covid vaccine: భారీ షాక్ -ముడిసరుకు ఆపేసిన అమెరికా -సీరం సంస్థకు ఆస్ట్రాజెనెకా నోటీసులు -చేతులెత్తేసినట్లేనా?
కరోనా వైరస్ సెకండ్ వేవ్ భయానకంగా విజృంభిస్తున్న తరుణంలో ప్రపంచానికి, మరీ ప్రత్యేకించి భారత్ కు ఇది పిడుగులాంటి వార్త. మన దేశంలో వ్యాక్సిన్ల తయారీ, పంపిణీలో ముందంజలో ఉన్న సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (సీఐఐ) సంస్థకు భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. వ్యాక్సిన్ల తయారీలో అతి కీలకమైన ముడిసరుకు పంపిణీ ఆగిపోవడం ఒక ఎత్తయితే, గడువులోగా అందించాల్సిన డోసుల్ని పంపని కారణంగా ఆ సంస్థ న్యాయపరమైన చిక్కుల్లో పడిపోయింది. ఈ వివాదాలకు సంబంధించి సీరం సీఈవో అదర్ పూనావాలా గురువారం మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలు చెప్పారు..
అనూహ్యం: సుప్రీంకోర్టు కొలీజియం గరం గరం -జస్టిస్ రమణకు పదవి దక్కినా భేటీ ఎందుకు? -తొలి మహిళా సీజేఐ!
ముడిసరుకు వెనక్కి..
వ్యాక్సిన్ల ఉత్పత్తికి సంబంధించి ప్రపంచంలోనే మేటి సంస్థగా ఉన్న సీరం ఇనిస్టిట్యూట్.. యూకేకు చెందిన ఆస్ట్రాజెనెకా ఫార్మా, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలతో కలిసి 'కొవిషీల్డ్' పేరుతో టీకాను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మన దేశంలో భారత్ బయోటెక్ వారి కొవాగ్జిన్ తోపాటు అనుమతి పొదిన కొవిషీల్డ్ ను విస్తృతంగా పంపిణీ చేస్తున్నారు. అయితే, ప్రస్తుతం తాము అనుకున్న స్థాయిలో టీకాలను ఉత్పత్తి చేయలేకపోతున్నామని, టీకాల తయారీకి కావాల్సిన ముడిసరుకును అమెరికా, యూరప్ దేశాలు వెనక్కి తీసుకుంటుండటమే ఇందుకు కారణమని సీరం సీఈవో అదర్ పూనావాలా చెప్పారు. ముడిసరుకు కొరతకుతోడు వ్యాక్సిన్ల ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో సంస్థాపరంగా తాము చేసుకున్న ఒప్పందాలను సైతం నెరవేర్చలేని దుస్థితికి దిగజారమని ఆయన పేర్కొన్నారు. చైనాలో ముడి సరుకు లభ్యత ఉన్నా, దాని నాణ్యతపై అనుమానాలుండటంతో ఆ దిశగా వెళ్లడంలేదన్నారు.
ఆస్ట్రాజెనెకా లీగల్ నోటీసులు
వ్యాక్సిన్ల ఉత్పత్తి కోసం యూకేకు చెందిన ఆస్ట్రాజెనెకా ఫార్మా, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీతో సీరం సంస్థ ఒప్పందాలు కుదుర్చుకోవడం విదితమే. అయితే, అమెరికా, ఇతర దేశాల నుంచి ముడిసరుకు ఆగిపోవడం, దేశీయంగా ఎగుమతులపై ఆంక్షలు విధించిన దరిమిలా ఆస్ట్రాజెనెకాతో ఒప్పందం చేసుకున్నని డోసులను ఎగుమతి చేయలేకపోయామని, అనుకున్న సమయానికి టీకాలను అందకపోవడం ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లే అవుతుంది గనుక ఆస్ట్రాజెనెకా సంస్థ ఓ లీగల్ నోటీసును కూడా సీరం సంస్థకు పంపిందని పూనావాలా తెలిపారు. పేద దేశాలకు కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కోసం ఐక్యరాజ్యసమితి నేతృత్వంలో ఏర్పాటైన కొవాక్స్, గవి లాంటి వ్యవస్థలకూ అనుకున్నన్ని వ్యాక్సిన్లను పంపలేకపోతున్నామని ఆయన చెప్పారు.
అమెరికా వెళ్లి ఆందోళన చేయాలనుంది..
