చైనా టార్గెట్గా ట్రంప్ ఎత్తుగడలు- బిడెన్కు ఇబ్బందులు సృష్టించేందుకేనంటున్న విశ్లేషకులు
హోరాహోరీగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన గత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శ్వేతసౌధాన్ని మాత్రం అంత త్వరగా వీడే సూచనలు కనిపించడం లేదు. అదే సమయంలో ఆయన వైట్ హౌస్ వీడక ముందే తన ప్రత్యర్ధి చైనాను మరింత కెలకడం ద్వారా కాబోయే దేశాధ్యక్షుడు జో బిడెన్కు సమస్యలు సృష్టించే అవకాశాలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన నాటి నుంచే చైనాను టార్గెట్ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్.. అమెరికా ప్రస్తుత దుస్ధితికి చైనాయే కారణమంటూ ఎన్నికల్లో సైతం తీవ్రంగా ప్రచారం చేశారు. అయినా ఫలితం వ్యతిరేకంగా వచ్చింది. అయినా చైనాను మాత్రం తుది వరకూ టార్గెట్ చేయాలని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం చైనాకు వ్యతిరేకంగా సత్వర ఆదేశాలు ఇవ్వడంతో పాటు పాలనా విధానాల్లో మార్పులను ప్రస్తావించబోతున్నారు. సెనేట్ అనుమతి అవసరం లేని నియామకాలు సైతం చేయడం ద్వారా బీజింగ్ను మరింత ఇరుకున పెట్టాలని ట్రంప్ భావిస్తున్నారు.
చైనాకు వ్యతిరేకంగా ట్రంప్ కొన్ని తీవ్రమైన చర్యలు తీసుకునే అవకాశాలూ లేకపోలేదంటున్నారు. వీటిలో పలువురు కమ్యూనిస్టు పార్టీ కీలక నేతలకు వీసాల నిషేధం, బీజింగ్లో 2022లో జరిగే వింటర్ ఒలింపిక్స్లో అమెరికా క్రీడాకారులు పాల్గొనకుండా ఆంక్షలు విధించే అవకాశాలు కూడా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. చైనాపై పలు వాణిజ్యపరమైన ఆంక్షలు విధించడంతో పాటు ఇరుదేశాలూ వాడుకునే కొన్ని మిలటరీ పరికరాల ఎగుమతి, దిగుమతులపైనా నిషేధం విధిస్తారని తెలుస్తోంది. వీటి వల్ల కాబోయే అధ్యక్షుడు జో బిడెన్కూ, చైనాకూ మధ్య మరింత గ్యాప్ పెరగవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.