Afghanistan : ఆఫ్గనిస్తాన్లో రేపే తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసే ఛాన్స్...
ఆఫ్గనిస్తాన్లో ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు సిద్దమవుతున్నారు. శుక్రవారం(సెప్టెంబర్ 3) తాలిబన్ల ప్రభుత్వం కొలువుదీరే అవకాశం ఉంది. మధ్యాహ్నం ప్రార్థనల తర్వాత ఆ మేరకు ప్రకటన చేయవచ్చునని తెలుస్తోంది. నిజానికి ప్రభుత్వ ఏర్పాటుపై గురువారమే ప్రకటన ఉండొచ్చునని భావించినప్పటికీ... ఇప్పటికైతే అదేమీ జరగలేదు. తాలిబన్ 2.0 కేబినెట్ ఎలా ఉంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ ఏడాది ఆగస్టు 14న ఆఫ్గనిస్తాన్ను తాలిబన్లు పూర్తిగా ఆక్రమించిన సంగతి తెలిసిందే. స్వల్ప వ్యవధిలోనే దేశం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోగలిగారు. తాలిబన్లతో పోరాడలేక సైన్యం చేతులెత్తేయడంతో వారి పని మరింత సులువైంది. ప్రస్తుతం ప్రభుత్వ ఏర్పాటుపై ఫోకస్ చేసిన తాలిబన్లు... పాలనకు సంబంధించి ఎటువంటి పాలసీలు రూపొందించబోతున్నారనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా స్త్రీల హక్కులపై మొదటి నుంచి ఆందోళన వ్యక్తమవుతూనే ఉంది. స్త్రీలకు విద్య,ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెబుతూనే... వారిని ప్రభుత్వ,ప్రైవేట్ కార్యాలయాల నుంచి ఇంటికి పంపించిన ఘటనలు చోటు చేసుకున్నాయి.
1996-2001 వరకు సాగిన తాలిబన్ల పాలనలో స్త్రీలకు హక్కులే లేకుండా పోయాయి. వారికి విద్య,ఉద్యోగాలపై తాలిబన్లు నిషేధం విధించారు. ఇంటి గడప దాటాలంటే మగ తోడు ఉండాల్సిందేనని... అది కూడా కుటుంబ సభ్యులే అయి ఉండాలని ఆంక్షలు పెట్టారు. బలవంతంగా వారికి తాలిబన్ ఫైటర్లతో పెళ్లిళ్లు జరిపించేవారు. స్త్రీ అంటే కేవలం సంతానం కోసమే అనే భావన వారిలో నాటుకుపోయింది. 2001లో తాలిబన్ల పాలన ముగిశాక 2002 నుంచి ఇప్పటివరకూ మిలియన్ల సంఖ్యలో మహిళలు చదువు బాట పట్టారు. తిరిగి సాధారణ జీవితంలోకి వచ్చారు. రాజకీయాల్లోనూ రాణించారు. కానీ ఇప్పుడు దేశం మళ్లీ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడంతో వారి భవిష్యత్ అంధకారంలోకి నెట్టినట్లయింది. అంతర్జాతీయ సమాజం ఆఫ్గనిస్తాన్లో స్త్రీల హక్కులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.
తమకు ఎవరితోనూ శత్రుత్వం లేదని,ఎవరిపై కక్ష సాధింపు చర్యలు ఉండవని ప్రకటించినప్పటికీ... గత ప్రభుత్వానికి సహకరించిన సిబ్బంది,జర్నలిస్టులు,సామాజిక కార్యకర్తలు,సైనికుల కోసం తాలిబన్లు ఇంటింటికీ తిరుగుతూ గాలిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత తమను ప్రపంచ దేశాలు గుర్తించాలని మరోసారి తాలిబన్లు ప్రకటించే అవకాశం ఉంది. అయితే తాలిబన్లతో సంబంధాలకు లేదా వారి ప్రభుత్వాన్ని గుర్తించేందకు ఎవరూ ముందుకొచ్చే పరిస్థితి లేదు. ఇరాన్,రష్యా,పాకిస్తాన్,చైనా దేశాలు మాత్రం ఇప్పటికే తాలిబన్లకు మద్దతు ప్రకటించాయి.
ఇక ఇప్పటివరకూ తాము జయించని పంజ్షీర్ను ఎలాగైనా తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు తాలిబన్లు ఆ ప్రావిన్స్పై దండెత్తుతున్నారు. ఇటీవలే అక్కడ అడుగుపెట్టిన తాలిబన్లను మసౌద్ నాయకత్వంలోని పంజ్షీర్ దళం గట్టిగా ప్రతిఘటించింది. ఈ దాడిలో దాదాపు 350 మంది తాలిబన్లు హతమైనట్లుగా వార్తలు వచ్చాయి. ప్రస్తుతం అక్కడ ఇరు వర్గాల మధ్య పోరు జరుగుతూనే ఉంది. అయితే ఇది ఎంతకాలం కొనసాగుతుందనే దానిపై స్పష్టత లేదు. సుదీర్ఘ కాలం పోరాటం చేయాల్సి వస్తే పంజ్షీర్ తాలిబన్లను నిలువరించగలదా అనే ప్రశ్న తలెత్తుతోంది.