సర్కార్ ఏర్పాటుకు తాలిబన్లు రెడీ-రష్యా, చైనా, పాకిస్తాన్ కు ఆహ్వానం-భారత్ కు మాత్రం
ఆప్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వం స్ధానంలో అధికారాన్ని హస్తగతం చేసుకున్న తాలిబన్లు కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా కొత్త టీమ్ కు తుది మెరుగులు దిద్దుతున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రష్యా, చైనా, పాకిస్తాన్ లను ఆహ్వానించారు. దీంతో పాటే ఆప్ఘన్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరే వేళ చేపట్టాల్సిన చర్యలపై దృష్టిసారిస్తున్నారు. దీంతో ఆప్ఘన్ లో రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోనుంది.
ఆప్ఘన్ పై పూర్తి పట్టు సాధించిన తాలిబన్లు
నిన్న మొన్నటివరకూ ఆప్ఘన్ లోని అన్ని రాష్ట్రాల్ని ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకున్న తాలిబన్లు పంజ్ షీర్ లోయలో మాత్రం తిరుగుబాటుదారులతో హోరాహోరీ పోరు సాగించారు. ఇప్పుడు అది కూడా చేజిక్కడంతో పంజ్ షీర్ గవర్నర్ కార్యాలయంపై తమ జెండా ఎగురవేశారు. అంతే కాదు తిరుగుబాటు దారుల ప్రధాన నేత అయిన ఫహీమ్ దాష్టీతో పాటు మరికొందరు కీలక నేతల్ని మట్టుబెట్టారు. ఈ పోరులో తమ ఫైటర్లు భారీగా ప్రాణాలు కోల్పోయినా లెక్క చేయకుండా పంజ్ షీర్ పై దూకుడుగా ముందుకెళ్లి అనుకున్న ఫలితం సాధించారు.
ప్రభుత్వ ఏర్పాటుకు సర్వం సిద్ధం
పంజ్ షీర్ లోయ కైసవం తర్వాత ఆప్ఘనిస్తాన్ ను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు ఇప్పుడు అక్కడ కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టిసారించారు. ఇందులో భాగంగా ప్రభుత్వంలో ఎవరెవరు ఉండాలనే దానిపై తుది కసరత్తు చేస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమాన్ని కూడా తాలిబన్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గతంలో ఉగ్రవాదులతో సంబంధాలున్న ఓ గ్రూపుగా మాత్రమే అంతర్జాతీయస్ధాయిలో గుర్తింపు తెచ్చుకున్న తాలిబన్లు.. ఇప్పుడు మాత్రం దానికి భిన్నంగా ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. అందుకే గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న అబ్దుల్లా అబ్దుల్లా, హమీద్ కర్జాయ్ వంటి నేతల్ని సైతం పక్కనబెట్టేశారు.
ఈ దేశాలకే ఆహ్వానం
తాలిబన్లు తమ కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం సిద్ధమవుతున్న నేపథ్యంలో తమకు ఇప్పటివరకూ అండగా నిలుస్తున్న దేశాలకు మాత్రమే ప్రమాణ స్వీకారానికి ఆహ్వానాలు పంపారు. ఇందులో పాకిస్తాన్, టర్కీ, ఖతార్, రష్యా, చైనా, ఇరాన్ వంటి దేశాలు ఉన్నాయి. వీరితో పాటు మరికొన్ని దేశాల ప్రభుత్వ పెద్దల్ని కూడా ఆహ్వానించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే భారత్ కు మాత్రం ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందలేదు. దీంతో భారత్ తో సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు చెప్పుకుంటుూన్న తాలిబన్లు.. కీలక కార్యక్రమానికి భారత్ ను ఆహ్వానించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
యుద్ధం ముగిసింది ఇక పునర్నిర్మాణమే...
ఆప్ఘనిస్తాన్ లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న తాలిబన్లు కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ .. ఆఫ్ఘన్ లో యుద్ధం ముగిసిందన్నారు. ఇక ఆప్ఘన్ లో స్ధిరమైన ప్రభుత్వం ఏర్పాటవుతుందన్నారు. ఇకపై అక్కడ ఆయుధాలు పట్టుకునే వారంతా ప్రజలకు, ప్రభుత్వానికి వ్యతిరేకమన్నారు. దేశాన్ని ఆక్రమించిన వారు ఆప్ఘనిస్తాన్ ను ఎప్పటికీ పునర్ నిర్మించలేరన్నారు. దేశ పునర్ నిర్మాణ బాధ్యత ఇక్కడి ప్రజలదేనన్నారు. రాజధానిలోని కాబూల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు పునరుద్ధరణ కోసం ఖతార్, టర్కీ, సౌదీ నుంచి సాంకేతిక నిపుణుల బృందాలు కూడా వస్తున్నట్లు తాలిబన్లు ప్రకటించారు.