మీతో చర్చలా, ఎవరు అడిగారు?: చైనాకు భారత్ దిమ్మతిరిగే షాక్
రిహద్దుల్లో ఉద్రిక్తత నేపథ్యంలో తాము మాట్లాడే ప్రసక్తే లేదని చెప్పిన చైనాకు భారత్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది.
ఢిల్లీ: సరిహద్దుల్లో ఉద్రిక్తత నేపథ్యంలో తాము మాట్లాడే ప్రసక్తే లేదని చెప్పిన చైనాకు భారత్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. జీ 20 సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో చర్చల జరపబోరని ఘాటైన జవాబిచ్చింది.
చదవండి: రెచ్చిపోతున్న చైనా: పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీదుగా.., ఇది ప్లాన్!
అసలు తాము జీ జిన్పింగ్తో చర్చలు జరిపేందుకు అవకాశమివ్వాలని ఎప్పుడు అడిగామని, అడగలేదు కదా అని నిలదీసింది. ఇజ్రాయెల్ పర్యటనలోని ప్రధాని మోడీ బృందంలోని ఓ అధికారి ఈ కౌంటర్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
భారత్, చైనా మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిపేందుకు అనువైన వాతావరణం ప్రస్తుతం లేదని ఆ దేశం చెబుతోందని, అలా అనడానికి అసలు సమావేశం ఏర్పాటు చేయమని తాము అడగలేదని చెప్పారు.
అసలు మిమ్మల్ని ఎవరడిగారు?
జర్మనీలోని హాంబర్గ్లో శుక్రవారం నుంచి జీ 20 సదస్సు జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలోనే జీ20 సదస్సులో మోడీ, జిన్పింగ్ల మధ్య ద్వైపాక్షిక చర్చలు లేనట్లే.. చర్చలు జరిపేందుకు ప్రస్తుతం అనువైన వాతావరణం లేదు అంటూ చైనా వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా తోసిపుచ్చింది. అసలు ద్వైపాక్షిక సమావేశం కావాలని ఎవరు అడిగారని ప్రశ్నించింది.
చైనాకు ధీటుగా భారత్
ప్రస్తుతం భారత్, చైనా మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. ఈ రెండు దేశాల మధ్య ప్రస్తుతం సిక్కిం సరిహద్దు విషయంలో ప్రతిష్ఠంభన నెలకొన్న విషయం తెలిసిందే. ప్రస్తుత ఉద్రిక్తతకు భారత సైన్యం చొరబాటే కారణమని, వెంటనే సరిహద్దు నుంచి సైన్యం వెనక్కి వెళ్లకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చైనా హెచ్చరిస్తుంది. చైనా హెచ్చరికలకు భారత్ దీటుగా సమాధానాలిస్తోంది. డోక్లామ్ నుంచి సైన్యం వెనక్కి తగ్గేదే లేదని భారత్ చెబుతోంది.
చైనా సైనిక విన్యాసాలు
కాగా, సిక్కిం సెక్టార్లో భారత్ - చైనా మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. చైనా సైన్యం టిబెట్లో యుద్ధ వాతావరణం సృష్టిస్తోంది. టిబెట్ రాజధాని లాసా నుంచి జిన్ హువా న్యస్ ఏజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం చైనా సైన్యం కొత్త ఆయుధాలను, తేలికపాటి యుద్ధ ట్యాంకును పరీక్షించినట్లు సమాచారం. సముద్ర మట్టానికి 5,100 మీటర్ల ఎత్తులో ఈ విన్యాసాలు నిర్వహించినట్లు సమాచారం.
ముందస్తు దాడిపై శిక్షణలు అంటూ..
చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న జిన్ హువా కథనం ప్రకారం ఈ విన్యాసాల్లో భాగంగా కొత్త ఆయుధాలను ప్రయోగించి చూడటంతో పాటు కాల్పులు కూడా జరిపినట్లు సమాచారం. ఆయుధాల ప్రయోగానికి సంబంధించిన వివిధ దశలను విజయవంతంగా పరిశీలించారని తెలుస్తోంది. శత్రువులపై రక్షణాత్మకంగాను, ముందస్తుగాను దాడి చేయడంలో శిక్షణ కార్యక్రమాలు కూడా జరిగాయని కథనం.