లాక్ డౌన్ రూల్స్ ఉల్లంఘన - బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సస్, మంత్రి రిషి సునక్ కు జరిమానా
మన దేశంలో లాక్ డౌన్ సమయంలో రూల్స్ ఉల్లంఘించి జనం, రాజకీయ నేతలు ఏ స్ధాయిలో రోడ్ల మీద తిరిగారో, నిబంధనలు ఉల్లంఘించారో చూశాం కదా. కానీ అదే విదేశాల్లో అయితే ఎలా ఉంటుందో తెలిపే ఘటన ఒకటి బ్రిటన్ లో చోటు చేసుకుంది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సస్ తో పాటు ఆర్ధికమంత్రి రిషి సునక్ లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘన వివాదంలో చిక్కుకున్నారు.
లాక్ డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సస్ తో పాటు ఆర్ధికమంత్రి రిషి సునక్ కు త్వరలో అధికారులు పెనాల్టీ నోటీసులు పంపబోతున్నారు.. లాక్ డౌన్ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా పార్టీల్లో పాల్గొన్నందుకు వీరిద్దరికీ జరిమానా కట్టాలని నోటీసులు పంపనున్నారు.. దీంతో ఈ వ్యవహారం విపక్షాలకు ఆయుధంగా మారింది. లాక్ డౌన్ విధించిన ప్రభుత్వాధినేత నిబంధనలు ఉల్లంఘించడమేంటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అంతే కాదు ప్రధానితో పాటు ఆర్ధికమంత్రి కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
బ్రిటీష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్, ఆయన ఆర్థిక మంత్రి రిషి సునక్ కఠినమైన కరోనావైరస్ లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు జరిమానాలు పొందబోతున్నారని ప్రభుత్వం ప్రకటించింది. డౌనింగ్ స్ట్రీట్, క్యాబినెట్ ఆఫీస్ వద్ద జరిగిన 12 పార్టీలపై పోలీసులు దర్యాప్తు జరిపారు. అంతర్గత విచారణలో జాన్సన్ సిబ్బంది మద్యంతో కూడిన పార్టీలను ఆస్వాదించారని తేలింది. బ్రిటిష్ అధినేత స్వయంగా కొన్ని కార్యక్రమాలకు హాజరయ్యారని కూడా తేలింది. ప్రధాన మంత్రి, ఖజానా ఛాన్సలర్ (ఆర్ధికమంత్రి) మెట్రోపాలిటన్ పోలీసులు వారికి స్టాండర్డ్ పెనాల్టీ నోటీసులను జారీ చేయాలని భావిస్తున్నట్లు నోటిఫికేషన్ అందుకున్నట్లు ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు.