తక్షణమే భారత్కు కోవీషీల్డ్ ముడి సరుకు... కోవిడ్ మెడికల్ సప్లై... అమెరికా కీలక ప్రకటన...
భారత్లో కోవీషీల్డ్ వ్యాక్సిన్ తయారీకి అవసరమైన ముడి సరుకులను తక్షణమే భారత్కు పంపిస్తామని అమెరికా వెల్లడించింది. ఈ మేరకు అమెరికా జాతీయ భద్రతా కౌన్సిల్(ఎన్ఎస్సీ) ప్రతినిధి ఎమిలీ హార్నే ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.'భారత్లోని కోవిడ్ పేషెంట్లు,ఫ్రంట్ లైన్ వర్కర్లకు సాయం చేసేందుకు అమెరికా నుంచి ర్యాపిడ్ డయాగ్నస్టిక్ టెస్ట్ కిట్స్,వెంటిలేటర్స్,పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్(పీపీఈ) పంపించనున్నాం.' అని తెలిపారు.
భారత్లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి పట్ల అమెరికా అత్యంత సానుభూతితో ఉందని... భారత్కు అవసరమైన మెడికల్ సాయాన్ని తక్షణమే అందజేస్తామని ఎమిలీ హార్నే తెలిపారు. ఆక్సిజన్ జనరేషన్ దానికి సంబంధించిన ఇతరత్రా మెడికల్ సప్లైని కూడా తక్షణ ప్రాతిపదికన పంపించే యోచనలో ఉన్నట్లు అమెరికా వెల్లడించింది.
నిజానికి భారత్లో కోవీషీల్డ్ వ్యాక్సిన్ తయారీకి అవసరమైన ముడి సరుకు సరఫరాపై అమెరికా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. భారత్ తమకు కీలక భాగస్వామి,మిత్ర దేశం అని చెప్పుకునే అమెరికా... ఇంతటి విపత్కర కాలంలో ఇలా ఆంక్షలు విధించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. గత వారం సీరమ్ ఇన్స్టిట్యూట్ సీఈవో పూనావాలా... కోవీషీల్డ్ ముడి సరుకు సరఫరాపై ఆంక్షలు ఎత్తివేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు ట్వీట్ కూడా చేశారు.
ఈ నేపథ్యంలోనే శుక్రవారం(ఏప్రిల్ 23) భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివాన్ ఫోన్లో మాట్లాడారు. సీరమ్ ఇన్స్టిట్యూట్ కోవీషీల్డ్ వ్యాక్సిన్ తయారీకి అవసరమైన ముడి సరుకును సరఫరా చేస్తామని ఈ సందర్భంగా సలివాన్ అజిత్ దోవల్తో వెల్లడించారు. తాజాగా దీనికి సంబంధించి అమెరికా నుంచి అధికారిక ప్రకటన వెలువడినట్లయింది.
భారత్కు అవసరమైన సాయం అందించే విషయంలో యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్తోపాటు అక్కడి చట్టసభల ప్రతినిధులు, ప్రముఖ ఇండియన్ అమెరికన్లు బైడెన్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. స్టోరేజీలో అదనపు వ్యాక్సిన్లను భద్రపరిచే బదులు... వాటిని భారత్,బ్రెజిల్ లాంటి దేశాలకు అందించాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం అమెరికా కంటే ఆ దేశాలకే ఈ వ్యాక్సిన్ల అవసరం ఎక్కువగా ఉందని వాదించారు. దీంతో అమెరికా ప్రభుత్వం దిగిరాక తగ్గలేదు. వ్యాక్సిన్ల సరఫరాపై ప్రకటన చేయకపోయినప్పటికీ ఇతరత్రా మెడికల్ సామాగ్రిని సరఫరా చేసేందుకు ఆ దేశం ముందుకొచ్చింది.