భారత్ సాయానికి తాలిబన్ల ఓకే-దౌత్య వేత్తలకూ ఆమోదం-అంతర్జాతీయ గుర్తింపు కోసమేనా ?
భారత ఉపఖండంలో వ్యూహాత్మక ప్రాంతమైన ఆప్ఘనిస్తాన్ లో గతంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టిన భారత్.. ఇప్పుడు వాటిని కాపాడుకోవడంతో పాటు భవిష్యత్తులో అక్కడ పాలకులైన తాలిబన్ల నుంచి ఎలాంటి ముప్పు లేకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. దీంతో ఆప్ఘన్ కు భారీ ఎత్తున మానవతా సాయం అందిస్తామని, అలాగే దౌత్య సంబంధాల పునరుద్ధరణకు దౌత్య వేత్తల్ని కూడా నియమించేందుకు సిద్ధమవుతోంది. ఈ పరిణామాల్ని తాలిబన్లు కూడా స్వాగతిస్తున్నారు.

ఆప్ఘన్ లో భారత్ వ్యూహాలు
ఆప్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వం పాలన సాగుతున్న క్రమంలో భారత్ అక్కడ భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టింది. రహదారులు, ఇతర మౌలిక సౌకర్యాలను కల్పించింది. ఏకంగా పార్లమెంటు భవనాన్నే కట్టిచ్చింది. అయితే అమెరికా తీసుకున్న బలగాల ఉపసంహరణ నిర్ణయంతో ప్రజా ప్రభుత్వం స్ధానంలో తాలిబన్ల పాలన మొదలైంది. దీంతో తమకు శత్రువులైన తాలిబన్ల రాకపై భారత్ మౌనంగా ఉండిపోయింది. చివరికి తీవ్ర తర్జన భర్జనల తర్వాత తాలిబన్లతో చర్చలు ప్రారంభించింది. ఇందులో సానుకూల స్పందన వ్యక్తం కావడంతో ఆప్ఘన్ కు మరోసారి భారీ ఎత్తున మానవతా సాయం అందించేందుకు సిద్ధమని ప్రకటించింది. తద్వారా భవిష్యత్తులో ఆప్ఘన్ పై పట్టు కొనసాగించేందుకు ప్రయత్నిస్తోంది.

అంతర్జాతీయ గుర్తింపు కోసం తాలిబన్ల పాట్లు
ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని హస్తగతం అయితే చేసుకున్నారు కానీ అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకోవడం ఇప్పుడు తాలిబన్లకు కష్టసాధ్యంగా మారుతోంది. ముఖ్యంగా తమకు అండగా ఉంటారని భావించిన ఇస్లామిక్ దేశాలు సైతం మొహం చాటేస్తుండటంతో తాలిబన్లకు ఏమీ పాలుపోవడం లేదు. కేవలం పాకిస్తాన్ అండతో అంతర్జాతీయ గుర్తింపు దక్కుతుందని భావించే పరిస్ధితి లేదు. దీంతో భారత్ సహా గతంలో శత్రువులుగా భావించిన పలు దేశాల సాయం కోసం ఇప్పుడు తాలిబన్లు ఎదురుచూస్తున్నారు.

భారత్ మానవతా సాయం ఆఫర్
ఆప్ఘనిస్తాన్ లో తమ పట్టు కొనసాగించాలని భావిస్తున్న భారత్.. ఇప్పుడు తాలిబన్ల సర్కార్ కు భారీ ఎత్తున మానవతా సాయం అందించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఓ భారీ గోధుమల షిప్ మెంట్ ను పంపింది. ఐరాస సాయంతో మరింత సాయం అందించేందుకు సిద్ధమవుతోంది. ఆప్ఘన్ ప్రజలు ఆకలిదప్పులతో బాధపడుతున్నారన్న వార్తల నేపథ్యంలో భవిష్యత్తులో వారికి అందించే సాయంపై భారత్ చర్చలు జరుపుతోంది. వీలైనన్ని మార్గాల్లో ఐరాస సాయంతో ఆప్ఘన్ కు సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్రం సంకేతాలు పంపుతోంది.

భారత్ ఆఫర్ అంగీకరించిన తాలిబన్లు
భారత్ ఆఫర్ చేస్తున్న మానవతా సాయం తీసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తాలిబన్లు తాజాగా ప్రకటించారు. ఐరాసలో తాలిబన్ల అధికార ప్రతినిధిగా ఉన్న సుహైల్ షహీన్ ఈ మేరకు ప్రకటన చేశారు. మానవతా సాయంతో పాటు దౌత్య వేత్తల్ని పంపినా అంగీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. మాస్కో ఫార్మాట్ చర్చల తర్వాత భారత్ ఆఫర్ చేసిన సాయం తీసుకోవడంతో పాటు వారి దౌత్యవేత్తల్ని పంపినా ఆహ్వానించేందుకు తాలిబన్ల సర్కార్ సిద్ధమవుతోంది. దీంతో భారత్ కూడా తాజా పరిణామాలపై సంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఆప్ఘన్ కు మానవతా సాయాన్ని వాఘా-అట్టారీ సరిహద్దుల ద్వారా భూమార్గంలోనే పంపేందుకు భారత్ సిద్ధమవుతోంది. వచ్చే నెలలో జరిగే జాతీయ భద్రతా దారుల సమావేశంలో దీనిపై ప్రకటన చేయబోతోంది. ఈ శీతకాలంలో ఆప్ఘన్ లో ఆకలి కేకల్ని నివారించేందుకు వీలైనంత సాయం చేయబోతున్నట్లు కేంద్రం చెబుతోంది.












Click it and Unblock the Notifications