''ప్రస్తుతం నెలకు గరిష్టంగా 6.5కోట్ల డోసులుగా ఉన్న ఉత్పత్తిని రాబోయే రెండు నెలల్లో, అంటే జూన్ లోగా 10 నుంచి 11కోట్ల డోసులకు పెంచాలని మేం ప్రణాళికలు రూపొందించాం. అది జరిగితే దేశీ అవసరాలతోపాటు విదేశాల్లోని ఇతర సంస్థలతోనూ మేం చేసుకున్న ఒప్పందాలను నెరవేర్చగలుగుతాం. కానీ వ్యాక్సిన్ తయారీలో వాడే ముడిసరుకును అమెరికా, యూరప్ దేశాలు నిలిపేశాయి, సరుకును వెనక్కి కూడా తీసేసుకుంటున్నాయి. దీంతో మేం దాదాపు నిస్సహాయ స్థితిలోకి జారుతున్నట్లయింది. వ్యక్తిగతంగా నేను అమెరికా వెళ్లి రోడ్లపై నిలబడి ఆందోళన చేయాలన్నంతగా భావోద్వేగంలో ఉన్నాను. ఆరు నెలల తర్వాత జరగబోయే ఉత్పత్తికి అవసరమైన ముడిసరుకును మేం చూసిపెట్టుకున్నాం. కానీ ఇప్పటికిప్పుడు, రాబోయే రెండు నెలల్లో ముడిసరుకు ఎద్దడి ఏర్పడింది. దీంతో..
కేంద్రానికి అన్నీ తెలుసు..
ఈ ఏప్రిల్ నాటికి గరిష్టంగా నెలకు 9కోట్ల డోసుల్ని ఉత్పత్తి చేయాలనుకున్నా, ఇప్పుడా టార్గెట్ ను కచ్చితంగా పూర్తి చేయలేని పరిస్థితిలో ఉన్నాం. ముడిసరుకు రవాణా ఆగిపోయిన సంగతిగానీ, మా భాగస్వామి ఆస్ట్రాజెనెకా నుంచి లీగల్ నోటీసులు అందిన సంగతిగానీ కేంద్ర ప్రభుత్వానికి తెలుసు. అయితే టీకాల ఎగుమతికి సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాలను మేం తప్పక ఫాలో అవుతాం. ఒప్పందాల ఉల్లంఘన వల్ల ఏర్పడే న్యాయపరమైన చిక్కులను పక్కన పెడితే, ముందుగా భారత్ అవసరాలు తీరాలన్నదే మా ప్రధాన ఉద్దేశం కూడా. ఇక్కడ పరిస్థితి కొంత అదుపులోకి వచ్చిన తర్వాతే ఎగుమతులపై దృష్టిపెడతాం. ఇప్పటికిప్పుడు మా ఉత్పత్తిని విస్తరించుకోడానికి రూ.3వేల కోట్లు అవసరం అవుతాయి. పూర్తి విపత్కర పరిస్థితి కానప్పటికీ, టైమ్ లిమిట్ పరంగా ఈ రెండు నెలలు కఠినమైన సవాళ్లు తప్పేలా లేవు'' అని సీరం సీఈవో అదర్ పూనావాలా అన్నారు. కాగా,
వ్యాక్సిన్ కొరత నిజమేనా?
అమెరికా, యూరప్ దేశాల నుంచి ముడి సరుకు రావడం నిలిచిపోయిందని, పాత ఒప్పందాల ప్రకారం టీకాలను పంపిణీ చేయలేని కారణంగా భాగస్వామి ఆస్ట్రాజెనెకా నుంచే లీగల్ నోటీసులు అందాయని సీరం సీఈవో పూనావాలా అధికారికంగా ప్రకటించడానికి కొద్ది రోజుల ముందునుంచే భారత్ లో కొవిడ్ వ్యాక్సిన్ కొరతపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో వ్యాక్సిన్ డోసులు నిండుకున్నాయని, కొత్త బ్యాచ్ ల కోసం కేంద్రానికి వినతులు చేశాయని వార్తలు రాగా, టీకాలకు ఎలాంటి కొదువ లేదని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ స్పష్టంచేశారు. తీరా ఇప్పుడు వ్యాక్సిన్ తయారీలో అగ్రగామి సీరం సంస్థే ఉత్పత్తిలో వెనుకపడ్డామని చెప్పడం గమనార్హం.