తాలిబన్ ఎంట్రీతో భారత్ కు కష్ట నష్టాలివే-వేల కోట్ల పెట్టుబడి వృథా-తీవ్రవాద ముప్పు
ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్ల దురాక్రమణ ఉపఖండంలో ప్రధాన దేశమైన భారత్ కు ముప్పుగా పరిణమించబోతోంది. ముఖ్యంగా రెండు దశాబ్దాలుగా భారీ ఎత్తున అక్కడ పెట్టుబడులు పెట్టిన భారత్.. ఇప్పుడు తాలిబన్ల రాకతో వాటిని కోల్పోవాల్సిన పరిస్ధితి దాపురించబోతోంది. అదే సమయంలో పాకిస్తాన్ తో కలిసి సాగనున్న తాలిబన్లతో భారత్ కు తీవ్రవాద ముప్పు కూడా పెరగనుంది. ఈ నేపథ్యంలో ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్ల పాలనను గుర్తించబోమంటూ భారత్ చేస్తున్న హెచ్చరికలు భవిష్యత్ ముప్పుకు సూచికలుగా భావించవచ్చు.
Recommended Video
భారత్, ఆఫ్ఘన్ బంధం
రెండు దశాబ్దాల క్రితం తాలిబన్ల చెర నుంచి విముక్తి పొంది ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న ఆప్ఘనిస్తాన్ తో భారత్ కు సత్సంబంధాలు మొదలయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆప్ఘనిస్తాన్ ను ఉపఖండంలో తమ మిత్రదేశంగానే భారత్ భావిస్తూ వచ్చింది. కానీ తాజాగా మారిన పరిస్దితుల్లో ఆప్ఘనిస్తాన్ ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి తాలిబన్లు ఆక్రమించుకోవడంతో పరిస్ధితులు తారుమారు అవుతున్నాయి. భారత్ కు నమ్మకమైన మిత్రుడైన ఆప్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఏకంగా దేశం విడిచి పారిపోవడంతో ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలోని ప్రభుత్వాన్ని నమ్మి భారత్ వేసిన అడుగులు వృథా అయ్యేలా ఉన్నాయి.
ఆప్ఘన్ లో భారత్ పెట్టుబడులు
రెండు దశాబ్దాల క్రితం తీవ్రవాద దేశమన్న కారణంతో అక్కడ దాడులు జరిపి దేశాన్ని ఆక్రమించి తమ చెప్పుచేతల్లో ఉండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న అమెరికా సహా పాశ్చాత్య దేశాలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఆప్ఘన్ ప్రజా ప్రభుత్వానికి సాయం చేయడంతో పాటు తమ మాట వినేలా చూసుకున్నాయి. అయితే వీరితో పాటు భారత్ కూడా ఆప్ఘన్ పై ఎన్నడూ లేనంత స్ధాయిలో అభిమానం పెంచుకోవడం మొదలైంది. ఆప్ఘన్ లో వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టడం ద్వారా ఉపఖండంలో తమకు ముప్పుగా ఉన్న చైనా, పాకిస్తాన్ లకు చెక్ పెట్టాలనేది భారత్ వ్యూహం. దీంతో ఆప్ఘనిస్తాన్ కు కొత్త పార్లమెంటు భవనం కట్టించడంతో పాటు మరెన్నో పెట్టుబడులు పెట్టింది. ఇవన్నీ భారత్ వ్యూహత్మక పెట్టుబడులుగానే ఉన్నాయి.
ఆప్ఘన్ పార్లమెంట్ కట్టించిన భారత్
ఆప్ఘనిస్తాన్ లో రెండు దశాబ్దాల క్రితం ఉన్న పార్లమెంటు భవనాన్ని తాలిబన్లు బాంబులతో పేల్చేయడంతో అక్కడ ప్రజా ప్రభుత్వం కొలువుదీరేందుకు వీల్లేకుండా పోయింది. దీంతో జోక్యం చేసుకున్న భారత్.. ఆప్ఘనిస్తాన్ కు 90 మిలియన్ డాలర్లు ఖర్చుపెట్టి 2015లో కొత్త పార్లమెంటు భవనాన్ని కట్టించి ఇచ్చారు. దీన్ని భారత్ ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా ప్రారంభించారు. భారత్ కు నమ్మకమైన మిత్రదేశమైన ఆప్ఘనిస్తాన్ కు మన దేశం ఇస్తున్న బహుమతిగా దీన్ని అప్పట్లో మోడీ అభివర్ణించారు. కానీ ఇప్పుడు అదే పార్లమెంటు భవనంలో పాగా వేసిన తాలిబన్లు.. తుపాకులతో వీరంగం చేస్తున్నారు.
