని ఖాళీ చేయిస్తోన్న అమెరికా, బ్రిటన్
కాబుల్: ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు విజృంభిస్తోన్నారు. కొద్దిరోజులుగా ఒక్కొక్క నగరాన్నీ తమ వశం చేసుకుంటూ వస్తోన్న తాలిబన్లు.. మరింత రెచ్చిపోతోన్నారు. ఆఫ్ఘనిస్తాన్పై పట్టు పెంచుకుంటోన్నారు. ఇప్పటిదాకా తొమ్మిది ప్రావిన్స్లకు చెందిన రాజధానులను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు.. మరిన్ని నగరాలపై జెండా ఎగురవేశారు. దేశ రాజధాని కాబుల్ను చుట్టుముట్టారు. దాన్ని కూడా తమ నియంత్రణలోకి తెచ్చుకోవడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చంటూ వార్తలు వెలువడుతోన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ ఉత్తరం, పశ్చిమ ప్రాంతాల్లోని ప్రావిన్సులపై పట్టు పెంచుకున్న తాలిబన్లు తాజాగా కాందహార్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందే- హెరాత్ సిటీనీ దక్కించుకున్నారు.
ఇంగ్లాండ్లో దారుణం: పార్కులో వాకర్లపై..: పరిస్థితి అదుపులో ఉందన్న హోం మంత్రి ప్రీతి పటేల్
అడ్డుకోలేకపోతోన్న ప్రభుత్వ బలగాలు..
ఉత్తరం, పశ్చిమ ప్రాంతాల్లో దాదాపు అన్ని ప్రావిన్సుల్లో తాలిబన్లు తమ జెండాను పాతేశారు. ఆ ప్రావిన్సుల రాజధానులన్నీ తమ వశమైనట్లు ప్రకటించుకున్నారు. అక్కడ సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇదివరకు 10 ప్రావిన్సుల్లో తాలిబన్ల పాలన ఆరంభమైంది. అఫ్గానిస్తాన్ ఉత్తర ప్రాంతంలోని ఫైజాబాద్, పుల్-ఐ-ఖుమ్రీ, పశ్చిమ ప్రాంతంలోని ఫరా నగరాలు తాలబన్ల సొంతం అయ్యాయి. ప్రభుత్వ ప్రతినిధులు, ఉద్యోగులందరినీ అక్కడి నుంచి తరిమి కొట్టారు. ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ సొంతం చేసుకున్నారు. ఫైజాబాద్, పుల్-ఐ-ఖుమ్రీ, కుందుజ్, సార్-ఐ-పుల్, తలోకాన్ పట్టణాలు తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లాయి.
కాందహార్, హెరాత్ కూడా..
కాందహార్.. ఆఫ్ఘనిస్తాన్లోని రెండో అతి పెద్ద నగరం. రాజధాని తరువాత ఆ స్థాయిలో జనాభా ఉన్న సిటీ. కాందహార్ పేరు వింటే.. భారతీయులకు మొట్టమొదటగా గుర్తుకొచ్చేది.. ఎయిరిండియా విమానం హైజాక్ ఉదంతమే. 1999 డిసెంబర్ 24వ తేదీన నేపాల్ రాజధాని ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఈ విమానాన్ని అయిదుమంది ఉగ్రవాదులు హైజాక్ చేసి, కాందహార్కు తరలించిన విషయం తెలిసిందే. 176 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బందితోకూడిన ఎయిరిండియా విమానం హైజాక్ ఉదంతం.. ఎప్పటికీ మరిచిపోలేని చేదు జ్ఞాపకం. ఈ నగరంపైనా తాలిబన్లు పట్టు సాధించారు.
తాలిబన్లకు హోమ్ టౌన్
ఒకరకంగా కాందహార్ను తాలిబన్లకు హోమ్టౌన్గా అభివర్ణిస్తుంటారు. అఫ్గానిస్తాన్లో ఇస్లామిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే వారి వేర్పాటు ధోరణికి కేంద్రబిందువు ఆ నగరమే. అక్కడి నుంచే వారు తిరుగుబాటును మొదలుపెట్టారనేది విశ్లేషకుల అభిప్రాయం. సుదీర్ఘకాలం తరువాత కాందహార్ను తాలిబన్లు వశం చేసుకోవడం అక్కడి పరిస్థితులను మరింత ఉద్రిక్తంగా.. ఆందోళనకరంగా మార్చివేసింది. అరాచకత్వానికి మారుపేరుగా చెప్పుకొనే తాలిబన్లు కాందహార్ నగరాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడాన్ని.. వారు సాధించిన విజయానికి సూచిగా భావిస్తోన్నారు.
Recommended Video
కాబుల్ చుట్టూ..
