యూరప్లోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రంపై రష్యా బాంబుల వర్షం: చెర్నోబిల్ తరహా డిజాస్టర్
కీవ్: రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతోన్న భీకర యుద్ధం.. ఎనిమిదో రోజుకు చేరుకుంది. రష్యన్ సైనిక బలగాలు తమ దాడులు విస్తృతం చేశాయి. దాదాపు అన్ని నగరాలపైనా విరుచుకుని పడుతున్నాయి. రాజధాని కీవ్ను స్వాధీనం చేసుకునే విషయంలో ఉక్రెయిన్ సైన్యం నుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంటోన్నప్పటకీ- మిగిలిన నగరాల్లో అలాంటి పరిస్థితి దాదాపుగా కనిపించట్లేదు. ప్రత్యేకించి తూర్పు ప్రాంతంలోని పలు నగరాలపై రష్యన్ ఆర్మీ దాడులు దూకుడును కొనసాగిస్తోంది. రాకెట్ల మోత మోగిస్తోంది.
పలు నగరాలపై ఆధిపత్యం..
ఇప్పటికే ఖేర్సన్, మెలిటొపొల్ నగరాలు రష్యా సైనికుల ఆధీనంలోకి వెళ్లాయి. ఖార్కీవ్లో అదే పరిస్థితి నెలకొంది. ఛెర్నిహివ్, మరియోపొల్ నగరాలను రష్యన్ సైనిక బలగాలు చుట్టుముట్టాయి. ఏ క్షణమైనా ఛెర్నిహివ్.. రష్యా వశం కావచ్చంటూ వార్తలు వస్తోన్నాయి. పోర్ట్ సిటీ ఒడెస్సా, బిలా సెర్క్వా, వొలిన్ ఒబ్లాస్ట్పై రష్యా వైమానిక బలగాలు బాంబుల వర్షాన్ని కురిపిస్తోన్నాయి. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలంటూ ఆయా నగరాల మేయర్లు ఆదేశాలను జారీ చేశారు.
న్యూక్లియర్ సిటీపై..
రాజధాని కీవ్తో పాటు ఆయా నగరాలను కాపాడుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి ఉక్రెయిన్ సైనిక దళాలు. దీనికోసం తీవ్రంగా పోరాడుతున్నాయి. సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. రష్యా బలగాల దూకుడును అడ్డుకుంటోన్నాయి. ఈ రెండు దేశాల సైన్యం మధ్య భీకర యుద్ధం సాగుతోంది. ఇక తాజాగా- ఎనెర్హొడార్ సిటీపై రష్యా బలగాలు దృష్టి సారించాయి. ఉక్రెయిన్ వాయవ్య ప్రాంతంలో ఉంటుందీ నగరం. జనాభా తక్కువే.. అయినప్పటికీ ఇక్కడి అణు విద్యుత్ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి.
యూరప్లోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం..
ఉక్రెయిన్.. యూరప్ దేశాల సహకారంతో నిర్మించుకున్న అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం ఉండేది ఇక్కడే. ఎనెర్హొడార్ సిటీలోని జఫరోజ్ఝియా ప్రాంతంలో దీన్ని నిర్మించుకుంది. యూరప్లోనే అతిపెద్ద న్యూక్లియర్ పవర్ స్టేషన్ ఇది. ఈ అణు విద్యుత్ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి రష్యన్ వైమానిక బలగాలు. రాకెట్లను సంధిస్తోన్నాయి. ఈ దాడుల్లో ఈ విద్యుత్ కేంద్రం దెబ్బతిన్నదని ఉక్రెయిన్ ప్రభుత్వం నిర్ధారించింది. అందులో నుంచి పొగలు వెలువడుతున్నాయని స్పష్టం చేసింది.
చెర్నోబిల్ కంటే 10 రెట్లు..
రష్యా దాడులు ఇలాగే కొనసాగితే- అది పేలిపోవడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేసింది. అదే జరిగితే- విధ్వంసం తప్పదని పేర్కొంది. చెర్నోబిల్ కంటే 10 రెట్లు అధికంగా విధ్వంసాన్ని ప్రపంచం చవి చూస్తుందని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ మంత్రి దిమిత్రి కులేబా హెచ్చరించారు. చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రం మిగిల్చిన విధ్వంసాన్ని ప్రపంచం ఇంకా విస్మరించలేదని, అలాంటి సంఘటనే పునరావృతం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
దాడులను నిలిపివేయాలంటూ
రష్యా తక్షణమే ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్పై దాడులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. జఫరోజ్ఝియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్పై రష్యా వైమానిక బలగాలు దాడులు చేస్తోన్నాయని ధృవీకరించారు. ఇప్పటికే అందులో నుంచి పొగలు వెలువడుతున్నాయని పేర్కొన్నారు. అది పేలిపోతే- విధ్వంసకర పరిస్థితులు ఏర్పడతాయని, రష్యా తన దాడులను వెంటనే నిలిపివేయాలని అన్నారు.












Click it and Unblock the Notifications