రష్యా విశ్వరూపం - ఉక్రెయిన్ అధ్యక్ష భవనం నేలమట్టం: సుదీర్ఘ యుద్ధం తుదిదశకు?
వాషింగ్టన్: రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలల తరబడి కొనసాగుతున్న యుద్ధంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ఫిబ్రవరి 24వ తేదీన ఆరంభమైన యుద్ధం అనూహ్య మలుపు తీసుకుంది..చివరిదశకు చేరుకున్నట్టే కనిపిస్తోంది. ఇవ్వాళ రష్యా అనూహ్యంగా ఉక్రెయిన్పై విరుచుకుపడింది. తన సైనిక విశ్వరూపాన్ని ప్రదర్శించింది. ఒక్కసారిగా బాంబుల మోత మోగించింది. రాజధాని కీవ్లో విధ్వంసాన్ని సృష్టించింది రష్యా.
గాలి జనార్ధన్ రెడ్డికి షాకిచ్చిన సుప్రీంకోర్టు - హైదరాబాద్ సీబీఐ కోర్టుకు కీలక ఆదేశాలు
తూర్పు ధ్వంసం..
ఇన్ని రోజులుగా సాగుతున్న ఈ యుద్ధం వల్ల ఇప్పటికే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పలు నగరాలు నేలమట్టం అయ్యాయి. వాటిని రష్యా సైనిక బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. మరియోపోల్, మెలిటొపోల్, క్రిమియా, డాన్బాస్, డొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, సుమి, ఒడెస్సా, చెర్న్హీవ్, ఖార్కీవ్.. వంటి నగరాలను రష్యా సైనిక బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. డొనెట్స్క్, లుహాన్స్క్ ఝపరొజ్ఝియా, ఖేర్సన్ రీజియన్లను రష్యా విలీనం చేసుకోవడానికి రెఫరెండం సైతం నిర్వహించింది.
కీవ్ను ఆక్రమించుకునే దిశగా..
ఉక్రెయిన్ తూర్పున ఉన్న మెజారిటీ నగరాలను రష్యా ఆక్రమించుకున్నప్పటికీ- రాజధాని కీవ్ను మాత్రం చేరుకోలేకపోయింది. కీవ్ రక్షణ వలయాన్ని రష్యా సైన్యం ఛేదించలేకపోయింది. పైగా చాలా సందర్భాల్లో వెనకంజ వేసింది కూడా. అమెరికా, యూరోపియన్ యూనియన్, నాటో సభ్య దేశాలు అందించిన ఆయుధ సంపత్తితో ఇన్ని రోజుల పాటు రష్యా దాడులను సమర్థవంతంగా తిప్పి కొడుతూ వచ్చింది ఉక్రెయిన్.
భారీ పేలుళ్లు..
ఇప్పుడా రక్షణ వ్యవస్థను రష్యా సైన్యం ఛేదించినట్టే కనిపిస్తోంది. మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది. భారీ ఎత్తున దాడులు సాగిస్తోంది. ఈ ఉదయం నుంచి సెంట్రల్ కీవ్లో పెద్ద ఎత్తున పేలుళ్లు సంభవించాయి. పలు భవనాలు ధ్వంసం అయ్యాయి. పేలుళ్లు సంభవించిన విషయాన్ని కీవ్ మేయర్ విటాలి క్లిట్స్కోవ్ ధృవీకరించారు. ఉదయం 8:30 గంటలకు తొలి పేలుడు శబ్దం వినిపించిందని, ఆ తరువాత తీవ్రం అయ్యాయని పేర్కొన్నారు.
కీవ్లో ఎటు చూసినా..
కీవ్లో ఎటు చూసినా విధ్వంసకర పరిస్థితులే కనిపిస్తోన్నాయి. రష్యా వైమానిక దళం చేపట్టిన క్షిపణి దాడుల్లో అనేక భవనాలు నేలమట్టం అయ్యాయి. ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ రాకెట్ దూసుకొస్తుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడి ప్రజలు బిక్కు బిక్కుమంటు గడుపుతున్నారు. బంకర్లలో తలదాచుకుంటోన్నారు. దట్టమైన పొగ ఈ నగరం అంతా కమ్ముకుంది. ఈ ఉదయం నుంచి సగటున ప్రతి 15 నిమిషాలకోసారి పేలుడు శబ్దాలు వినిపిస్తోన్నట్లు అక్కడి మీడియా తెలిపింది.
జెలెన్స్కీ భవనం ధ్వంసం..
రష్యా జరుపుతోన్న ఈ మిస్సైళ్లు, రాకెట్ల దాడుల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ భవనం సైతం నేలమట్టమైంది. బాంకోవ, స్ట్రీట్ నంబర్ 11లో ఉంటుందీ భవనం. దీన్ని లక్ష్యంగా చేసుకుని రష్యా వైమానిక బలగాలు మిస్సైళ్లను సంధించాయి. ఆ భవనం పూర్తిగా ధ్వంసమైంది. జెలెన్స్కీ కార్యాలయం ఉన్నది ఈ భవన సముదాయంలోనే. ఈ దాడి సమయంలో ఆయన తన కార్యాలయంలో లేరు. అధికారిక నివాసంలో ఉన్నారు.
అమాయక ప్రజలు
ఈ ఘటన తరువాత కొద్దిసేపటికే జెలెన్స్కీ ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. తాను క్షేమంగా ఉన్నట్లు వెల్లడించారు. రష్యా జరుపుతున్న ఈ దాడుల్లో పలువురు ప్రజలు ప్రాణాలను కోల్పోయారని, అంతకు రెట్టింపు స్థాయిలో గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రష్యా తాజాగా చేస్తోన్న దాడులన్నీ అనైతికమేనంటూ మండిపడ్డారు. ఓడిపోతామనే భయంతో సాధారణ ప్రజలపై వైమానిక దాడులు సాగిస్తోందని ఆరోపించారు.