భౌగోలికంగా, వ్యూహాత్మకంగా ఆఫ్ఘనిస్తాన్లో అత్యంత కీలకమైన నగరం.. కాందహార్. రెండో అతి పెద్ద నగరం ఇది. రాజధాని కాబూల్కు సమాంతరంగా అక్కడ పాలన సాగుతుంటుంది. విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయి. దేశంలో ఏ ప్రాంతానికి రాకపోకలు సాగించాలనుకున్నా కాందహార్ మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. దీన్ని సొంతం చేసుకోవడం తాము సాధించిన భారీ విజయంగా తాలిబన్లు ప్రకటించుకున్నారు. ఇక తమకు అడ్డు లేదని, తమ పరిపాలన ఆరంభం కావడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తమ దృష్టి అంతా కాబుల్పై ఉందని పేర్కొన్నారు.
ఘజ్నీ, హెరాత్ సిటీస్ సైతం..
ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఘజ్నీ హెరాత్ నగరాలు కూడా తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లిపోయాయి. ఒక్కో నగరంపైనా పట్టు కోల్పోతూ వస్తోన్నాయి ఆప్గానిస్తాన్ బలగాలు. ఉత్తరం, పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో ఉన్న ప్రావిన్సుల్లో మెజారిటీ పట్టణాల్లో తాలిబన్లు పాగా వేశారు. ఆప్గానిస్తాన్ ఆగ్నేయ దిశగా ఉన్న ప్రావిన్సుల్లో మాత్రమే వారు ప్రవేశించాల్సి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వారు ఆ రీజియన్ను కూడా ఆక్రమించుకోవడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు. ఈ పరిస్థితులను ముందే గ్రహించడం వల్ల అక్కడి ప్రభుత్వం.. తాలిబన్లతో సంధి కుదుర్చుకునే ప్రయత్నంలో ఉంది.
అమెరికా ఏంబసీ ఖాళీ..
ఆఫ్గానిస్తాన్లో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పడటంతో అమెరికా ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంటోంది. రాజధాని కాబుల్లోని తన రాయబార కార్యాలయాన్ని ఖాళీ చేయిస్తోంది. రాయబార కార్యాలయంలో పనిచేసే అధికారులు, ఉద్యోగులు, వారి కుటుంబాలను సురక్షితంగా స్వదేశానికి తరలించడానికి సన్నాహాలు పూర్తి చేసింది. వచ్చే 48 గంటల్లో మూడు ఇన్ఫాంట్రీ బెటాలియన్లను కాబుల్కు పంపిస్తతామని తెలిపింది. ఒక్కో ఇన్ఫాంట్రీ బెటాలియన్లో వెయ్యిమంది సైనిక బలగాలు ఉంటాయి. రాయబార కార్యాలయ అధికారులు, ఉద్యోగుల తరలింపు ప్రక్రియను రెండు రోజుల్లో పూర్తి చేస్తామని అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ ప్రెస్ సెక్రెటరీ జాన్ కిర్బీ తెలిపారు.
కువైట్, ఖతర్లల్లో మకాం..
ఆప్గానిస్తాన్ నుంచి వెనక్కి మళ్లుతోన్న తమ దేశ పౌరులకు తక్షణమే స్పెషల్ ఇమ్మిగ్రంట్ విసాలను మంజూరు చేయడానికి ఏకంగా వెయ్యి మందిని అదనంగా అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు జాన్ కిర్బీ తెలిపారు. వారంతా ఖతర్ను కేంద్రబిందువుగా చేసుకుని తమ కార్యకలాపాలను సాగిస్తారని చెప్పారు. అదే సమయంలో- మరో 3,500 మంది సైనికులను కువైట్లో మోహరింపజేస్తామని, ఆఫ్గానిస్తాన్లో నెలకొనే పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో ఎలాంటి సహకారాన్ని అందజేయాలనుకున్నా.. కువైట్ నుంచే పంపిస్తామని స్పష్టం చేశారు.
అదే బాటలో బ్రిటన్..
అమెరికా బాటలోనే బ్రిటన్ కూడా నడుస్తోంది. ఆప్గానిస్తాన్లో క్రమంగా తాలిబన్ల రాజ్యం ఏర్పాటయ్యే పరిస్థితులు నెలకొనడంతో బ్రిటన్ ప్రభుత్వం.. అక్కడ నివసిస్తోన్న తమ దేశ పౌరులందరినీ వెనక్కి రప్పించే ప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం 600 ట్రూప్స్ను ఆప్గానిస్తాన్కు పంపించనున్నట్లు ఆ దేశ రక్షణ శాఖ మంత్రి బెన్ వాలెస్ తెలిపారు. ఇప్పటికే ఈ చర్యలను తీసుకున్నామని తెలిపారు. అక్కడ నివసిస్తోన్న బ్రిటన్ పౌరులందరూ తక్షణమే వెనక్కి వచ్చేయాలని, దీనికోసం రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. రాయబార కార్యాలయం ఎన్నో రోజుల పాటు అక్కడ కార్యకలాపాలు సాగించలేదనే సంకేతాన్ని పంపించారు బెన్ వాలెస్.