పాకిస్తాన్కు అమెరికా బిగ్ షాక్: పుతిన్తో ఇమ్రాన్ ఖాన్ భేటీ మరుసటి రోజే: తేరుకోలేని విధంగా
వాషింగ్టన్: రష్యా-ఉక్రెయిన్ మధ్య ఊహించినట్టే యుద్ధం ఆరంభమైంది. ఇది ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దూకుడు చూస్తోంటే ఉక్రెయిన్ను తన దారికి తెచ్చుకునేంత వరకూ యుద్ధాన్ని కొనసాగించేలా ఉన్నారు. దీనికి అనుగుణంగానే రెండో రోజూ తన దాడుల తీవ్రతను రష్యా మరింత పెంచింది. రాజధాని కీవ్ను లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతోంది. రష్యా సైనికులు కీవ్ను చుట్టుముట్టారు. వారిని నిలువరించడానికి ఉక్రెయిన్ బలగాలు శ్రమిస్తోన్నాయి. ధీటుగా బదులిస్తోన్నాయి.
రష్యాకు వెళ్లిన ఇమ్రాన్..
ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగిన రోజే- పాకిస్తాన్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్.. ఏకంగా రష్యాకు బయలుదేరి వెళ్లారు. వ్లాదిమిర్ పుతిన్తో సమావేశం అయ్యారు. ఈ యుద్ధంలో తాము రష్యాకు మద్దతు ప్రకటించామనే విషయాన్ని ఇమ్రాన్ ఖాన్ చెప్పకనే చెప్పినట్టయింది. పుతిన్తో క్రెమ్లిన్లో సమావేశమైన ఫొటోను పాకిస్తాన్ ప్రధానమంత్రి కార్యాలయం విడుదల చేసింది. అంతర్జాతీయ స్థాయిలో పలు కీలక అంశాలు వారిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు స్పష్టం చేసింది.
అగ్రరాజ్యానికి ఆగ్రహం..
ఇమ్రాన్ ఖాన్ చేసిన ఈ చర్య- అగ్రరాజ్యం అమెరికాను తీవ్ర ఆగ్రహావేశాలకు గురి చేసినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే రష్యాతో అమీతుమీ తేల్చుకోవడానికి అమెరికా సన్నద్ధమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్ ప్రధాని- రష్యా అధ్యక్షుడితో భేటీ కావడాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. రష్యాకు నేరుగా ఎలాంటి మద్దతు ఇచ్చినా తాము సహించబోమనే వైఖరిని బయటపెట్టింది అమెరికా. పాకిస్తాన్కు పరోక్షంగా హెచ్చరికలను జారీ చేసింది. ఆ దేశంపై భారీ జరిమానాను విధించింది.
55 మిలియన్ డాలర్ల పెనాల్టీ..
న్యూయార్క్ కేంద్రంగా అంతర్జాతీయ స్థాయిలో తన కార్యకలాపాలను నిర్వహిస్తోన్న నేషనల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్పై కళ్లు చెదిరేలా పెనాల్టీని విధించింది. దీని విలువ- 55 మిలియన్ డాలర్లు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్కు ఇది సబ్సిడరీగా పని చేస్తోంది. ఈ బ్యాంక్పై జరిమానా విధించినట్లు అమెరికాకు చెందిన ఫెడరల్ రిజర్వ్ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది. మనీలాండరింగ్ చట్టాలు, నిబంధనలను నేషనల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ ఉల్లంఘించేలా వ్యవహరించిందని పేర్కొంది.
మనీలాండరింగ్ యాక్ట్
తమ దేశానికి చెందిన మనీలాండరింగ్ నిరోధక నిబంధనలు, చట్టాలను ఉల్లంఘించినట్లు తమ దర్యాప్తులో తేలిందని, దీనిపై మరింత లోతుగా విచారణ సాగిస్తున్నామని ఫెడరల్ రిజర్వ్ బోర్డు తెలిపింది. మనీ లాండరింగ్ నిరోధక కార్యకలాపాలను పాకిస్తాన్ నేషనల్ బ్యాంక్ సమర్థవంతంగా అనుసరించట్లేదనే విషయం తమ దృష్టికి, వాటిని సమర్థవంతంగా అమలు చేయడంలో విఫలమైందనే విషయం వచ్చిందని పేర్కొంది.
మరింత లోతుగా దర్యాప్తు..
దీన్ని దృష్టిలో ఉంచుకుని 55 మిలియన్ డాలర్ల పెనాల్టీని విధించాల్సి వచ్చినట్లు న్యూయార్క్ స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సూపరింటెండెంట్ ఆడ్రియాన్నె హ్యారిస్ తెలిపారు. ఈ పెనాల్టీని చెల్లించడానికి పాకిస్తాన్ నేషనల్ బ్యాంక్ అంగీకరించిందని చెప్పారు. ఈ విషయంపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తోన్నామని, బ్యాంక్ సెక్రెటరీ యాక్ట్/యాంటీ మనీల్యాండరింగ్ రిక్వైర్మెంట్స్ కింద దర్యాప్తు సాగుతోందని పేర్కొన్నారు.