హడలెత్తిస్తున్న కొరియా: స్వేచ్ఛగా ఖండాంతర క్షిపణి: ఇది శక్తిమంతమైందేనన్న అమెరికా
పాంగ్యాంగ్: ఉత్తర కొరియా మరోసారి ఖండాంతర క్షిపణి 'హాసంగ్-14'ను ప్రయోగించింది. ఇది గతంలో జరిగిన వాటికంటే అత్యంత శక్తిమంతమైనదని నిపుణులు తేల్చారు. అత్యంత ఎత్తులో, ఎక్కువ దూరాన్ని ఈ క్షిపణి చేరుకున్నట్లు నిర్ధారణకు వచ్చారు. దాదాపు రెండు నెలల విరామం తర్వాత మళ్లీ ఉత్తర కొరియా క్షిపణిని పరీక్షించింది.
తాజా క్షిపణి పరీక్ష అమెరికాను హడలెత్తించింది. ఎందుకంటే ఆ క్షిపణి వెళ్లిన తీరు ఉత్తర కొరియా సత్తాను మరింత స్పష్టం చేసింది. జపాన్ జలాల్లో పడిన హోసంగ్ అత్యంత శక్తిమంతమైనదని స్వయంగా అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్ వెల్లడించారు.
కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తత
అమెరికా ఆంక్షలు విధించినా.. ఉత్తరకొరియా తన వైఖరి మార్చుకోలేదు. ఉత్తరకొరియా ‘హాసంగ్ 14' క్షిపణిని ప్రయోగించడంతో మళ్లీ కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తర కొరియా గత సెప్టెంబర్లో చివరిసారి ఖండాంతర క్షిపణిని పరీక్షించింది. తాజాగా జరిపిన క్షిపణి పరీక్ష మూడో ఖండాంతర క్షిపణి పరీక్ష ఇది. అదే నెలలో ఆ దేశం ఆరో అణు పరీక్షను కూడా నిర్వహించింది. అంతర్జాతీయంగా ఒత్తిళ్లు పెరుగుతున్నా, ఉత్తర కొరియా మాత్రం యథేచ్ఛగా అణు, క్షిపణి పరీక్షలతో అందర్నీ హడలెత్తిస్తున్నది.
బాధ్యతాయుతమైన దేశమని ఉత్తరకొరియా మీడియా ప్రకటన
‘హసంగ్ - 14' క్షిపణి సుమారు 4,500 కిలోమీటర్ల ఎత్తులో, దాదాపు 960 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు అంచనా వేస్తున్నారు. ఈ విషయాన్ని అమెరికా, దక్షిణ కొరియా ధ్రువీకరించాయి. పూర్తిగా అణ్వస్త్రశక్తి గల దేశంగా ఎదగాలన్న తమ చిరకాల వాంఛ నెరవేరిందని ఉత్తర కొరియా ప్రకటించింది. అమెరికా ప్రధాన భూబాగాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేయగల సామర్థ్యం తమకు లభించిందని ప్రకటించింది. హోసంగ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించామని ఈ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ పేర్కొన్నారు. తమ దేశం అణ్వాయుధ సామర్థ్యంగల బాధ్యతాయుతమైన దేశమని పేర్కొన్నారు
శాంతియుత ప్రయోజనాలకే పరిమితమని ఉత్తర కొరియా మీడియా
అమెరికా సామ్రాజ్యవాదుల అణ్వాయుధ బెదిరింపులు, బ్లాక్మెయిలింగ్ నుంచి కాపాడుకోవడానికే వ్యూహాత్మక ఆయుధాలను అభివృద్ధిపరచినట్లు ఉన్ తెలిపారు. క్షిపణి పరీక్షపై వార్తలు వెలువడుతున్నప్పుడు ఉత్తరకొరియా ప్రజలు భారీగా టీవీ స్క్రీన్ల వద్ద హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. క్షిపణి పరీక్ష విజయవంతమైన నేపథ్యంలో ఉత్తరకొరియా అధికారిక మీడియా వైఖరిలో సైతం మార్పు కనిపించింది. డీపీఆర్కే (డెమొక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా) ప్రయోజనాలకు విఘాతం కలిగించనంతవరకు మా ఆయుధాలు ఏ దేశానికీ ఎటువంటి ముప్పును కలిగించవు అని ఆ దేశ మీడియా ప్రకటించింది.
జపాన్ ప్రధాని అబె, దక్షిణ కొరియా అధ్యక్షుడితో ట్రంప్ సంప్రదింపులు
ఉత్తరకొరియా క్షిపణి పరీక్షపై అమెరికా డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ మేం చూసుకుంటాం. ఈ పరిస్థితిని మేము అదుపు చేయగలం అని అన్నారు. ఉత్తరకొరియా విషయమై భద్రతామండలి అత్యవసరంగా సమావేశం అవుతున్నట్టు తెలియడంతో మరిన్ని వివరాలు వెల్లడించేందుకు ట్రంప్ నిరాకరించారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన జపాన్ ప్రధాని షింజో అబే, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్తో ఫోన్లో మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడికైనా చేరుకోగల క్షిపణులను ఉత్తరకొరియా అభివృద్ధి చేస్తున్నదని అమెరికా రక్షణమంత్రి జేమ్స్ మాటిస్ అన్నారు. దక్షిణకొరియా కూడా బుధవారం సముద్ర జలాల్లో క్షిపణులను పరీక్షించిందని చెప్పారు. ఉత్తరకొరియా తన వైఖరివి మార్చుకునేవరకు ఆ దేశంపై ఆర్థిక, దౌత్యపరమైన ఒత్తిడిని కొనసాగిస్తామని అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ స్పష్టం చేశారు.
ఉత్తర కొరియాది రెచ్చగొట్టే చర్య అన్న రష్యా
ఉత్తర కొరియా తాజా చర్యను అమెరికాతోపాటు ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, జపాన్, చైనా, రష్యా తీవ్రంగా వ్యతిరేకించాయి. తాజా క్షిపణి ప్రయోజనం అంతర్జాతీయ శాంతికి విఘాతమని స్పష్టం చేశాయి. ఐరాస భద్రతా మండలి తీర్మానాలకు అనుగుణంగా ఉత్తర కొరియా నడుచుకోవాలని చైనా స్పష్టం చేసింది. హాసంగ్ క్షిపణి ప్రయోగం కచ్చితంగా రెచ్చగొట్టే చర్యగా రష్యా అభివర్ణించింది. ఈ విషయంలోనూ అన్ని పక్షాలూ సంయమనం పాటించాలని సూచించింది.