ఆప్ఘన్ పునర్నిర్మాణం కోసం
ఆప్ఘనిస్తాన్లో 2001లో ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అక్కడ పరిస్ధితి దారుణంగా ఉంది. వాహనాలు వెళ్లేందుకు మంచి రోడ్లు లేవు. విద్యాసంస్ధలు లేవు. ప్రభుత్వ పాలనకు అవసరమైన భవనాలు లేవు. దీంతో భారత్ దాదాపు 300 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టి అక్కడ మౌలిక సదుపాయాల కల్పనకు చాలా కృషి చేసింది. దాదాపు 400 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను భారత్ ఆప్ఘనిస్తాన్ లో నిర్మించి ఇచ్చింది. వివిధ రాష్ట్రాల్లో రోడ్లు, రవాణా సౌకర్యాలు, వంతెనలకు భారత్ పెట్టిన ఖర్చు ఎంతో ఉంది. ఇవన్నీ ఆప్ఘన్ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించాయి. కానీ ఆప్ఘన్ లో బలమైన సైన్యం తయారుకాకపోవడంతో తాలిబన్ల ధాటికి ఎదురునిలవలేకపోయింది.
భారత్-ఆప్ఘన్ వాణిజ్య బంధం
ఆప్ఘనిస్తాన్ పునర్నిర్మాణం ప్రారంభమైన తర్వాత భారత్ తో దౌత్య సంబంధాలతో పాటు వాణిజ్య సంబంధాలు కూడా చిగురించడం మొదలుపెట్టాయి. ఇరుదేశాల్లో పరస్పర వాణిజ్య సహకారంతో పాటు పన్నులు, సుంకాల మినహాయింపులు ఇవ్వడం పెరిగింది. దీంతో ఆప్ఘనిస్తాన్ భారీగా లబ్ది పొందింది. అలాగే భారత్ కు వాణిజ్యం పెరిగింది. ఇరుదేశాల మధ్య తాజాగా వాణిజ్యం ఏడాదిగి బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో ఇరుదేశాలు వాణిజ్యపరంగానూ మంచి మిత్రులయ్యాయి. ఈ బంధం సజావుగా కొనసాగుతున్న తరుణంలో తాలిబన్లు ఎంట్రీ ఇచ్చారు.
తాలిబన్ల రాకతో భారత్ పెట్టుబడులు వృథా
ఆప్ఘనిస్తాన్ ను తాజాగా తాలిబన్లు ఆక్రమించడంతో గతంలో భారత్ పెట్టిన వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వృథాగా మారబోతున్నాయి. పార్లమెంటు భవనంతో పాటు ఇతర ఇన్ ఫ్రా ప్రాజెక్టులు వారి చేతుల్లోకి వెళ్లబోతున్నాయి. వాటిని వాడుకుంటూ తాలిబన్లు భారత్ పై గురి పెట్టబోతున్నారు. ఈ ప్రాజెక్టులు ఎన్ని ఉంటాయో, ఎన్ని నాశనం అవుతాయో తెలియని పరిస్ధితి. తాలిబన్ల పాలనను భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం, అదే సమయంలో పాకిస్తాన్ వారికి బలంగా మద్దతు ఇస్తున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టుల్ని పాకిస్తాన్ వాడుకున్నా ఆశ్చర్యం లేదు.
పెరగనున్న తీవ్రవాద ముప్పు
ఆఫ్ఘన్ లో తాలిబన్ల పాలన రావడంతో ఇప్పుడు అక్కడ గుమికూడేందుకు పలు తీవ్రవాద సంస్ధలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. కశ్మీర్ లో తీవ్రవాదాన్ని ఎగదోస్తున్న పలు తీవ్రవాద గ్రూపులు ఇప్పటి వరకూ పాకిస్తాన్ సహకారంతో పనిచేస్తుండగా.. ఇకపై తాలిబన్లు కూడా వారిని వాడుకునే ప్రమాదం పొంచి ఉంది. దీంతో సహజంగానే భారత్ కు తీవ్రవాద దాడుల ముప్పు పెరగబోతోంది. తాలిబన్ల పేరెత్తితేనే మండిపడుతున్న భారత్ కు కంట్లో నలుసుగా మారేందుకు పాకిస్తాన్ చేసే ప్రయత్నాలకు కూడా వీరు సహకారం అందించడం ఖాయంగా కనిపిస్తోంది. అప్పుడు ఓవైపు ఆప్ఘన్ తాలిబన్లు, మరోవైపు పాకిస్తాైన్ తీవ్రవాద గ్రూపులు భారత్ ను లక్ష్యంగా చేసుకోవచ్చని నిఘా హెచ్చరికలు వెలువడుతున్నాయి.