ప్రధాని మోడీ విమానంకు అనుమతి ఎందుకు నిరాకరించారు: పాక్ను ప్రశ్నించిన యూఎన్ సంస్థ
ఐక్యరాజ్యసమితి: తమ గగనతలంలో భారత ప్రధాని మోడీ విమానం ఎగిరేందుకు అనుమతి ఎందుకు ఇవ్వలేదని పాకిస్తాన్ను ప్రశ్నించింది ఐక్యరాజ్య సమితి పరిధిలో పనిచేసే అంతర్జాతీయ పౌరవిమానాయాన సంస్థ ( ICAO). సోమవారం రోజున మోడీ ప్రయాణించే ఎయిరిండియా వన్కు తమ గగనతలంలో ఎగిరేందుకు అనుమతి ఇవ్వాలని పాక్ ప్రభుత్వాన్ని భారత్ కోరగా అందుకు అనుమతి నిరాకరించింది. దీంతో విమానం మరో ప్రత్యామ్నాయ మార్గంలో ప్రయాణించవలసి వచ్చింది. ఇదే అంశంపై భారత్ అంతర్జాతీయ పౌరవిమానాయాన సంస్థ వద్ద ఫిర్యాదు చేసింది.
భారత్ చేసిన ఫిర్యాదుపై స్పందించిన ఐసీఏఓ సమాఖ్య అధ్యక్షుడు ఒలుముయివా బెనార్డ్... ప్రధాని మోడీ వీవీఐపీ విమానం తమ గగనతలంలో ఎగిరేందుకు అనుమతి ఎందుకు ఇవ్వలేదో వివరణ ఇవ్వాలంటూ కోరారు. అయితే భారత్కు చెందిన వీవీఐపీలు ప్రయాణించే ప్రత్యేక విమానాలకు పాకిస్తాన్ గగనతలంలో అనుమతి ఉంటుందా లేదా అనేదానిపై మాత్రం స్పష్టత ఇంకా రాలేదు.
ఇదిలా ఉంటే సాధారణ పౌరులను మోసుకెళ్లే విమానాలకే ఇతర దేశాల గగనతలంలో అనుమతి ఉంటుందని అంతర్జాతీ పౌరవిమానాయాన కన్వెన్షన్లో నిబంధనలు ఉన్నాయి. ఒక దేశానికి చెందిన అధినేతల విమానాలు, లేక మిలటరీ విమానాలు మరోదేశ గగనతలంలో ఎగిరేందుకు అనుమతులు ఆయాదేశాలను బట్టి ఉంటాయని అంతకుముందు ఓ సందర్భంలో సమాధానంగా ఇచ్చింది ఐసీఏఓ సంస్థ.
193 దేశాలు పౌరవిమానాయాన రంగంలో సఖ్యతతో కూడి పనిచేసేలా చేయడమే ఐసీఏఓ ముఖ్య ఉద్దేశం. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగిన డాగ్ ఫైట్ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు, టెన్షన్ వాతావరణం మధ్య పాకిస్తాన్ గగనతలం భారత విమానాలకు జూలై వరకు మూసివేసింది. ఆ తర్వాత ఆగష్టులో భారత్ జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేయడంతో పరిస్థితులు రెండుదేశాల మధ్య మరింత తీవ్రతరమయ్యాయి.
ఫిబ్రవరిలో పుల్వామా దాడులు తర్వాత ప్రతీకార చర్యల్లో భాగంగా భారత్ బాలాకోట్పై మెరుపుదాడులు చేసింది. దీంతో భారత విమానాలు తమ గగనతలంలో ఎగిరేందుకు అనుమతి నిరాకరించింది పాకిస్తాన్. జూలై 16న భారత విమానాలు తమ గగనతలంలో ఎగిరేందుకు అనుమతి ఇచ్చింది. అయితే ఆర్టికల్ 370 రద్దుతో మళ్లీ ఆంక్షలు విధించింది పాకిస్తాన్.