బయటపడ్డ రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు...వేల మంది ప్రజలు ఖాళీ
రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అదే స్థాయిలో చాలామంది నిరాశ్రయులయ్యారు. ఆనాటి చేదు జ్ఞాపకాలు ఇప్పటికీ కొన్ని వస్తువుల రూపంలో బయటపడుతున్నాయి. తాజాగా జర్మనీలో పేలని ఓ బాంబు బయట పడింది. దీంతో అక్కడి 18,500 మంది స్థానికులు లుడ్విగ్షాఫెన్ నగరాన్ని ఖాళీ చేశారు. మొత్తం 500 కిలోల బరువున్న ఈ బాంబు జర్మనీపై అమెరికా తమ యుద్ధ విమానాల నుంచి కిందకు జార విడచారు. అయితే ఈ బాంబు ఆ సమయంలో పేలలేదు.
ఈ వారంలో ఓ భవనం నిర్మాణం కోసం భూమిని తవ్వుతుండగా... ఈ భారీ బాంబు బయటపడింది. ఈ వార్త క్షణాల్లో నగరమంతా గుప్పుమంది. దీంతో నగరవాసులు ఆ నగరాన్ని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. అయితే బాంబును డిఫ్యూజ్ చేసినట్లు బాంబు సిబ్బంది ప్రకటించారు. దీంతో ఖాళీ చేసి వెళ్లిపోయిన నగరవాసులు తిరిగి తమ నివాసాలకు చేరారు. ఇదే విషయాన్ని తెలుపుతూ ట్విటర్లో ఫోటోను పోస్టు చేసింది సిబ్బంది. ఆ బాంబును ఒక చెక్కపై ఉంచి దాన్ని తాళ్లతో కట్టేశారు. ఆ తర్వాత జాగ్రత్తగా బాంబును నిర్వీర్యం చేశారు.

బాంబు దొరికిన ప్రదేశానికి ఒక కిలోమీటర్ పరిసరాల్లో నివసిస్తున్న ప్రజలు ఖాళీ చేయాలని అధికారులు ప్రకటించడంతో 18వేల మంది ప్రజలు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిపోయారు. అనంతరం బాంబు సిబ్బంది ఒక గంటపాటు శ్రమించి బాంబును నిర్వీర్యం చేశారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసి ఇప్పటికీ 70 ఏళ్లు పూర్తికావొస్తోంది. అయినప్పటికీ అప్పుడప్పుడు ఆనాటి యుద్ధం సమయంలో కొన్ని పేలని బాంబులు బయటపడుతుండటం ఆ దేశ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.

ఇప్పటి వరకు ఫ్రాంక్ఫర్ట్లో రెండవ ప్రపంచయుద్ధం సమయంలో పేలని బాంబు ఒకటి దొరకడంతో ఆ నగరం నుంచి అత్యధికంగా 60వేల మంది ప్రజలు ఖాళీ చేయించారు. ఇప్పటి వరకు ఇంత పెద్ద స్థాయిలో ప్రజలను ఖాళీ చేయించడం ఇదే ప్రథమం. అప్పుడు బయటపడిన బాంబు 1.8 టన్నుల బరువుతో ఉన్నింది. దానిపేరు బ్లాక్బస్టర్గా నామకరణం చేశారు.దీన్ని బాంబు సిబ్బంది నిర్వీర్యం చేశారు. ఏప్రిల్లో బెర్లిన్ సెంట్రల్ రైల్వే స్టేషన్లో కూడా బ్రిటీషు వారు విసిరిన బాంబు ఒకటి బయటపడింది. కొన్ని పేలని బాంబులు అక్కడక్కడ మట్టిలోకి కూరుకుపోయి ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇవే అప్పుడుప్పుడు పేలి భారీ అగ్ని ప్రమాదాలకు దారి తీస్తున్నాయి.












Click it and Unblock the Notifications